Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాలు, సకల జనులు ఆర్టీసీ సమ్మెకు అండగా నిలబడటం ఒక అపూర్వ ఘట్టం. అక్టోబర్ 19న రాష్ట్ర కార్మికోద్యమం సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. పాలకులు ఇప్పటికైనా కండ్లు తెరిచి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించకపోతే కాలగర్భంలో కలిసే రోజు త్వరలోనే ఉందని తెలుసుకోవాలి.
సంస్థ మనుగడ, ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం 50వేల మంది ఆర్టీసీ కార్మికులు వీరోచితంగా పోరాడుతున్నారు. తెలంగాణ సమాజంతోపాటు జాతీయంగా అంతర్జాతీయంగా అనేక సంస్థల మద్దతు లభిస్తున్నది. సమ్మె తీవ్రత, కార్మికుల ఆకాంక్ష, విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం చివరకు సమ్మెకు మద్దతు ప్రకటించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిర్భంధ, నిరంకుశ చర్యలే రోజురోజుకు పెంచుతున్నది. ముఖ్యమంత్రి 48 వేలమంది సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని, తిరిగి వారిని తీసుకునేది లేదని ప్రకటించి, కొత్త రిక్రూట్మెంట్లు జరుపుతున్నారు. పోలీసు పికటింగ్లు ఏర్పాటుచేసి అరెస్ట్లు, కేసులు పెడుతున్నారు. సెప్టెంబర్ నెలంతా కష్టపడి పనిచేసిన కాలానికి జీతాలు ఆపివేశారు. ఆర్టీసీ హాస్పటల్లో వైద్యం బంద్ చేశారు. జీతాలు అందకపోవడంతో నిత్యావసర సరుకులు కొనుక్కోలేక, అద్దెలు కట్టుకోలేక, నెలనెలా రుణాలు చెల్లించకోలేక కనీసం దసరా పండుగరోజు తమ పిల్లలకు మంచి భోజనం పెట్టలేకపోయామనే తీవ్ర మనోవేదనతో ఆర్టీసీ కార్మికులున్నారు. ఆర్టీసీ సమ్మెకు సంఘాల నాయకులే కారణం అంటూ మంత్రుల పైశాచిక ప్రకటనలు ఆత్మ బలిదానాలకు పురికొల్పాయి. శ్రీనివాస్రెడ్డి, సురేందర్గౌడ్ ఆత్మహత్యలు చేసుకోడానికి, మరో ఆరుగురు గుండెపోటుతో చనిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. శిక్షణ లేని ప్రయివేట్ డ్రైవర్ల వల్ల రోజూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అనేకమంది చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు.
కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రయివేటీ కరించాలనే లక్ష్యం పెట్టుకున్నది. కాబట్టి ప్రజాస్వామిక, చట్టబద్ధ ప్రక్రియకు తిలోదకాలు ఇచ్చి మరీ తను అనుకున్నది చేసుకుంటూపోతున్నది. అందుకు తగ్గ అడ్డగోలు వాదనలు చేస్తున్నది. అందులో కీలకమైంది ఆర్టీసీకి నష్టాలు, అందుకు ఉద్యోగులు కారణమని అంటున్నది. ఇది శుద్ధ అబద్ధం. మార్కెట్ రేట్ల ప్రకారం రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తులు ఉన్న ఆర్టీసీకి అప్పులు రూ.3,234.74 కోట్లు మాత్రమే. ఈ అప్పులు కూడా 2014-15లో రూ.1,964.46 కోట్లు ఉంటే ఈ ఐదేండ్ల కాలంలో రూ.1,270.28 కోట్లు మాత్రమే పెరిగాయి. అంటే ఏడాదికి రూ.254.56 కోట్లు, నెలకు రూ.21.17 కోట్లు. ఈ మాత్రం అప్పులు తీర్చలేని స్థితిలో మన బంగారు తెలంగాణ ప్రభుత్వం ఉందా! దీనికే ఎవరైనా ప్రజా రవాణా ఆర్టీసీని ప్రయివేటీకరిస్తారా? ఈ అప్పులు కూడా వివిధ వర్గాల ప్రజలకు రాయితీల రూపంలో ఆర్టీసీ ఐదేండ్ల కాలంలో రూ.2,802.75 కోట్లు ఇచ్చింది. కానీ ప్రభుత్వం చెల్లించింది కేవలం రూ.710 కోట్లే. ఒకవైపు ఇంధనంపై పన్ను రూపంలో ఐదేండ్లలో రాష్ట్రం రూ.1,234.61 కోట్లు కేంద్రం రూ.1,375.28 కోట్లు ఎక్సైజ్ డ్యూటీ రూపంలో పిండు కున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ధనవంతులు ప్రయాణించే విమానాల ఇంధనంపై పన్నును ఒకశాతానికి తగ్గించారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీకి మాత్రం పన్ను 28శాతం వసూలు చేస్తున్నారు. ఎం.వి. టాక్స్ రూపంలో రూ.230 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.100 కోట్లు, టోల్ప్లాజా రూ.60 కోట్లు, రాయితీల రూపంలో ఏడాదికి సగటున రూ.550 కోట్లు చొప్పున ఈ ఐదేండ్లలో మొత్తం రూ.5 వేల కోట్లు ఆర్టీసీ నుంచి వసూలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానంలో భాగంగా విద్యార్థులకు ఉచిత, రాయితీ ప్రయాణం కల్పిస్తున్నది. వికలాంగులకు, వృద్ధులకు, ప్రజా ప్రతినిధులకు ఇచ్చిన రాయితీల సొమ్మును తిరిగి ఆర్టీసీకి చెల్లించకుండా ప్రభుత్వమే నష్టం చేసిందన్నది వాస్తవం కాదా? ఈ బకాయిలు చెల్లిస్తే ఆర్టీసీకి నష్టాలు ఎక్కడివి, అప్పు ఎక్కడిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే ఆర్టీసీ నష్టాలకు కారణం తప్ప ఉద్యోగులు కాదన్నది నగ సత్యం.
ప్రయివేటీకరణలో భాగమే ఆర్టీసీవి 50శాతం బస్సులు, 30శాతం అద్దె బస్సులు, 20శాతం ప్రయివేటు బస్సుల ప్రకటన. ఆర్టీసీకి 16 నెలలుగా ఎం.డి. లేకున్నా పట్టించుకోని ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించగానే అద్దె బస్సులకు టెండర్లు వేయడంలో ఉన్న ఆంతర్యం గమనించాలి. దీనికి అసలు కారణం ఇటీవల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఎం.వి. యాక్ట్లో రవాణా వ్యవస్థలో 20శాతం ప్రయివేటీకరణ చేసుకోడానికి అవకాశం కల్పించింది. అందుకే కేసీఆర్ ఢల్లీీలో మోడీని కలిసి వచ్చిన వెంబడే ఆగమేఘాల మీద చర్చలు రద్దుచేసి ఉద్యోగులను డిస్మిస్ చేసి, ప్రయివేటీకరణపై రిపోర్ట్ తెప్పించి ప్రకటించడం. దీన్ని సమర్థించుకుంటూ కేంద్ర ప్రభుత్వం రైల్వేలను, ఎయిర్ లైన్స్ను, ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడంలేదా అని వాదిస్తున్నారు. రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నప్పుడు మేము ఆర్టీసీలో చేపట్టిన ప్రయివేటీకరణ చర్యలు ఎలా తప్పు అని ఎదురుదాడి చేస్తున్నారు. ఇద్దరం ఒకే తానులో ముక్కలమని చెప్పకనే చెబుతున్నారు.
ఉద్యోగుల 'సెల్ఫ్ డిస్మిస్' ప్రకటన రాజ్యాంగంలో గానీ, పార్లమెంట్లో ఆమోదించిన 1926 ట్రేడ్ యూనియన్ చట్టం, 1948 పారిశ్రామిక వివాదాల చట్టంలో గానీ లేదు. కేసిఆర్ గారు కొత్తగా కనుకున్న విధానం. చట్టం ముందు చెల్లదు నిలబడదు. అందుకే ఉద్యోగులు అడిగినా ఈ 'సెల్ఫ్ డిస్మిస్' ఆర్డర్స్ ఇవ్వడం లేదు. సెప్టెంబర్ నెల జీతం ఇవ్వలేదు. పేమెంట్ ఆఫ్ వేజెస్ చట్టం ప్రకారం నెలలో మొదటిరోజు కార్మికుల ఖాతాల్లో వేయాలి. జీతాలు ఎగ్గొట్టడం చట్ట వ్యతిరేకం. ఆర్టీసీలో సంస్కరణలు ఎప్పటినుంచో అమలవుతున్నాయి. గ్యారేజీలో 5వేల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. 42రకాల పనులలో 28రకాలు ఔట్సోర్సింగ్ చేశారు. 2014లో 1400 అద్దె బస్సులు ఉంటే 2019 నాటికి 2,856కు పెరిగాయి. ఇందులో 5 వేల మంది పనిచేస్తున్నారు. ఆర్టీసీ ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు లేదా తన పార్టీ వారికి ధారాదత్తం చేస్తున్నారు. బస్ భవన్ పక్కన 10.04 ఎకరాల ఖాళీ స్థలం సుమారు రూ.500 కోట్ల విలువ కల్గినదాన్ని తనవాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే వరంగల్ టైర్ రీట్రేడింగ్ సంస్థ స్థలం రూ.76 కోట్ల విలువ గల దాన్ని టీఆర్ఎస్ ఎంపీకి లీజు పేరుతో ధారాదత్తం చేశారు. కరీంనగర్లో ఆర్టీసీ స్థలాన్ని 66ఏండ్ల లీజుకు ప్రతిమ గ్రూప్కు ఇచ్చారు. అలాగే వర్క్షాపు స్థలం కూడా అప్పగించబోతున్నారు. ఆర్మూర్ బస్టాండ్ స్థలం 7,000 గజాలు ఎమ్మెల్యే మనుషులకు ఇచ్చారు. ఆర్టీసీ కళ్యాణ మండపం మెయింటెనెన్స్ ప్రయివేట్ వారికి ఇచ్చారు. రాబోయే కాలంలో గెస్ట్హౌస్లు, బస్టాండులు అన్నీ టీఆర్ఎస్ నాయకులు కాజేస్తారనేది వాస్తవం.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా క్రమంగా ప్రభుత్వ వైఖరిని అర్థం చేసుకుంటున్నారు. రెవిన్యూ డిపార్ట్మెంట్ అవసరమా అని ఒకసారి, ఉద్యోగులను కుక్క తోకలతో పోల్చడం, పీఆర్సీ, ఐఆర్ గురించి ఆలస్యం, ప్రమోషన్లు, బదిలీలు లేకపోవడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు గురించి మాట్లాడకపోవడం, కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయకపోవడం లాంటి అంశాలు గమనంలో ఉండాలి. ఉపాధ్యాయ సంఘాలు ఇన్ని అవసరమా అని మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోవాలి. గతంలో గానీ, భవిష్యత్లో గానీ ఉద్యోగుల ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కార మవుతాయన్నదీ, ప్రభుత్వాలు దిగివస్తా యన్నదీ వాస్తవం. బ్రిటిష్ వారి మాదిరి విభజించి పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. ఏదోఒక రోజు మనపట్ల ఇదే పరిస్థితి రావచ్చునని గ్రహించి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ప్రజలు రెండవసారి టీఆర్ఎస్కు అధికారమిచ్చింది ఆర్టీసీని ప్రయివేటీకరించమని కాదు. ఆర్టీసీ ఆస్తులు దోచుకోడానికి కాదు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్ర హైకోర్టు సూచనలను కూడా సీరియస్గా తీసుకోవాలి. ప్రజల ఆకాంక్షలను గుర్తించి ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరిపి సమస్యలను సామరస్యంగా పరిష్కరించి సమ్మెను విరమింప జేయడం ఉత్తమం. కాదని పట్టుదలకు పోతే నిరంకుశత్వానికి, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఈ తెలంగాణ గడ్డపై పరాభవం తప్పదని గ్రహించాలి.
- బోపాల్
సెల్:9490098034