Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 20లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటనలో ప్రయివేటీకరణ జపం అందుకున్నారు. కార్పొరేట్లకు దేశసంపదను యదేచ్ఛగా దోచిపెట్టడం కోసం బొగ్గుబావులు, బాక్సైట్ ఖనిజాలు, ఎయిర్పోర్టులు, విద్యుత్ డిస్కాంలు, రక్షణరంగంలో ఎఫ్డీఐ 74శాతంకు పెంచడం, ఐఎస్ఆర్ఓ సౌకర్యాలతో బాటు అంతరిక్ష కార్యకలాపాల వంటివన్నీ ప్రయివేటు సంస్థలకు కట్టబెడతామని ప్రకటించారు. 2019 తరువాత రెండవసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 44 కార్మికచట్టాలను 4కోడ్లుగా మార్చడానికి ఎందుకు ఆతృతపడిందో ఈ ప్రయివేటీకరణ చర్యల వేగం చూశాక మరింత బోధపడుతున్నది. బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం లాక్డౌన్ కాలంలో కార్మికుల పని గంటలు 8 నుంచి 12కు పెంచడానికి అవకాశం కల్పించింది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాల క్రోడీకరణ పేరిట 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక హక్కులు హరించింది.
1. 2019 జులై 23న పార్లమెంట్లో 'వేతనాల కోడ్' పేరిట వేతన చెల్లింపుల చట్టం 1936, కనీస వేతనాల చట్టం 1948, బోనస్ చెల్లింపుల చట్టం 1965, సమాన వేతన చట్టం 1976 రద్దు చేశారు. ఆగస్టు 8న రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 2. వృత్తిపర మైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్బిల్లు 2019 ప్రవేశపెట్టి, ఇందులో 13చట్టాలను కలిపివేశారు. 3. పారిశ్రామిక సంబంధాల్లో 2019 పేరిట కీలకమైన ఐ.డియాక్టు 1947, ట్రేడ్ యూనియన్ చట్టం 1926 (సంఘాలు పెట్టుకునే హక్కు), ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ (స్టాండింగ్ ఆర్డర్ యాక్ట్) యాక్టు చట్టాలను కలిపి ఒకే కోడ్ చేశారు. పార్లమెంట్ లేబర్ స్టాండింగ్ కమిటి ముందు ఉంది. (4)సాంఘిక భద్రతా కోడ్బిల్లు 2019లో 8చట్టాలు ఉదా|| పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ లాంటివి కలిపేశారు. ఇదీ కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కనీస వేతనాల కోడ్చట్ట రూపం దాల్చింది. మిగిలినవి పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నాయి. డా|| బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(సి) ప్రకారం యూనియన్లు, అసోసియేషన్లు పెట్టుకునే హక్కు ఉంది. ఆర్టికల్ 38(2) ప్రకారం ఆర్థిక అసమానతలు ఉండరాదు. ఆర్టికల్ 41 ప్రకారం పని హక్కు, ఆర్టికల్ 43 ప్రకారం లివింగ్ వేజ్ గురించి చెబుతుంది. రాజ్యాంగం ప్రకారం చట్టసభలు, న్యాయస్థానాలు, కార్యనిర్వాహక వర్గం ఒకదానికి ఒకటి సహకరిస్తూ పని చేయాలేతప్ప ఒకరి అధికారాల్లో ఒకరు తలదూర్చ రాదని చెబుతున్నది. ఈ రాజ్యాంగ విశిష్టతను తుంగలోతొక్కి పార్లమెంటును ధిక్కరించి (పెండింగ్లో వుండగానే) ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేస్తూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నాయి. ఈ విపరీత ధోరణితోనే ఇటీవల బీజేపీ నాయకత్వం లోని మూడు ప్రధాన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు మూడేండ్ల పాటు కార్మిక చట్టాలన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించాయి.
ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం 'ఉత్తరప్రదేశ్ టెంపరరీ ఎగ్జెంప్షెన్ లేబర్ లాస్ ఆర్డినెన్స్ 2020' పేరిట మే 6న ఉత్తర్వులు జారి చేసింది. ఫ్యాక్టరీలు, ఇతర అన్ని సంస్థలలో కార్మికచట్టాలను (1000 రోజులు) మూడేండ్లు అమలు చేయబోమని నిర్ణయించారు. మూడు చట్టాలను మాత్రమే మినహాయించారు. అవి బాండేడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1976, ప్రమాదాలు జరిగితే, చనిపోతే ఎక్స్గ్రేషియా కోసం వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్టు 1923, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం 1996తో బాటు సకాలంలో వేతనాలు చెల్లింపులు జరగడం కోసం పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు 1934లోని సెక్షన్ 5ను మాత్రమే మినహాయించారు. 38చట్టాలను పనిచేయకుండా చేశారు. అంటే పని చేయాలి. జీతం తీసుకోవాలి అంతే. కనీస వేతనం అడగరాదు. 12గంటలు పని చేయాలి. ఓవర్టైం వేతనాలు ఇవ్వరు. సంఘాలు పెట్టుకునే హక్కు ఉండదు. పీఎఫ్., ఈఎస్ఐ, గ్రాట్యుటీ, మెటర్నటీ లాంటి బెనిఫిట్స్ కూడా అడగరాదు.
మధ్యప్రదేశ్లో ఇటీవల రాజకీయ బేరసారాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఫ్యాక్టరీ చట్టం, మధ్యప్రదేశ్ ఇండస్ట్రియిల్ రిలేషన్స్ యాక్ట్, పారిశ్రామిక వివాదాల చట్టం, కాంట్రాక్టు లేబర్యాక్టు లాంటి అతి ముఖ్యమైన చట్టాలు మూడేండ్ల పాటు అమలు చేయమని ప్రకటించింది. ముఖ్యంగా 100మందిలోపు వరకు యజమానులు అవసరాన్ని బట్టి కార్మికులను నియమించుకోవచ్చు, తొలగించుకోవచ్చనే 'హైర్ అండ్ ఫైర్' విధానానికి అవకాశం కల్పించింది. 50మంది లోపు వరకు కాంట్రాక్టర్లు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిన అవసరంలేదు. అనగా వారికి ఏ చట్టం వర్తింప చేయబడదు. ఇన్స్పెక్షన్స్ ఉండవు. 3నెలల పాటు ఏ విధమైన తనిఖీ చేయరాదని నిర్ణయించారు. యజమానులను లైసెన్స్లు, రిజిస్ట్రేషన్స్ ఒక రోజులోనే ఇస్తారు. పదేండ్లలో ఒకసారి ఫ్యాక్టరీ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుందట. పనిదినం 8గంటల నుంచి 12గంటలకు పొడిగించారు. అలాగే షాప్స్కి ఎస్టాబ్లిష్ మెంట్స్ యాక్ట్ పరిధిలోని సంస్థలు ఉదయం 6గంటల నుంచి అర్థరాత్రి 12గంటలవరకు తెరుచు కోవడానికి అనుమతించారు. రోజుకు 18గంటలు, వారానికి 108గంటల పాటు కార్మికులు పనిచేయ వల్సిన దుస్థితి ఏర్పడుతుంది. మధ్యప్రదేశ్ లేబర్ వెల్ఫెర్ బోర్డులో యజమానులు తమ వాటాగా నెలకు చెల్లించవల్సిన రూ.80కి కూడా మినహాయింపు ఇచ్చారు.
గుజరాత్ రాష్ట్రం దేశానికే మోడల్ అని ఊదర గొట్టారు. కరోనా నివారణలో ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి చేతులెత్తేస్తే మోడీ ఢిల్లీ నుంచి అధికారులను పంపిన స్థితి చూశాం. ఆ రాష్ట్రంలో కూడా కనీస వేతనాలచట్టం, ఇండస్ట్రియల్ స్టేట్రూల్స్, ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ యాక్టు తదితర చట్టాలను 1200రోజులు అమలు చేయమని ఆర్డినెన్స్ తీసుకు వచ్చారు. తనిఖీలు, ప్రభుత్వజోక్యం ఉండదని పేర్కొన్నారు. యూనియన్ల పాత్ర ఉండదని చెప్పారు. అలాగే బీజేపీ పాలిత ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 12గంటల పనిదినం, హైర్ అండ్ ఫైర్ సిస్టంలో 300మంది వరకు యజమానుల ఇష్టానికి వదిలివేసింది. దీంతో అన్ని పరిశ్రమల్లో యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికుల ఉద్యోగం, ఉపాధి ఆధారపడి ఉంటుంది.
ఈ రాష్ట్రాల తోవలోనే రెండవదశలో హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, పాండిచ్చేరి రాష్ట్రాలు కూడా కార్మిక చట్టాలలో మార్పులు చేయడం లేదా అమలు చేయకుండా ఉండటం కోసం చర్యలు తీసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ అనే తేడా లేకుండా కార్మిక హక్కులు హరించడంలో రెండూ ఒకటేనని రుజువు చేసుకుంటున్నారు. దేశంలో ఒక్క కేరళ తప్ప అన్ని రాష్ట్రాలు ఇదే బాట పడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికవ్యతిరేకి, యజమానుల పక్షపాతి. టీఎస్ఐ పాస్ పేరిట పారిశ్రామికవేత్తలకు రాయితీలు, కార్మికులకు మాత్రం 2014 నుంచి 73రంగాలలో ఒక్క రంగంలో కూడా కనీస వేతనాలు పెంచలేదు. కనీస వేతనాల చట్టం ప్రకారం ఐదేండ్లకు ఒకసారి వేతనాలు సవరించాలి. కానీ వాటి ఊసే ఎత్తడం లేదు.
కరోనా సంక్షోభంలో కూడా పేదలను, కార్మికులను ఆదుకోవాల్సిందిపోయి వారికున్న హక్కులన్నీ కాలరాస్తున్నారు. దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 14 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. వారి కోసం 'అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం 1979' ఉంది. ఇది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్డినెన్స్ వల్ల, పార్లమెంట్లో పెట్టిన కోడ్ల వల్ల చీకట్లోకి నెట్టబడింది. ఈ చట్టంవల్ల వలస కార్మికులకు కొంత రక్షణ ఉండేది. కనీస వేతనాల చట్టం వర్తించేది. స్వంత రాష్ట్రం నుంచి పని చేసే రాష్ట్రం వరకు రానుపోనూ చార్జీలు కాంట్రాక్టర్లే చెల్లించాలి. కాంట్రాక్టరు జీతం ఇవ్వకపోతే ప్రధాన యజమాని చెల్లించాలి. సమాన పనికి సమాన వేతనం, లింగ వివక్ష ఉండరాదని ఈ చట్టం చెబుతుంది. ఇవన్నీ చట్టాల రద్దు వల్ల అమలుకావు.
మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలకు, కార్మిక చట్టాల రద్దుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆక్షేపణ చెప్పింది. ఐఎల్ఓ కన్వెన్షన్ 144 ప్రకారం భారత ప్రభుత్వం అతిక్రమణకు పాల్పడింది. కార్మిక చట్టాలన్నీ రద్దయితే దేశంలో 'జంగిల్ రాజ్' ఏర్పడుతుంది. కార్మికులను కట్టు బానిసలుగా చేసి విపరీతమైన శ్రమ దోపిడీకి గురుచేస్తారు. దేశంలో మళ్ళీ బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు దాపురిస్తాయి.
1991 తరువాత నూతన ఆర్థిక విధానాల అమలులో భాగంగా కార్మికచట్టాలపై దాడి జరుగు తున్నది. అంతే పట్టుదలతో భారత కార్మికవర్గం ప్రతిఘటిస్తున్నది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అజెండాతో బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక చట్టాలపై దాడిని కూడా తిప్పికొడుతుంది. ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా కార్మికసంఘాలు ఒక్క తాటిపైకివచ్చి పోరాడాలని కార్మికవర్గం కోరుకుంటున్నది.
భూపాల్
సెల్: 9490098034