Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజాన్ని మల్లెలా ఉంచేందుకు,
మలినాన్ని బుక్కుతారు వాళ్ళు
పరమానందకర పాకీ జీవితంలో
పారే మురుగు నీటినే మినరల్ వాటర్లా తాగుతారు
ఆరోగ్యాన్ని- ఆత్మగౌరవాన్నీ మనకోసం ఫణంగా పెట్టి
పేగు తెంచని పెద్దమ్మలవుతారు
బతుకు గాలి పటాన్ని ఆకాశంలోకి ఎగరేసి
చేజేతులా దారం తెంపేసుకుంటారు
వాళ్ళు 'పాకీలు'
మన మెన్నటికీ తీర్చలేని 'బాకీ'లు! పాకీవాళ్ళు, పాకోళ్ళు, చెత్తోళ్ళు, పారిశుధ్య కార్మికులు, పని మనుషులు, సఫాయి కర్మచారీలు, రూమ్ క్లీనర్లు... పేర్లు ఏవైతేనేం.. ఈ సమాజ మనుగడ కోసం, సాటి మనుషుల సౌకర్యవంతమైన జీవనం కోసం అతి తక్కువ ప్రతిఫలం పొందుతూ అహరహం తమ శారీరక శ్రమను ధారపోస్తుంటారు ఈ స్వేద జీవులు. అయినా మన సమాజ నీతికి శ్రమ అంటే చిన్న చూపు. శారీరక శ్రమ అంటే మరీ చిన్నచూపు. పరిశుభ్రతను పంచే సేవాశ్రమ అంటే పరమ అసహ్యం. శ్రమను, శ్రమాధారిత సంపదను తమ చెప్పుచేతుల్లో ఉంచుకున్న శక్తులకు చెమట వాసనంటే చెప్పరాని కంపరం. శ్రమను అవమానపరచడం, శారీరక శ్రమను నీచంగా చూడటం, పూర్వజన్మ సుకృతంగా భావించడం, వెల కట్టలేని సేవా శ్రమలకు అతితక్కువ వెలకట్టడం బూర్జువా వర్గ పాలక సంస్కృతిలో ఒక భాగం. శ్రమకు తగిన ఫలితాన్ని ఆశించడం అన్యాయంగా, శ్రమ దోపిడీని న్యాయంగా చిత్రీకరించడం దోపిడీవర్గ విధానంలో ఒక అంతర్భాగం. ఈ పాలక నీతిలోనే వేల సంవత్సరాలుగా కునారిల్లుతూ ఉన్నాం మనం. సేవా శ్రమను గౌరవిస్తే 'సభ్య' సమాజం మనలను చులకనగా చూస్తుందన్న భయంతో మానవత్వానికి పాతరేసి, సాటి మనుషులను చులకనగా చూడడం నేర్చుకున్నాం. ఇది ఇంతేనని, ఈ దుస్థితి మారదనీ సర్దుకు పోతున్నాం. పాలకవర్గ భావజాలాన్ని ఒక భౌతిక వాస్తవంగా అర్థం చేసుకునేందుకు, ఆహ్వానించేందుకూ అలవాటు పడిపోయాం. మన నుంచి అపరిశుభ్రతను దూరం చేసే మనుషులను, అనారోగ్యాలను మన నుంచి ఆమడ దూరం తరిమే గొప్ప మనసులను అగౌరవ పరచడాన్ని మనకు సంక్రమించిన ఆజన్మ హక్కుగా అనుభవిస్తూ, దాన్నొక నేరంగా పరిగణించడం మరచిపోయాం. లేకుంటే, సఫాయి కార్మికులకు సలామ్ కొట్టాల్సిన మనం, చెత్త కార్మికులకు చేతులెత్తి మొక్కాల్సిన మనం, పారిశుధ్య కార్మిలను ప్రాణంగా చూసుకోవాల్సిన మనం, పని మనుషులను తోబుట్టువుల్లా ఆదరించాల్సిన మనం, వారి శ్రమను చెల్లని రూపాయిగా ఎందుకు లెక్కిస్తూ ఉన్నాం? అమ్మ తర్వాత అమ్మగా పూజించాల్సిన ఆరోగ్య ప్రధాతలను అంటరానివారుగా ఛీత్కరిస్తూ అల్లంత దూరాన ఎందుకు పెడుతూ ఉన్నాం? 'రోగ నిర్మూలనకన్నా రోక నివారణే మిన్న' అని తెలిసి కూడా రోగ నివారణ పనిలో రోజంతా కష్టించే కర్మ వీరులను ఇన్ని కష్టాలెందుకు పెడుతూ ఉన్నాం. వైద్యుడిని గౌరవించాలని తెలిసిన మనం, పారిశుద్యుడిని ఎందుకు గౌరవించలేక పోతున్నాం? కనీసం సాటి మనిషిగా ఎందుకు స్వీకరించలేకపోతున్నాం? చేరదీయలేకపోతున్నాం?
సాటి మనుషుల హూందాతనాన్ని, వారి ఇండ్లు, కార్యాలయాలు, తిరుగాడే రోడ్ల పరిశుభ్రతను కాపాడే సేవా శ్రామికులు మన దేశంలో దాదాపు ఐదు కోట్లమంది ఉన్నారు. ఇందులో వందకు వందశాతం మంది అణగారిన కులస్తులు. అందులో ఇంచుమించు 80శాతం మంది దళితులు. కాగా, సేవా శ్రమలో సగానికి సగం మహిళలు. అంటే, పుట్టుక కారణంగా అంటగట్టబడ్డ వృత్తి (పని), ఆర్థిక అనివార్యతలు కలిసి కోట్లాది మందిని ఈ అగౌరవనీయ, అరకొర ప్రతిఫల పనులకు(వృత్తులకు) కట్టిపడేశాయి. ఆ కట్టుబడుల నుంచి బయటపడడం సాథ్యం కాక అయిష్టంగా, అనివార్యంగా ఆజన్మాతం ఆకలి, అవమానాలతో కాపురం చేస్తున్న సేవా శ్రామికులు - శ్రామికులకొక శ్రామికులు! శ్రామికులకు సైతం సేవకులు!!
శ్రామికులందరిదీ ఆర్థిక (వేతన) సమస్య. కానీ సేవా శ్రామికులది ఆర్థికంతో పాటు ఆత్మగౌరవ సమస్య. తమ అజ్ఞానం కారణంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మే సేవా శ్రామికులు సహజంగానే తమ శ్రమను పూర్వజన్మ కర్మ ఫలంగా భావిస్తారు. ఈ జన్మకు ఇది తప్పదని, ఈ జన్మలో ఈ సేవ చేస్తే వచ్చే జన్మలో సుఖపడుతామనీ భ్రమించి అర్థాకలితోనేనైనా సర్ధుకు పోయేందుకు సిద్ధపడుతారు. సాటి మనుషుల్లా జీవితాన్ని అనుభవించేందుకు తమకు అర్హత లేదని మిన్నకుంటారు. కానీ, సాటి మనుషుల్లో తమకు ఒక మనిషిగానే గుర్తింపు లేదని తెలిసిన తరువాత, వీధి కుక్కల మీద జాలి చూపించి, విష సర్పాలను పూజించే మనుషులు, పిల్లులను ముద్దాడి పని పిల్లలను ఎందుకు దూరం పెడుతున్నారో అర్థమైన తర్వాత, ఇక మొద్దు నిద్ర ఎలా పోగలరు?
మహమ్మారి కరోనా నేపథ్యంలో ఒక కనువిప్పుగా ముందుకొచ్చింది సేవా శ్రామికుల సమస్య. ప్రపంచం ముందెన్నెడూ చవిచూడని కరోనా విపత్తుకు అపరిశుభ్రతే ప్రధాన కారణమని, శుభ్రత మాత్రమే దాన్ని తరిమి కొట్టగలదని వైద్య శాస్త్రం వివరించిన తరువాత సేవా శ్రామికుల జీవితం వెలుగు చీకట్ల సంగమమైపోయింది. ఒక వైపు, ఇప్పటి వరకూ తమను అగౌరవంగా చూసిన చూపులు ఇప్పుడు అనుమానంగా చూస్తుంటే, మరో వైపు ఇప్పటి వరకూ తమను చులకనగా చూసిన చేతులు ఇప్పుడు దండాలు పెడుతున్నారు. ఉన్నట్టుండి ఊడిపడ్డ ఈ సామాజిక గౌరవానికి ఉబ్బితబ్బిబ్బవ్వాలో, అనుమానపు చూపుల ధాటికి అవమానపడాలో అర్థంకాని పరిస్థితి. అపరిశుభ్రతను, తద్వారా అనారోగ్యాన్నీ తమనుంచి దూరంగా మోసుకు పోయే పారిశుధ్య కార్మికులు, తిరిగి అపరిశుభ్రతను, అనారోగ్యాన్నీ తమకు అంటిస్తారే మోనన్న అనుమానం, భయంతో సాటి మనుషులు తమను దూరం పెడుతుంటే జాలి పడాలో, జావగారాలో, ఆనందపడాలో, ఆందోళనచెందాలో అవగతం కాని దుస్థితి.
సేవా శ్రమలను నీచమైన పనులుగా చిత్రీకరించి, వాటిని కొన్ని కులాలకు మాత్రమే కేటాయించి తద్వారా ఆయా కులాలకూ నీచత్వాన్ని, సమాజంలో చివరి స్థానాన్నీ అంటగట్టింది మనువాద హిందూ ధర్మం. మన దేశంలో హిందువులే అధికం కాబట్టి, సహజంగానే సేవా శ్రమల్లో అత్యధిక శాతం హిందూ అణగారిన కులాలే బలవంతంగా స్థిరపడి పోయాయి. దేశ వ్యాప్తంగా సేవా శ్రామికులు సుమారు ఐదు కోట్లమంది ఉన్నారన్న అంచనా ఉండగా, అందులో అత్యధికులు అణగారిన కులస్తులు, అసంఘటితులు. ఇతర మతాలకు చెందిన సేవా శ్రామికులు తాము చేసే పని ద్వారా కేవలం పని వేళల్లోనే అవమానానికి గురవుతుండగా, హిందూ మతానికి చెందిన సేవా శ్రామికులు పనివేళలతోపాటు అన్ని వేళల్లోనూ అవమానాలకు గురవుతున్నారు. అయినా, సేవలలో వ్యత్యాసం, సామాజిక గౌరవంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సేవా శ్రామికుల మధ్య ఉన్న విడదీయరాని ఏకత్వం అపరిశుభ్రతతో పని (డీల్) చేయడం. అపరిశుభ్రతను తమ శ్రమతో జయించి సమాజానికీ, సాటి మనిషికీ శుభ్రతను ఒక సేవగా అందించడం. వివిధ గుర్తింపులలో ఉన్న కోట్లాది సేవా శ్రామికులు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. తమ ప్రాణాలను అడ్డువేసి మన ప్రాణాలకు పూచీ పడుతున్నారు.
సేవా శ్రమలను గుర్తించడం, గౌరవించడం మహమ్మారి కరోనా అనివార్యం చేసింది. సేవా శ్రమలను ఆశ్రయించకుండా, ఆహ్వానించకుండా, ఆ సేవలకు అతీతంగా మనిషన్నవాడు మనుగడ సాగించలేడన్న కఠోర సత్యాన్ని కరోనా సుస్పష్టం చేసింది. పని ఆధారిత గౌరవానికి అర్థం మార్చి, సేవ ఆధారిత శ్రమకు పట్టం కట్టింది. సేవాధారిత శ్రమలో అంతర్భాగమైన అమ్మతనాన్ని ప్రపంచానికి చాటింది. అమ్మ తనమే లేకుంటే కమ్మనైన బతుకెక్కడిదని, కమ్ముకున్న చీకట్లలో క్రాంతి రేఖ ఇంకెక్కడిదనీ నిగ్గదీసి ప్రశ్నించి, నిండైన సమాధానమిచ్చింది. 'సేవా శ్రామికులను మీరు ఆదరించకుంటే, నన్ను ఆహ్వానించినట్టేనని' మహమ్మారి కరోనా మానవజాతి ముఖం మీద చాచికొట్టి మరీ చెప్పింది. 'సేవా శ్రామికులను మీరు కాపాడుకోండి, వాళ్ళు నా నుంచి మిమ్మల్ని కాపాడుకుంటారని' గట్టి హామీ ఇచ్చింది.
ఇంతకూ, మన ఆరోగ్యాలను రక్షించి, ప్రాణా లను కాపాడటంలో ప్రథమ పాత్ర పోషిస్తూ ఉన్న సేవా శ్రామికులు అందుకు ప్రతిఫలంగా మన నుంచి ఏం కోరుకుంటున్నారు? మానవీయ పలకరింపును, ప్రతిస్పందననే కదా? తమనూ సాటి మనుషులుగా స్వీకరించే మనిషితనాన్నే కదా మన నుంచి కాంక్షిస్తున్నది, ఆకాంక్షిస్తున్నది? అవును! సేవా శ్రామికుల సమస్య కేవలం ప్రభుత్వాలు మాత్రమే పరిష్కరించగల సమస్య కాదు. పరిష్కారం కోసం మొత్తం సమాజం ముందుకురావాల్సిన సమస్య. ఇది కేవలం అధికారం మాత్రమే పరిష్కరించగలిగే సమస్య కాదు, అధికారంతో మమకారం తోడైతేనే పరిష్కరించబడే సమస్య. ఇది మొత్తం సమాజానికి చుట్టుకున్న సమస్య, మొత్తం సమాజాన్ని చుట్టుముట్టిన సమస్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వ్యక్తుల సమస్య మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థ సమస్య. ఇది వ్యక్తులు మాత్రమే సరిదిద్దుకోగలిగిన సమస్య కాదు, వ్యక్తులు వ్యవస్థ కలిస్తేనే సరిదిద్దబడే సమస్య. విలువైన శ్రమకి అతి తక్కువ వేతనం, అత్యుత్తమ శ్రమకి హీనమైన గౌరవం పొందుతున్న సేవా శ్రామికులు ఆర్థిక ప్రయోజనాలతోపాటు ఆత్మగౌరవానికీ సమాన విలువిస్తారు కాబట్టి, ప్రభుత్వమైనా వ్యక్తులైనా రెండు కోణాల నుంచి ఆలోచించి, రెండు డిమాండ్లకూ సమాన విలువనిచ్చి సమస్యను పరిష్కరించాల్సిన అవసరముంది. అప్పుడు మాత్రమే సమస్య పరిష్కారమవుతుంది.
నువ్వు ఏ పక్షంలో ఉన్నా ఈ సమస్యను పరిష్కరించుకోవడం ఇరుపక్షాలకూ అవసరం. అనివార్యం. పరిష్కరించుకోకుంటే ఇరుపక్షాల మనుగడకే ప్రమాదం.
శ్రమ జీవులను గౌరవిద్దాం!
సేవా జీవులను ఆత్మీయులుగా స్వీకరిద్దాం!!
కోప్ర