Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత నెల రోజుల కాలంలో దేశంలో కీలకమైన స్థానాల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మూడు ప్రకటనలు చేశారు. మొదటి ప్రకటన కేంద్ర హౌంశాఖా మంత్రి అమిత్షాది. జమ్మూ కాశ్మీర్లో ఆంక్షలు ఉన్నాయని విదేశీ మీడియా గగ్గోలు పెడుతోంది నిజానికి అటువంటి ఆంక్షలు అమల్లో లేవు. విమర్శకుల ఆలోచనల్లోనే సదరు ఆంక్షలు ఉన్నాయన్నది వారి హితోపదేశం. రెండోది దేశంలో మూక హత్యలు లేనేలేవు అది విదేశీ ఆలోచనతో ప్రేరణ పొందిన వ్యక్తుల ప్రచారం అన్నది ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ విజయదశమి సందేశం. మూడోది దేశంలో ఆర్థిక సంక్షోభం లేనేలేదు. విమర్శకులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్య. ఈ మూడింటి సారాంశం ఒక్కటే. లేనివి ఉన్నట్టుగానూ ఉన్నవి లేనట్టుగానూ ఊహించుకుని నరేంద్ర మోడీ పాలనపై దుమ్మెత్తి పోయటమే లక్ష్యంగా కుట్ర జరుగుతున్నదని దేశాన్నీ ప్రపంచాన్నీ నమ్మించచూడటమే. ఆదిశంకరుని అద్వైత సారం కూడా ఇదే. అద్వైతాన్ని అవపోసన పట్టిన ఆరెస్సెస్ బీజేపీలు సాగిస్తున్న ఫేక్ న్యూస్ క్యాంపెయిన్ దేశానికి కొత్తేమీ కాదు. మూకహత్యలు కూడా ఈ ఫేక్ న్యూస్ ప్రభావమేనని స్వయంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
దేశమంతా విజయదశమి వేడుకలు జరుపుకుంటున్న వేళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మేధావులు, విశ్లేషకులు, వ్యాఖ్యాతలకు పెద్ద పని పెట్టాడు. భారతీయ సంస్కృతిలో మూకహత్యలకు తావు లేదన్న వాదన ముందుకు తెచ్చాడు. పైగా విదేశీ మత సాంప్రదాయాల ప్రభావంలో పడిన కొందరు ఈ పదాన్ని విచ్చలవిడిగా ప్రయోగిస్తూ దేశ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారని వాపోయాడు. ఈ పదం భారతీయ సాంస్కృతిక సాంప్రదాయంలో లేదన్న వాదన నెగ్గించుకోవటానికి ఆయన ముందుకు తెచ్చిన వాదనలు కూడా వింతగా ఉన్నాయి. విజయదశమి నాడు సర్సంఫ్ు చాలక్ ఏటా ఆనవాయితీగా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం, నాగపూర్ నుంచి ఇచ్చే ఉపన్యాసంలో ఆయన ''మూకహత్య ప్రస్తావన భారతీయ విలువల్లో ఎక్కడా కనిపించదు. వేరే మతానికి చెందిన మత గ్రంధాల్లో దీని మూలాలున్నాయి. భారతీయులం సోదరభావంపై నమ్మకం ఉన్న వాళ్లం. భారతీయులపై అటువంటి పదాలు రుద్దొద్దు'' అన్నారు.
ఆంగ్లం-తెలుగు పదకోశంలో ఈ పదానికి అర్థం వెతికితే దొరకలేదు. ఈ పద ప్రయోగం ఎలా ఉనికిలోకి వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. 1493లో ఐర్లాండ్కు చెందిన జేమ్స్ లించ్ ఫిట్జ్ స్టీఫెన్ గాలవే పట్టణానికి మేయర్గా ఉండేవాడు. తన కొడుకు ఓ హత్యా నేరంలో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కోవటంతో తన ఇంట్లోనే ఉరితీశాడు. మన దేశంలో చూస్తున్న పరువు హత్య లాంటిదన్నమాట. అయితే అమెరికా విప్లవ కాలంలో ఈ పదం వాడకంలోకి వచ్చింది. తొలిసారి వర్జీనియా రాష్ట్రంలో దిగువ స్థాయి న్యాయాధికారి. అమెరికా విప్లవంలో పాల్గొన్న వ్యక్తి. అప్పట్లో అమెరికాలో ఉన్న బ్రిటన్ సమర్ధుకులకు ఎటువంటి న్యాయస్థానంలో విచారణ లేకుండా ఏడాదిపాటు జైలు శిక్ష విధించాడు. పౌర హక్కులే ప్రధాన ఎజెండాగా సాగిన ఈ అమెరికా విప్లవ కాలంలో చార్లెస్ లించ్ చర్య పెద్దఎత్తున రాజకీయ దుమారానికి తెర తీసింది.
అంతేకాదు, అమెరికాలో బానిసత్యం రద్దయి విముక్తి పొందిన బానిసలకు ఓటు హక్కు దక్కటంతో ఎన్నికల్లో తమ ఆధిపత్వం కొనసాగించేందుకు వలస వచ్చిన తెల్లజాతి ప్రజలు అనుసరించిన వ్యూహం మూక హత్యలు. దీంతో అప్పట్లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ఆఫ్ కాన్ఫెడరేషన్లో తనకున్న పలుకుబడితో లించ్ లా (లించ్ చట్టం) చేయించుకుని నిర్దోషిగా బయటపడ్డాడు. నాటి నుంచీ అమెరికా సామాజిక, న్యాయ పరిభాషలో చట్టంతో పనిలేకుండా ఒక సమూహాన్ని, కొందరు వ్యక్తులను బహిరంగంగా దండించటం లించింగ్ అన్న పదానికి సమానార్థకంగా మారింది. అందుబాటులో ఉన్న చరిత్ర ప్రకారం 1882 నుంచీ 1968 వరకు అమెరికాలో 3500 మంది నల్లజాతీయులు, 1300మంది తెల్లజాతీయులు ఈ మూకహత్యలకు బలయ్యారు. ఈ వివరాలు పరిశీలిస్తే ఇది ఓ రాజకీయ సమూహం మరో సమూహంపై ఆధిపత్యం స్థిరపర్చుకోవటానికి ప్రయోగించే సాధనంగానే మూకహత్యలు ఉన్నాయన్నది వాస్తవం.
ఇక్కడ మోహన్ భాగవత్ చెప్పినట్టు బైబిల్ కథతోనో, లేదా మక్కా ప్రాంతంలో నల్లరాయిని రాళ్లతో కొట్టే కథతోనే లించింగ్కు సంబంధం లేదు. ఇది వర్తమాన చరిత్ర. మూకుమ్మడి హింసే తొలినాళ్లల్లో ఉత్తర అమెరికా ప్రాంతంలో స్థిరపడ్డ తెల్లజాతి ప్రజలు స్థానిక నల్లజాతి ప్రజలపై ఆధిపత్యం స్థిరపర్చుకోవటానికి ప్రధాన ఆయుధంగా మారింది. ఒక సామాజిక తరగతి, వర్గంపై మరో సామాజిక తరగతి, వర్గం ఆధిపత్యం సాధించటమే అన్ని నాగరికతల చరిత్ర. భారతీయ నాగరికత అందుకు భిన్నమైనదేమీ కాదు. ఈ రకమైన చట్టంతో పని లేని శిక్షలు విధించే సాంప్రదాయం భారతదేశంలో లేకపోతే శంభూక వధ ఎందుకు జరిగినట్టు? ఏ చట్టం ప్రకారం శంభూకుడి హత్యను సమర్ధించాలి? దేశంలో కనీసం ఆరో శతాబ్దం నుంచీ దళితులు, బలహీనవర్గాల ప్రజల ఆహార వ్యవహారాలు, వేషభాషలపై ఉన్న ఆంక్షలు ఏ చట్టం మేరకు రుద్దబడ్డాయి?
మోహన్ భాగవత్ ఈ దేశంలో ఎక్కడన్నా మూక హత్యలు జరిగాయా అని ప్రశ్నించీ.. లేదే..! అని ఆయనే సమాధానం ఇచ్చాడు. చిన్నప్పుడు కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఓ పెద్దాయన చెప్పిన మాట గుర్తొస్తోంది. కాలేజీ గ్రంథాలయాల్లో ఏ పుస్తకం అయినా తీసుకుని చదువుకునే స్వేచ్ఛ విద్యార్థులకుంటుంది. కానీ గ్రంథాలయంలో ఏ పుస్తకం పెట్టాలో నిర్ణయించేది మాత్రం కాలేజీ యాజమాన్యం. అంటే మనకున్న స్వేచ్ఛ ఎవరో గీసిన గీత పరిధికి లోపలే తప్ప ఒక మనిషి మనిషిగా బతకటానికి ఉన్న స్వేచ్ఛ కాదు అన్నది ఆ పెద్దాయన చెప్పదల్చుకున్న విషయం. మోహన్ భాగవత్ మాటల్లో కూడా అదే సూత్రం ధ్వనిస్తోంది. దేశంలో మూక హత్యలు లేవన్న నిర్థారణకు ఆయన రావటానికి ఓ కారణం జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కల్లో ఆ కేటగిరీ కనిపించకపోవటం. సాధారణంగా దేశంలో జరిగే నేరాల్లో నమోదైన నేరాలన్నింటినీ ఈ బ్యూరో లెక్కలోకి రావు. గ్రంథాలయంలో ఏ పుస్తకాలు ఉంచాలో నిర్ణయించే స్వేచ్ఛ కాలేజీ యాజమాన్యానికి ఉన్నట్టే ప్రభుత్వ రికార్డుల్లో లేదా పురావస్తు శాఖ తాఖీదుల్లో ఏ కాగితం ఏ వివరం ఏ లెక్క నమోదు చేయాలో ఏది చేయకూడదో అన్నది కూడా నిర్ణయించేది ఆ ప్రభుత్వమే... ఈ తప్పుడు లెక్కల ప్రామాణికంగా తీసుకుంటే దేశంలో మూక హత్యలు లేవు అని నమ్మమంటున్నాడు సర్ సంఫ్ుచాలక్.
చరిత్రకందని కాలంలో జరిగిన మూక హత్యలు, దళిత హత్యలు పక్కన పెడదాం. అందుబాటులో ఉన్న వివరాలే పరిశీలిద్దాం. 2006లో మహారాష్ట్ర, భాందారా జిల్లా ఖైర్లాంజిలో ఓ దళిత కుటుంబాన్ని కుంబీ (రైత్వారీ కులం) సామూహికంగా పట్టపగలు హత్య చేయటం దేశాన్ని కలవర పెట్టింది. హర్యానాలో దళిత యువకులు దళితేతర యువతులను పెండ్లి చేసుకున్న సందర్భాల్లో జరిగిన దురహంకార హత్యలు లెక్కల్లోనే లేవు. 2014 వరకు దళిత వ్యతిరేక వర్గాలు, కులాలకు పేటెంట్గా మారిన మూక హత్యలు 2014 తర్వాత ముస్లింలను లక్ష్యంగా మార్చుకున్నాయి. 2014 జూన్లో తొలిసారి పూనేలో మొహిసిన్ షేక్ అనే 28ఏండ్ల ఐటీ ఇంజనీర్ను హిందూ రాష్ట్ర సేన సంస్థకు చెందని వారిగా భావించబడుతున్న వ్యక్తులు వెంటాడి చంపారు. 2014 దాద్రిలో జరిగిన మూకలు అఖ్లాక్ను హత్య చేశారు. 2015లో దిమాపుర్ (నాగాలాండ్)లో జరిగిన మూక హత్య, 2016 జార్ఖండ్లో జరిగిన మూక హత్య, 2017-18ల్లో రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో జరిగిన మూక హత్యలకు మోహన్ భాగవత్ గానీ ఆయన మార్గదర్శకత్వం వహిస్తున్న ప్రభుత్వం గానీ ఏ పేరు పెడతాయో మరి? తాజాగా ఇద్దరు పిల్లలు బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన చేస్తున్నారని కొట్టి చంపిన ఘటనను పాఠకులు ఇంకా మర్చిపోలేదు. దాదాపుగా గత నాలుగున్నరేండ్లల్లో వందకు పైగా జరిగిన ఇలాంటి హత్యల విషయంలో సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని ఆక్షేపించింది.
ఇటువంటి ఘటనలపై గత ఐదేండ్లల్లో దాదాపు వెయ్యిమంది మేధావులు, ఆర్థిక వేత్తలు, కళాకారులు, చరిత్రకారులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తూ నేరుగా రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశారు. తాజాగా అటువంటి లేఖ రాసిన 49మందిపై ముజఫర్ నగర్ జిల్లా స్థానిక న్యాయస్థానం రాజద్రోహం నేరం మోపి ఎఫ్ఐఆర్ రిజిష్టరు చేయాలని ఆశించింది. ఈ వ్యాసం రాసే సమయానికి జిల్లా ఎస్పీ సదరు ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. జార్ఖండ్లో ఇటువంటి హత్యకు పాల్పడిన వారిలో 11మందికి రాంచీ న్యాయస్థానం శిక్ష విధించింది. అందులో ఒక ఖైదీ జైల్లోనే మరణిస్తే అంత్యక్రియలకు నాటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ హాజరయ్యాడు. ఫెలూ ఖాన్ మరణ వాంగ్మూలం ఉన్నా, ఫెహులూ ఖాన్ హత్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా ప్రసారం చేసినా నిందితులు మాత్రం నిర్దోషులుగా బయటకొచ్చారు. ఈ విషయాలు వెలుగులోకి తేవటానికి ప్రయత్నించినందునే హిందూస్థాన్ టైమ్స్ సంపాదకుడు బాబీ ఘోష్ను ఏకంగా సంపాదక బాధ్యతల నుంచి తప్పించారు. ఇవన్నీ మూక హత్యలు కాదని మనం భావిస్తే సరిపోతుందా? ఆరెస్సెస్కు అద్వైతానికి ఉన్న మేధో సంబంధాన్ని అర్థం చేసుకోలేనంత వరకు మనం మోసపోతూనే ఉంటాం.
- ప్రశాంత్