Authorization
Mon Jan 19, 2015 06:51 pm
21వ శతాబ్దపు మానవాళి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి, ఫలాలను అందిపుచ్చుకోవడానికి విద్యకు నాలుగు లక్ష్యాలు ఉండాలని ఐక్యరాజ్యసమితి నియమించిన డెలర్స్ కమిషన్ ప్రపంచ దేశాలకు సూచించింది. జీవితమంతా నేర్చుకోవడమనే ప్రధాన లక్ష్యంతో పాటు, తెలుసుకోవడం, చేయడం, ఉండటం, కలసి జీవించడమనే లక్ష్యాలను నిర్దేశించినది. ఈ లక్ష్యాలకు అనుగుణంగానే ప్రపంచ దేశాలు తమ విద్యా ప్రణాళికలను రూపొందించుకున్నాయి. వీటిని అనునయిస్తూనే భారత ప్రభుత్వం 2005లో జాతీయ పాఠ్యాంశాల చట్టాన్ని అమలు చేసింది. కాలానుగుణంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధాన ముసాయిదాను సిద్ధం చేసింది. ఇది విద్య యొక్క లక్ష్యాలను ఐదుస్తంభాలుగా క్రోడీకరించింది. అవి అందుబాటు, సమాన భాగం, నాణ్యత, జవాబుదారీతనం, స్థోమత.
పెరుగుతున్న వైరుధ్యాలు
కరోనా మహమ్మారి వేగంగా తరుముకొస్తున్న నేపథ్యంలో సంప్రదాయ విద్య కొనసాగింపు ఒక సవాలుగా నిలిచింది. 2019-2020 అకడమిక్ కాలండర్ చివరిలో వచ్చిన కోవిడ్-19 వైరస్ విద్యాబోధనను, మూల్యాంకనమును స్తంభింపజేసి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రత్యామ్నాయ విధ్యాబోధనలకు తెరలేపింది. దీనికి అనుగుణంగానే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2020-21 విద్యా సంవత్సరానికి కనీసం 25శాతం విద్యాబోధన ఆన్లైన్లో అందించాలని నిర్దేశించడం జరిగింది. కార్పొరేట్ విద్య కొంతవరకు సాంకేతికతను జోడించినప్పటికీ పబ్లిక్ రంగంలో ఇంకా ఇది స్థిరీకరించకోలేదు. ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ, రాష్ట్ర స్థాయి విద్యా పరిశోధనా సంస్థలు ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయి భాగస్వాములైన ఉపాధ్యాయులు తమ విద్యాబోధనలో సాంకేతికతను ఏకీకృతం చేయడంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు.
సామాజిక దూరాన్ని కఠినంగా పాటించాల్సిన కరోనాకాలంలో అనేక డిజిటల్, ఇ-ప్లాట్ఫారమ్లు వెలిసాయి. ఇవి పుస్తక పాఠ్యాంశాలను డిజిటల్ మోడ్లోకి బదిలీచేసి ఆడియో, వీడియో క్లిప్సింగ్స్ రూపంలో 3డి యానిమేషన్, వర్చువల్ ల్యాబ్లతో వెబ్సైట్ లింకులను అందుబాటులోకి తీసికువచ్చి తరగతిగది బోధనకు ప్రత్యామ్నాయంగా స్వయం అభ్యసనను ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. బోధనకు సాంకేతికత జోడించడం ఇంతవరకు జరిగిన బోధనా సరళి. రానున్నకాలంలో సాంకేతికత ఉపకరణాలు, సాంకేతిక నైపుణ్యం ఆధారంగానే బోధించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నమూనా మార్పు కరోనా వైరస్తో వేగవంతమైంది. అభివృద్ధి చెందిన దేశాలు మిశ్రిత జ్ఞానార్జన, గృహ పాఠశాల ద్వారా విద్యాబోధనతో కాలం, దూరంను అసంబద్ధం గావించాయి. ప్రస్తుత భౌతికదూరం పాటించాల్సిన పరిస్థితుల్లో విద్యా సంస్థ కేంద్రంగా బోధించ డానికి కాలం చెల్లింది. భౌతిక దూరం పాటించాల్సిన నిబంధనల ప్రకారం దేశంలో ఇప్పుడున్న తరగతి గదుల వైశాల్యం రెండింతలుగా అవసరం. వాటికి సరియైన మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. క్లిష్ట పరిస్థితులను అధిగమించేదెలా?
ప్రత్యామ్నాయ మార్గాలు
రాబోవు కాలంలో కూడా కరోనా వైరస్తో కలసి జీవించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. మన జీవన సరళి కూడా అందుకు అనుగుణంగా మలచుకోవలసిన అవసరమున్నది. ఈ దిశగా సాఫ్ట్వేర్ రంగం ఇప్పటికే 'ఇంటి నుంచి పని' భావనను విజయవంతంగా అమలు చేస్తున్నది. విద్యారంగంలో కూడా ఈ భావనను సానుకూలంగా విశ్లేషించాలి. ఈ దిశగా ప్రభుత్వాలు కూడా తగు ప్రణాళికలను వాయువేగంతో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రత్యామ్నాయ విద్యా కాలెండరు తయారు చేయడం, అస్థిర తరగతులు నిర్వహించడం, బేసి సరి ప్రణాళికలో 50శాతం విద్యార్థులు ఇంటి నుంచే చదువు కొనసాగించడం, ప్రత్యామ్నాయ వారం అమరిక, సోషల్ మీడియానుపెద్ద ఎత్తున ఉపయోగించడం, ఇ-మీటింగ్ ప్లాట్ఫారమ్లు అయిన వెబ్నేర్, జూమ్, గూగుల్ మీట్లను విస్తృతంగా వినియోగించు కోవడానికి ప్రయత్నాలు ఆరంభించింది. కేంద్ర ప్రభుత్వం సెకండరీ విద్య అయిన 1 నుంచి 10వ తరగతులకు 'ఒక తరగతికి ఒక చానల్' అనే లక్ష్యంతో పది టీవీ ఛానల్స్ను ఉచిత ప్రసరణలతో తీసుకొని వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అదే విధంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టిసాట్ విద్య, నిపుణ చానల్స్ ద్వారా విద్యా కార్యక్రమాలను అందించుచున్నారు. వీటిని వెంటనే బహుళ చానెల్స్గా మార్చి అకడమిక్ విషయాలను డిజిటల్, వీడియో క్లిప్పింగ్స్ ద్వారా అందించాలి. అదే విధంగా స్వచ్ఛందంగా ఇ-ప్లాట్ ఫారమ్లను బోధనలో విస్తృతంగా, వినూత్నంగా ప్రయోగించే ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూనే ఉపాధ్యా యుల యొక్క పదోన్నతులకు, ఇంక్రిమెంట్లకు ఇ-శిక్షణ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉన్నది.
ముందున్న కర్తవ్యాలు
సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేర్చుకోవడం ప్రక్రియలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు మారుమూల ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా విధానాలు అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. ఈ వర్గాలకు నాణ్యమైన విద్యను ఇంటర్నెట్, మొబైల్, టాబ్, టీవీ మొదలగు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అందించాలి. టీవీల ద్వారా ప్రత్యేక విద్యా చానల్స్ను 'డైరెక్ట్ టు హౌమ్' ఉచిత ప్రసారాలను కేబుల్, డిష్ల ద్వారా ఇంటింటికి అందుబాటులోకి తేవాలి. కరోనా మహమ్మారి ద్వారా ఏర్పడిన పరిస్థితులను అవకాశంగా మలచుకొని విద్యార్జనలో గుణాత్మకమైన మార్పు, సరళీకృత విధానాలతో సాంకేతికతకు ప్రధాన పీఠం వేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా అనుసంధానంతో 21వశతాబ్దపు డిజిటల్ తరం వినూత్న పద్ధతులతో సంపూర్ణ విద్యను, నైపుణ్యతను పెంపుచేసుకొనే సువర్ణవకాశాన్ని జారవిడుచుకోవద్దు.
డాక్టర్ కందుకూరి రమేష్
- drkramesh64@gmail.com