Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఔను.. సుందరయ్య ఆదర్శాలూ, క్రమశిక్షణ... అప్రమత్తత... గొప్పవే... అయినా
విప్లవం ఇప్పుడొచ్చేదా ఏమన్నానా? వచ్చినప్పుడు చూద్దామన్న భావనలు బలంగా ఉన్న కాలమిది.
ప్రజా పునాది చెదిరింది.
ప్రజా ప్రతినిధులు లేరు.
తెలుగు నేల మీద కమ్యూనిస్టులు లేని శాసనసభలు కొలువు దీరిన కాలమిది.
ధర్నాలకు అనుమతులు లేని 'ప్రజాస్వామ్యం!' ఇది. సభలకు ఊరవతలే స్థానం. సీసీ కెమెరాల కనుసన్నలలో వ్యక్తి స్వేచ్ఛ వర్థిల్లుతున్న రాజ్యమిది. మరోవైపు మార్క్సిజం విఫలమైన సిద్ధాంతమనీ, పోరాటాలకు కాలం చెల్లిందనీ పాలకవర్గ మేధావుల పరిహాసాలు. ఈ నేపథ్యంలోనే మే 19న సుందరయ్య వర్థంతి, హౌచిమిన్ జయంతి జరుపుకున్నాం. పైగా మే ఒకటి కూడా సుందరయ్య పుట్టినరోజే కాదు... హక్కుల కోసం కార్మికవర్గం రక్తతర్పణ చేసిన రోజు. ప్రపంచమంతా కార్మికవర్గ పోరాటాలకు స్ఫూర్తి దినోత్సవంగా జరుపుకుంటున్న రోజు. ఇలాంటి స్ఫూర్తిదాయక సందర్భాల నడుమ ప్రజా ఉద్యమాల స్థితిగతులను నెమరువేసు కుంటున్నాం.
విప్లవం ఎప్పుడొస్తుందో చెప్పలేము. కానీ విప్లవం మాత్రం చెప్పిరాదు. ఎప్పుడొచ్చినా అందుకునేందుకు సిద్ధంగా ఉండవల్సిందే. పొలంలో పంటను నిజాం తొత్తులు దోచుకున్నప్పుడు ఐలమ్మ తిరగబడుతుందనీ, నిలబడుతుందనీ సుందరయ్య కలగనలేదు. నిజాం మూకల తుపాకి గుండుకెదురుగా దొడ్డి కొమరయ్య నిలిచి ప్రాణత్యాగం చేస్తాడనిగానీ... అది సాయుధతిరుగుబాటుకు శ్రీకారం చుడుతుందనిగానీ సుందరయ్య ఊహించలేదు. తెలుగుగడ్డ మీద కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులెవ్వరూ లేనప్పుడే తెలంగాణ సాయుధరైతాంగ పోరాటం సాగింది. ఆ పోరాట ఫలాలే ప్రజా ప్రతినిధులను అందించాయి. హక్కులు లేనప్పుడే ప్రజలు తిరగబడ్డారు. కమ్యూనిస్టు పార్టీకి బలమైన ప్రజాపునాది రూపుదిద్దుకున్నది. సీసీ కెమెరాలు వ్యక్తుల కదలికలను పసిగట్టగలవేమో గానీ ప్రజా ఉద్యమాలను నిలువరించజాలవు.
చెదిరిన పునాదిని కూడగట్టటమెట్లా అన్నదే ప్రశ్న. విప్లవ చైతన్యం పునరుద్ధరణకు ఏం చేయాలన్నదే సమస్య. పోయిన చోటనే వెతుక్కోవాలని సామెత. కమ్యూనిస్టులూ అంతే కదా! 1940వ దశకం నాటి పరిస్థితులు కావిప్పుడు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో అనూహ్యమైన మార్పులు జరిగాయి. వీటి ప్రభావం కమ్యూనిస్టు ఉద్యమం మీదా, నిర్మాణం మీదా ఉండటం సహజం. అది ప్రపంచ వ్యాపితంగా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలం. ఇప్పుడు సోషలిజం ఎదురుదెబ్బలు తిన్న కాలం. సోవియట్ యూనియన్ పతనమైన పర్యవసానాలు చూస్తున్న కాలమిది. మూడు దశాబ్దాలుగా సరళీకృత విధానాలు ఆవహించి, కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిన సమయం. లోటుపాట్లను ఈ నేపథ్యంలోనే పరిశీలించాలి.
ఒకప్పుడు పొదుపును ప్రోత్సహించిన పెట్టుబడిదారీ శక్తులే విశృంఖలంగా ఖర్చును ప్రోత్సహిస్తున్నాయి. వినిమయ సంస్కృతి జీవన విధానంగా రూపుదిద్దుకుంటున్నది. చిన్నమొత్తాల పొదుపు పథకాల స్థానంలో క్రెడిట్ కార్డులు వచ్చి చేరాయి. ఆదాయాన్ని బట్టి ఖర్చు నిర్ణయించుకునే పద్ధతి స్థానంలోకి ఆర్భాటాల కోసం వనరులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేరాయి. సరుకులు అమ్ముకోవడానికి పెట్టుబడిదారులు అన్ని ప్రయత్నాలూ చేస్తారు. పుట్టిన రోజు, పెండ్లి రోజులకు ప్రాధాన్యతలు పెరిగిపోయాయి. గృహప్రవేశం, పెండ్లి సందర్భాలలో ఆర్భాటాలు చూస్తున్నాం. తమ హౌదాకు గుర్తింపుగా భావిస్తున్నారు. త్యాగధనుల జయంతి సందర్భంగా స్ఫూర్తి పొందటం కాకుండా తమ పుట్టినరోజు తామే జరుపుకుని మురిసిపోయే సంస్కృతి వ్యాపార సంస్కృతిలో భాగంగానే విస్తరిస్తున్నది. సామాజిక వివక్షను ప్రశ్నించే ప్రయత్నంలో అస్తిత్వ భావాలు కూడా సహజంగానే తిరుగుబాటు వైపు కాకుండా ఆడంబరాలవైపు నెట్టుతున్నాయి. బేకరీల దగ్గరి నుంచి పబ్బుల దాకా ఆహారపు అలవాట్లనే మార్చేస్తున్నారు. ఇవన్నీ వ్యాపార ప్రయోజనాల కోసం, లాభార్జన ప్రయత్నాలలో ప్రపంచీకరణ విధానాలు పెంచి పోషించిన వినిమయ సంస్కృతి ఫలితాలు. వీటికి విరుగుడు ప్రయోగించే ప్రయత్నంలో కమ్యూనిస్టు శ్రేణులు కూడా ప్రభావితులు కావటంలో ఆశ్చర్యపడవల్సిందేమీ లేదు.
మూడు దశాబ్దాలకు పైగా బూర్జువా పార్టీలతో చేసిన స్నేహం ప్రభావాలు కూడా తోసిపుచ్చలేము. ఒక నిర్దిష్ట సమస్యకూ, సందర్భానికీ, లక్ష్యానికీ పరిమితం కావల్సిన ఎత్తుగడలు ఆచరణలో సహవాసంగా మారి, మిత్రపక్షాలుగా ముద్రపడే దశకు చేరాయి. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారన్న సామెత ఉండనే ఉన్నది. పైగా ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమం ఎదురుదెబ్బలు తిన్న నిరుత్సాహపూరిత వాతావరణంలో జరిగిన పరిణామాలవి. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల బంధం అవినీతి కేంద్రంగా రూపుదిద్దుకున్నది. అధికారాన్ని ఆసరా చేసుకుని అడ్డంగా కొల్లగొట్టే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ముందుకొచ్చింది. ప్రతిదీ డబ్బుమయం, ఎన్నికలలో డబ్బు పాత్ర అనేక రెట్లు పెరిగింది. సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా డబ్బు సంపాదన సులభమన్న భావన వ్యాపించింది. ఇవన్నీ మధ్యతరగతి ఉద్యోగుల మీద, యువత మీద తీవ్ర ప్రభావం చూపాయి. వీకెండ్ కల్చర్, మద్యం పాత్ర పెరిగాయి. మురికిని కడిగే ప్రయత్నంలో మురికి అంటుకున్నట్టే, సమాజాన్ని మార్చే ప్రయత్నంలో... సమాజాన్ని ఆవహించిన అపసవ్య ధోరణులు కూడా అంటుకునే అవకాశం ఉన్నది.
ఎన్నికల పొత్తులు, పదవుల గెలుపులు కొత్తరుచులు చూపిస్తాయి. ప్రజల పట్ల నమ్రత స్థానంలో ప్రజల నమస్కారాలు చేరుతాయి. బూర్జువా పార్టీల నేతలు తమ కార్యకర్తలను సంతృప్తిపరిచే పద్ధతులలోనే తమ మిత్రపక్షమనుకున్న పార్టీల కార్యకర్తలను కూడా సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తారు. అది వారి నైజం. వారి ప్రయోజనం అందులో ఇమిడి ఉన్నది. కమ్యూనిస్టులు తమ నిబద్ధతను ఎంతగా కోల్పోతే వారికి అంత మంచిది. ప్రజలు వీరిని పక్కపక్కనే చూస్తుంటారు. ప్రజలు గమనించేటంత తేడా ఉంటే వారికి నష్టం. అందుకే వారి లోపాలన్నీ అంటించేందుకు ప్రయత్నిస్తారు. తట్టుకుని నిలబడే శక్తి ప్రదర్శించవల్సింది కమ్యూనిస్టులే! పొత్తు కుదిరిన తర్వాత కమ్యూనిస్టులకు కేటాయించిన సీటు గెలవాలంటే ఖర్చుపెట్టాలంటారు. తాము పోటీ చేసే స్థానంలో కమ్యూనిస్టుపార్టీ ఓటర్లకు కూడా డబ్బు పంచుతారు. మీవారికి మీరే పంచండంటారు. మీరైతే నిజాయితీగా పంచుతారని మునగచెట్టెక్కిస్తారు. జిల్లా పరిషత్తు లాంటి ఎన్నికల్లో తమతో పొత్తులో ఉన్న పార్టీల ప్రజా ప్రతినిధులు కూడా తమ క్యాంపుల్లో ఉండాలని ఆహ్వానిస్తారు. క్యాంపులోకి రాకపోతే.. ఏదో అనుమానం! అందువల్ల ఎంతోకొంత ముట్టజెప్పే ప్రయత్నం. తీసుకుంటే తమకు నమ్మకం అంటారు. అంతేనా.. లంచాలు, కమీషన్లు, కాంట్రాక్టులు వద్దంటే కాళ్ళముందుకు వచ్చి పడతాయి. ఇవన్నీ పరీక్షలే. సుదీర్ఘకాలం ఎన్నికల వ్యవస్థలో భాగస్వాములు కావటం ఒక కొత్త అనుభవం. దానికి మించి ఎన్నికల తంతు మొత్తం డబ్బుమయం చేసి ప్రజాస్వామ్యానికి చెదలు పట్టించి, పాలన మీద పెట్టుబడిదారులు ప్రత్యక్షంగానే పట్టు బిగించటం. ఇన్ని అవరోధాలు దాటి, ప్రజల పట్ల తమ నిబద్ధతను కమ్యూనిస్టు శ్రేణులు నిరూపించుకోవాలి.
గెలిచే అవకాశాలున్నప్పుడు అభ్యర్థులు చాలా మంది అందుబాటులో ఉంటారు. ఓట్లు వందల్లోకి వచ్చినప్పుడు ఎదుటివారికి అవకాశం ఇద్దామనే ఔదర్యం బాగానే పెరుగుతుంది. ఓట్లతో నిమిత్తం లేకుండానే పోటీ చేయాలన్న తహతహ మరికొందరిలో చూస్తాం. ఈ రెండూ పార్టీ కోసమో ప్రజా ఉద్యమాల కోసమో కాదు. పార్లమెంటరీ ధోరణుల ప్రభావాలు. ఇంతే కాదు.. ఇంకా అనేక రూపాలలో వ్యక్తమవుతాయి. ఖర్చుపెట్టకుంటే ఎన్నికలలో పోటీ చేయలేమన్న భావన బలపడుతున్నది. ఇది ప్రజల మీద విశ్వాసం కన్నా డబ్బు మీద నమ్మకం పెరగటమే! వ్యాపార ధోరణులు ఎన్నికల వ్యవస్థలో చొరబడిన మోతాదును ఇది సూచిస్తున్నది. డబ్బును నమ్మితే వ్యాపారం... ప్రజలను నమ్మితే ప్రజాపోరాటాలూ, విప్లవాలు. ఈ మాటలు వినవల్సివస్తే ఒళ్ళు జలదరిస్తుంది కదా! ఔను.. నిజమే! అందుకే సమాజం ఇంకా సుందరయ్యను మరచిపోలేదు. సుందరయ్య అవసరాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నది.
పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి కదా! అందుకే సీపీఐ(ఎం) కోల్కతా ప్లీనం తీర్మానం పార్టీ శ్రేణులందరినీ ప్రజల దగ్గరకు పోవాలన్నది. ప్రజలనే నమ్ముకోవాలన్నది. నడమంత్రపు ధోరణులను వదిలించుకోవాలన్నది. ప్రజలనే నమ్ముకుంటే ఫలితాలుంటాయని మన కండ్ల ముందే ప్రజలు రుజువు చేసారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పోటీలో నర్సిరెడ్డి గెలుపు ఒక ఉదాహరణ. చదువుకున్న వారు, ఉపాధ్యాయ వృత్తికే మచ్చను తెచ్చే విధంగా వెండిగిన్నెలకు ఆశపడి ఓట్లేసే ధోరణి ఒకవైపూ... పోరాటాలే ఆయుధాలుగా మరోవైపూ జరిగిన పోటీలో పోరాటాల వారసత్వం గెలిచింది. మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ప్రగతినగర్లో సీపీఐ(ఎం) కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసారు. ప్రత్యర్థులు ఒక్కొక్కవార్డులో కోటిరూపాయలు ఖర్చుచేసినా సీపీఐ(ఎం) అభ్యర్థులు రూ.50వేలు మించకుండా ఖర్చుచేసి గెలిచారు. ఆ ఖర్చుల వివరాలు కూడా వార్డు ప్రజల ముందుంచారు. అమరచింత మున్సిపాలిటీలో సీపీఐ(ఎం) అభ్యర్థుల పోటీ మరో ప్రత్యేకత. ప్రజల ఆదరణే పెట్టుబడిగా దిగిన పోటీలో విజేతలయ్యారు. ప్రజలనే నమ్ముకుంటే ఫలితాలుంటా యనటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణలు కావాలా?
ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని వినియోగించుకోవటం తప్పుకాదు కదా! అంటారు కొందరు. ఉద్యమావసరాలకు వినియోగించటం వేరు. హౌదాకు గుర్తింపుగా ప్రజల ముందు దర్పం ప్రదర్శించటం వేరు. పూర్తికాలం కార్యకర్తలకు అలవెన్సులే కష్టంగా ఉన్న సమయంలో అదనపు సౌకర్యాలు ఆశించటమే ప్రజలకు దూరం చేస్తుంది. ప్రజలతో మమేకం కావడానికే ప్రథమ ప్రాధాన్యత. ఇదే సుందరయ్య చూపిన మార్గం. ప్రజలలో భాగమవుతున్నామా లేక ప్రజలకంటే పైన ఉంటున్నామా అన్నదే సమస్య. ఈ చిక్కుముడి విప్పేది ప్రజలే కదా! అందుకే ప్రజలబాట పట్టాలి. సుందరయ్య నిరాడంబరతను కొందరు చాదస్తంగా కొట్టిపారేసే ధోరణులూ గమనిస్తాం. త్యాగాలను చులకన చేసే ధోరణులూ చూస్తాం. ఎట్లా ఉన్నామన్నది ముఖ్యం కాదనీ... ఏం చేస్తున్నామన్నదే ముఖ్యమనే అభిప్రాయాలూ వింటుంటాం. నిరాడంబరత, త్యాగనిరతి పెట్టుబడిదారీ వ్యవస్థ అంగీకరించదు. 'ఆడంబరాలూ, సంపాదించటం, అనుభవించటం, ఆనందించటం...' ఇదే కావాలిప్పుడు మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు. అందుకే... ''విప్లవం ఇప్పుడే వచ్చేది కాదు కదా! అన్ని త్యాగాలు అవసరమా!'' అన్న మాటలు ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. 'ప్రజలు పోరాటాలకు కదిలినప్పుడు చూద్దాం' అంటే నిజమే కదా అనిపిస్తుంది! కానీ పాలకవర్గాలు మాత్రం పథకం ప్రకారమే అడుగులు వేస్తాయి. దేశంలో కమ్యూనిస్టులు ఇప్పుడు చిన్నశక్తే. అయినా పెద్దదాడి కమ్యూనిస్టుల మీదనే జరుగుతున్నది. బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో మారణహౌమం చూస్తున్నాం. కేరళలో వామపక్ష ప్రభుత్వమే లక్ష్యంగా సాగుతున్న దాడి కూడా తెల్సిందే. కమ్యూనిస్టులంటే ఏమిటో పాలకవర్గాలకు బాగా తెలుసు. నాటి వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే కాదు. నేటి కరోనా దాడిలో ప్రత్యామ్నాయంగా వెలుగుతున్న చైనానూ, దేశంలో కేరళనూ చూస్తున్నారు. కోవిడ్ దాడిని పక్కనబెట్టి కార్మికవర్గ హక్కులను హరించటం మీద దృష్టి సారించారు. కమ్యూనిస్టులు బలపడితే ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. అప్రమత్తంగా ఉండవల్సింది కమ్యూనిస్టు ఉద్యమమే. నీటిలో చేపలాగా ప్రజలతో మమేకమైనప్పుడే ఉద్యమానికి భవిష్యత్తు.
ప్రపంచీకరణ ప్రభావంతో ఒకతరం దూరమై ఉండవచ్చు. కానీ ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థలో సమస్యలు పరిష్కారం కావని మరోసారి తేలిపోయింది. పన్నెండేండ్లుగా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కొట్టుమిట్టాడడాన్ని కొత్త తరం గమనిస్తున్నది. ఇప్పుడు యువత తెల్లకాగితం వంటిది. జనానికి దగ్గరై... మీకు నేనున్నాననే కమ్యూనిస్టు కావాలిప్పుడు. ప్రత్యామ్నాయం కోసం ప్రజలు చూసే కాలమిది. మరింత మంది సుందరయ్యలు అంకురించే కాలం కూడా ఇదే!
ఎస్. వీరయ్య