Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకుంది. ఆర్థికాభివృద్ధి ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5శాతం కుదింపునకు గురైంది. అత్యధిక జనాభాకు జీవనోపాధిగావున్న వ్యవసాయరంగం అభివృద్ధి అంతకంటే తక్కువగా 2శాతమే ఉంది. అదే కాలంలో తయారీరంగం కేవలం 0.6శాతం వృద్ధి మాత్రమే సాధించింది.
అనేక పారిశ్రామిక విభాగాలలో ఉద్యోగిత సన్నగిల్లింది. ఆటోమొబైల్స్, మైనింగ్, స్టీల్, టెక్స్టైల్, రవాణా, నిర్మాణం, రియల్ ఎస్టేట్, ఐటీ, జెమ్ అండ్ జువెల్రీ, లెదర్, బిస్కెట్ల వంటి అనేక వినిమయ వస్తువులు, వీటికి అనుబంధంగావున్న అనేక వేల యాన్సిల్లరీ పరిశ్రమలలో ఉద్యోగుల సంఖ్య తగ్గించారు. ఇప్పటికే వచ్చిన ఒక అంచనా ప్రకారం 10లక్షలమందిని ఉద్యోగాలనుంచి తొలగించారు. వచ్చేనెలలో ఉద్యోగిత పరిస్థితి మరింతగా క్షీణించనుంది.
ఈ మందగమనం గురించి కార్పొరేట్ సంస్థలు, వాటి ప్రతినిధులు, మీడియా చేసే హడావిడి అంతాఇంతా కాదు. 'సంపద సృష్టికర్తలు' అని ప్రధాని మోడీచేత కీర్తించబడినవాళ్ళ ఏడుపులు, పెడబొబ్బలమధ్య మోడీ ప్రభుత్వం ఎగుమతులపై మరిన్ని సబ్సిడీలు, మరింత ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, మరింత పెట్టుబడుల ఉపసంహారం, రియల్ ఎస్టేట్కు మరింత డబ్బు, బ్యాంకుల విలీనం వంటి రాయితీలను అందించ బోతోంది. అయితే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో పనిచేస్తున్న రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు ఏమి జరగబోతోంది? అనే విషయం గురించి భరించలేని నిశ్శబ్దం నెలకొని ఉంది. సంపన్నులకు తోడ్పాటును అందిస్తే కింది తరగతుల ప్రజలకు లాభాలు ఏదోవిధంగా వాటంతటవే అందుతాయనే అప్రకటిత ఊహన ఇక్కడ రాజ్యమేలుతోంది.
ప్రభుత్వానికున్న ఈ తప్పుడు అవగాహనవల్ల రాబోయే నెలలలో ప్రజలు తీవ్రమైన క్షోభ అనుభవించనున్నారు. తీవ్రమైన సమిష్టి డిమాండ్ కొరత ప్రధాన సమస్యగా ఉండగా ప్రభుత్వం ప్రయివేటురంగానికి మరిన్ని రాయితీలను ప్రకటిస్తూ ఆ రంగంలో పెట్టుబడుల్ని బలోపేతం చేస్తోంది. ప్రజల చేతుల్లో కొనుగోలుశక్తి లేదు. ఆర్థిక కార్యకాలాపాలను పెంచి, వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను పెంచటం, ధాన్య సేకరణను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచటం, ప్రభుత్వ వ్యయాన్ని పెంచి ఆర్థిక కార్యకలాపాలను పెంచటంవంటి చర్యల ద్వారా సమిష్టి డిమాండ్ను బలోపేతం చేస్తేనే సంక్షోభం పరిష్కారం అవుతుంది. ప్రభుత్వ వ్యయం పెంచటమంటే కార్పొరేట్ల, బహుళజాతి కంపెనీల జేబులు నింపటం కాదు. ప్రభుత్వ వ్యయాన్ని పెంచటం అంటే విద్య, ఆరోగ్యం, ఉద్యోగుల వేతనాలు(కాంట్రాక్టు కార్మికులతోసహా), తదితర అంశాలపై వ్యయం చేయటం. అయితే గతంలో కాంగ్రెసు ప్రభుత్వంలాగానే మోడీ ప్రభుత్వానికి ఇటువంటి చర్యలపట్ల విముఖత ఉంది. ఈలోపు కార్పొరేట్ సంపన్నులు కాకుండా వాస్తవంలో సంపదను సృష్టించే దేశ ప్రజలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో చూద్దాం.
విపరీతంగా పెరుగుతున్న నిరుద్యోగం
పైన పేర్కొన్న ఉద్యోగాలు ఊడిపోవటం నిరుద్యోగ సంక్షోభం నేపథ్యంలో జరుగుతోంది. నిరుద్యోగ సంక్షోభం ఉందని అంగీకరించటంగానీ, దాన్ని పరిష్కరించాలనే స్పృహగానీ మొదటినుంచీ మోడీ ప్రభుత్వానికి లేదు. వర్తమానంలో సీఎమ్ఐఈ అంచనాల ప్రకారం 2019, ఆగస్టు నెలలో నిరుద్యోగం రేటు 8.37శాతంగా ఉంది. రెండేండ్ల క్రితం అది 3.37శాతమే ఉంది.
వర్తమానంలో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటంవల్ల అసలే తీవ్రంగావున్న నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతోంది. అయితే మోడీ ప్రభుత్వం సమస్యను పరిష్కరించటానికి ఇప్పటికీ ప్రయివేటు రంగంలోని ఆశ్రితులపైనే ఆధారపడుతోంది. సంక్షోభం పరిశ్రమల రంగాన్ని ఆవహించకముందరే ఉద్యోగ కల్పన చేయలేనప్పుడు యిప్పటి మందగమన పరిస్థితులలో ఉద్యోగ కల్పన ఎలా సాధ్యం?
శ్రామిక ప్రయోజనాలను పరిరక్షించే చట్టాలను లేకుండా చేయటం, ఉద్యోగులను ఎప్పుడంటే అప్పుడు తీసివేయగలగటం, వేతనాలను కుదించటంవంటి చర్యలతో పారిశ్రామికవేత్తలు మరింతమందికి ఉద్యోగాలు ఇస్తారని మోడీ ప్రభుత్వం అనుకుంటోంది. అయితే అది ఇంతకుముందు జరగలేదు. ప్రస్తుతం అది దుస్సాధ్యం. అది వేలాదిమందిని ఉద్యోగాలనుంచి బయటకు నెట్టటంగా పరిణమిస్తుంది.
కొనసాగుతున్న గ్రామీణ నిస్పృహ
గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితులు మరింతగా క్షీణించాయి. భారత జనాభాలో 50శాతం ప్రజలకు ఉపాధినందిస్తూ కొనుగోలు శక్తినిచ్చే వ్యవసాయరంగం సంక్షుభితంగా మారింది. ఖరీఫ్ వ్యవసాయ ఉత్పత్తులకు నామమాత్రపు మద్దతు ధరనే ఈ పిసినారి ప్రభుత్వం ప్రకటించింది. ఉదాహరణకు గతేడాది వరి ధాన్యానికి ప్రకటించిన మద్దతుధరలో పెరుగుదల కేవలం 4శాతమే ఉంది. అనేక రాష్ట్రాలలో ఉత్పత్తి వ్యయం అంతకంటే ఎక్కువగా ఉంది. మొత్తంమీద గరిష్ఠ మద్దతుధర ఇన్పుట్స్ వ్యయంతోపాటు అదనంగా ఉండవలసిన 50శాతం కంటే చాలా తక్కువగా ఉంది. ఇన్పుట్స్ వ్యయంలో కుటుంబ శ్రమ, భూమి సంబంధ వ్యయం కూడా ఉంటుంది.
కాబట్టి ప్రభుత్వం రైతులకు వనరులను బదిలీచేయటానికి సిద్ధపడటం లేదు. అలాచేసినట్టయితే గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థకు సహాయకారిగా ఉండేది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆకలిచావులు నమోదవుతున్నప్పటికీ ఆహార ధాన్యాల గిడ్డంగులలో పేరుకుపోయిన ధాన్యాన్ని బయటకు తీయటానికి ప్రభుత్వం సిద్ధపడకపోవటం దాని కాఠిన్య ధోరణినీ తెలియజేస్తోంది. 2019 జులై నెలలో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని పూల్లో బియ్యం, గోధుమలు, ఇతర ముతక ధాన్యం రికార్డ్ స్థాయిలో 742లక్షల టన్నులు దాకా ఉంది. ఇది గతేడాదికంటే 14శాతం అధికం. మరోవైపు ఈఏడాది జులై నెలదాకా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ కోసం బయటకు తీసిన ధాన్యం కేవలం 195లక్షల టన్నులే. గతేడాదికంటే ఇది కేవలం 4శాతం మాత్రమే ఎక్కువ. ఈ వైఖరి దేశ ప్రజల బాధల్ని పట్టించుకోవటంలో మోడీ ప్రభుత్వం చూపుతున్న ఉదాసీన వైఖరిని తెలపటమే కాకుండా వేగంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయటానికి డబ్బును ఖర్చు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవటాన్ని కూడా సూచిస్తోంది. ప్రజలు ఎంత దారిద్య్రంలో మగ్గుతున్నారో గిడ్డంగుల నిండా పేరుకుపోయిన ఆహారధాన్యాలు తెలియజేస్తున్నాయి. ఎఫ్ఏఓ అంచనా ప్రకారం 2019లో 20కోట్లమంది భారతీయులు బహిరంగ మార్కెట్లో ఆహారధాన్యాల్ని కొనలేక ఆకలితో అలమటిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థలో అత్యంత నిరుపేదలు, అత్యంతగా దోపిడీకి గురయ్యే 15కోట్ల వ్యవసాయ కార్మికులు చాలా కాలంగా ప్రభుత్వ దృష్టిలో లేరు. గత రెండేండ్లలో వ్యవసాయ కార్మికుల వేతనాలు కేవలం రూ.20.25 లేక 3.8శాతం మాత్రమే పెరిగాయి. ఇదే కాలంలో రిజర్వ్బ్యాంకు సమాచారాన్ని అనుసరించి వ్యవసాయ కార్మికుల వినిమయ ధరల సూచిక 4శాతం పెరిగింది. అంటే ద్రవ్యోల్బణంతో కాస్తోకూస్తో పెరిగిన వేతనాలు మాయమవుతున్నాయి. నిజవేతనాలు క్షీణిస్తున్నాయి.
వేతనాలను పెంచటం ద్వారా, వాటిని అమలు చేయటం ద్వారా గ్రామీణరంగంలోకి అవసరమైన నగదును పంపు చేయటం అటుంచి వ్యవసాయ కార్మికుల దుస్థితిని గమనంలోకి తీసుకోవటానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇటువంటి పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్ పాతాళంలో ఉండటంలో ఆశ్చర్యం ఏమీలేదు.
పారిశ్రామిక కార్మికుల వేతనాలు
కార్మికులపట్ల, ఉద్యోగులపట్ల మోడీ ప్రభుత్వం ప్రతికూలంగా ఉంది. వేతనాలు, పనిగంటలు హేతుబద్దంగా నిర్ణయించటానికి, ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్దేశింపబడిన శ్రామిక చట్టాలను మోడీ ప్రభుత్వం సవరించింది. ఈ మధ్యకాలంలో ఆమోదించిన వేతనాల కోడ్, భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. నిజానికి సవరించిన జాతీయ స్థాయి కనీస వేతనం రోజుకు 178రూపాయలని కార్మిక మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం తన ఉద్యోగులకు అంగీకృత నియమానుసారం ఆమోదించిన కనీస వేతనానికి, భారత లేబర్ కాన్ఫరెన్స్, సుప్రీంకోర్టు కూడా అంగీకరించిన కనీస వేతనంలో ఇది మూడవ వంతుకంటే తక్కువ.
రెండు రాష్ట్రాలలోతప్ప దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన కనీస వేతనం నియమానుసారం ఉండవలసిన రూ.18000లల్లో సగానికంటే తక్కువగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చినందున ఇక కార్మికులకు వేతనాలు పెరగటం ఉండదు.
ప్రభుత్వంచేత నియమితులైన అనేక రకాల కార్మికులకు (అంగన్వాడీ కార్మికులు, సహాయకులు, మిడ్ డే మీల్ కుక్స్, ఆశా, ఏఎన్ఎమ్ వర్కర్స్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్లు) లేక ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ఎంత మొత్తుకున్నా నామమాత్రపు వేతనమే లభిస్తుంది.
విద్యకు, ఆరోగ్యానికి నిధుల కుదింపు
ప్రధాన రంగాలైన విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వం చేసే వ్యయం పేదలకు ఉపయోగపడేదిగాను, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ని బలోపేతం చేసేదిగాను ఉంటుంది. ఈ రెండు రంగాలలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచితే మంచి విద్య, ఆరోగ్య సంరక్షణ అందరికీ అందటమే కాకుండా ప్రయివేటు సంస్థల సేవలకు అధిక మొత్తాలను చెల్లించనవసరం ఉండనందున ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఇలా చేసిన పొదుపు సమాజంలో డిమాండ్ను బలోపేతంచేసి ఆర్థిక వ్యవస్థకు సహాయకారిగా మారుతుంది. విద్యపై మోడీ ప్రభుత్వం చేస్తున్న వ్యయం 2014-15 బడ్జెట్లో 4.1శాతం ఉండగా అది 2019-20 బడ్జెట్లో 3.4శాతానికి పడిపోయింది. స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై చేస్తున్న వ్యయం 0.55శాతం నుంచి 0.45శాతానికి క్షీణించింది.
ఆరోగ్యంపై చేస్తున్న వ్యయం మొత్తం బడ్జెట్లో 1.9శాతం నుంచి 2.4శాతానికి పెరిగింది(ఈ పెరుగుదల ప్రధానంగా భీమా ప్రీమియంపై అదనంగా చేసిన వ్యయం కారణంగా సంభవించింది. ఈ మొత్తం నేరుగా కార్పొరేట్ కంపెనీల జేబుల్లోకే వెళుతుంది). స్థూల జాతీయోత్పత్తిలో ఆరోగ్యంపై చేస్తున్న వ్యయం కేవలం 3శాతంవద్ద స్తంభించింది. ఆరోగ్యంపై చేయవలసిన వ్యయం స్థూల జాతీయోత్పత్తిలో కనీసం 5-6 శాతమైనా ఉండితీరాలని నిష్ణాతులు అభిప్రాయపడుతున్నారు.
ఆ విధంగా విద్య, ఆరోగ్యం ప్రయివేటీకరించటం వల్ల కుటుంబాలపై అధిక భారం పడుతుంది. పర్యవసానంగా ప్రజలు ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే వివిధ రకాల వినిమయ వ్యయాన్ని తగ్గించుకుంటారు. వీటన్నింటిబట్టి చూసినప్పుడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలవల్లనే సంక్షోభం ఏర్పడింది. ఈ తప్పుడు విధానాలనే ప్రభుత్వం కొనసాగిస్తోంది. వర్తమానంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించటానికి ఈ విధానాలు ఏమాత్రం ఉపయోగపడవు. మతతత్వం, కుహనా జాతీయవాదం, జాతీయ దురహంకారం, కాశ్మీర్, పాకిస్థాన్, రామ మందిరం తదితర విషయాలలో తలమునకలై ప్రజలు అచేతనంగా ఉంటారని మోడీ, ఆయన మిత్రుడు అమిత్ షా ఆశిస్తున్నారనుకుంటా. అయితే ఆర్థిక దుస్థితి వ్యాపి స్తున్నతీరు వాళ్ళను నిశ్చేష్టులను చేయగలదు. ఒక హిందీ సామెత చెప్పినట్టు ఆకలితో ఉన్న ప్రజలు కీర్తనలు పాడటాన్ని కొనసాగించరు.
- అనువాదం: నెల్లూరు నరసింహారావు
- సవేరా
సెల్: 8886396999