Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని, జీహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీ సంస్థకు రావల్సిన నిధుల్ని ఇవ్వాలని, ఎం.వి.టాక్స్తో పాటు అన్ని రకాల పన్నుల నుంచి ఆర్టీసీ సంస్థను మినహాయించాలని, 2017 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావల్సిన వేతన సవరణ వెంటనే అమలులోకి తీసుకురావాలని కార్మికులు ఎన్నో విన్నపాలు, విజ్ఞప్తులు చేశారు. ఆర్టీసీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ పట్టంచుకోకుండా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించినందున కార్మికులు సమ్మెలోకి వెళ్లాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించవల్సిన అవసరం ఉన్నది.
సంక్షేమమే మా ఎజెండా అన్నారు. ఆర్టీసీని నష్టాల నుంచి నివారించే సత్తా మాకే ఉందని కేసీఆర్ డబ్బా కొట్టాడు. అధికారానికి వచ్చిన తర్వాత తాను సంస్కరణ వాదిని కాదు సంక్షేమ వాదినని గొప్పలు చెప్పుకున్న సీఎంసారు ఆచరణలో మాత్రం తాను పక్కా సంస్కరణ వాదినని తన పాలనతో రుజువు చేశాడు. ఒక ధనిక రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు, నిరుద్యోగులకు భరోసా కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యాడు. అదే సీఎం ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రపంచ దేశాలలో ఉన్న బడా కార్పొరేట్ శక్తులకు మాత్రం భరోసా కల్పించడంకంటే మోసం మరొకటి ఉందా! 1995-96 నాటికి ఏటా నూటముప్పయి అయిదు కోట్లకు పైగా లాభాల్లో ఉన్న ఆర్టీసీ నేడు మూడువేల కోట్ల అప్పుల్లో మునగడానికి కారణం ఎవరు? మౌలికరంగంలో అతి కీలకమైన రవాణా రంగంలో ప్రజల అవసరాలు తీరుస్తున్న ఆర్టీసీకి కనీస చేయూతనివ్వకపోగా, తమ రాజకీయ ప్రయోజనాలకు సంస్థను బలిచేస్తున్న ప్రభుత్వాలు కాదా? ఈ ప్రభుత్వాలు అనుమతించిన ఏ ప్రయివేటు ట్రాన్స్పోర్టు సంస్థయినా నష్టాల్లో ఉందా..? మరి ఆర్టీసీ మాత్రం ఎందుకునష్టాల పాలవుతోంది? ఇది ప్రభుత్వాల, యాజమాన్యాల అసమర్థత కాదా? అనేక లాభదాయక రూట్లలో ప్రయివేటు క్యారేజీలకు అనుమతులిచ్చి ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టడమేగాక, ఆర్టీసీపై భారాలు మోపుతున్న ప్రభుత్వాలది వంచన కదా..? ఈ పరిస్థితుల్లో కార్మికులు సమ్మె చేస్తున్నది సంస్థ మనుగడకే తప్ప మరొకటి కాదు. ఈ పరిణామాన్ని గుర్తించి, సంక్షేమం మా ఎజెండా అన్న కేసీఆర్ ఆర్టీసీపైన పునరాలోచన చేయాలి.
గ్రామీణ ప్రాంతాలకు నడుపుతున్న పల్లెవెలుగు బస్సులకు వస్తున్ననష్టాల భర్తీకి, మెట్రో రైలుకు చెల్లిస్తున్న తరహాలోనే ఫయబిలిటి ఫండ్ను ఏర్పాటు చేయాలని, అద్దె బస్సులను రద్దు చేసి ఆర్టీసీ సంస్థయే నూతన బస్సులను కొనుగోలు చేసి నడపాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సంస్థను నష్టాల నుంచి బయటపడేయటానికి కార్మికులు చేస్తున్న ఈ డిమాండ్స్ సామాజిక కోణంలోనూ ప్రయోజనకరం. ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు కూడా దోహదం చేసేవి. కార్మికులకు పెరుగుతున్న పని భారం నియంత్రించడానికి, ఇతర నష్టాలు వాటిల్లకుండా సంస్థకు మరింత పటిష్టపరచి సమర్థవంతంగా నిర్వహించడానికి సంస్థలో అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కూడా కార్మికులు కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులు చేసే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తద్వారా సమ్మె నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి. కార్మిక కుటుంబాలను సంరక్షించాలి.
- తోట రాజేశ్
సెల్: 9949343931