Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనదేశంలో ఆర్థిక అసమానతలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగు తున్నాయి. గడిచిన 30ఏండ్లలో ఈ సమస్య మరింత తీవ్రమైంది. కొనసాగు తున్న వలస కార్మికుల విషాదకాండ దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క హేయమైన మరో ముఖాన్ని మనకు చూపించింది. అయినా దేశ పాలకుల ఆర్థిక విధానంలో ఎటువంటి మార్పూలేదు. కొద్దిమంది ధనదాహానికి కోట్లాది ప్రజల జీవితాలు కాలి బూడిదయ్యే పాలనా నీతికే వారు అంకితం కాదల్చుకున్నారు.
కానీ, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆర్థిక దృష్టి కోణం మారుతున్నది. తమ దేశాల్లోని పౌరుల ఆర్ధిక స్థాయి వారి గౌరవప్రద జీవనానికి భంగకరం కాకూడదని, సంపన్నుల ధన దాహానికి పరిమితులు ఉండాలని పెట్టుబడి వ్యవస్థ సమర్థకులు, వారి ఆర్థిక నిపుణలు సైతం భావిస్తున్నారు. రెండు పరస్పర వ్యతిరేక ఆర్థికవర్గాల మధ్య దారుణమైన అసమానత లను వారు కోరుకోవటం లేదు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్లు సైతం పూనుకుని ఈ విషయంలో వివిధ దేశాల్ని హెచ్చరి స్తున్నాయి. ఇందుకు పెట్టుబడి వ్యవస్థ నైతికతను కాపాడటం ఒక కారణం కావచ్చు, ఇంకా భరించలేని స్థాయికి ప్రజల జీవితాల్ని తీసుకెళ్లివారిలో అశాంతి, తిరుగుబాట్లు పెంచకూడదనేది కూడా మరో కారణం కావచ్చు. కారణమేదైనా వారు ఆర్థిక అసమానతల అదుపుకోసం అనేక ప్రమాణా లను, నివారణ చర్యలను ఎప్పటికప్పుడు తెలియ జేస్తూనే ఉన్నారు. కానీ మన దేశంలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. భారతదేశం 12.6 ట్రిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంత మైన పదిదేశాల్లో ఏడవ దేశంగా ఉంది. ఇటీవల ప్రపంచ కుబేరుల క్లబ్లో దేశీయ కుబేరుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. అదే సమయంలో పేదలు అత్యధికంగా గల దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఆక్స్ఫామ్ నివేదిక ''టైమ్ టు కేర్,'' 2020 ప్రకారం భారతదేశంలో సంపన్ను లైన ఒక శాతం జనాభా దగ్గర దేశంలోని మొత్తం సంపదలో 42.5శాతం చేరి ఉంది. ఇది దేశంలోని ఆర్థికంగా వారికంటే దిగువన ఉన్న 70శాతం జనాభా కలిగి ఉన్న మొత్తం సంపదకు నాలుగురెట్లు ఎక్కువ. భారత దేశంలోని పదిశాతం జనాభా దగ్గర దేశ సంపదలో 75శాతం ఉండగా మిగిలిన తొంబైశాతం ప్రజల దగ్గర కేవలం 25శాతం సంపద మాత్రమే ఉంది. ఇంకా సరళంగా మార్చాలంటే దేశంలోని పై 50శాతం జనాభా దగ్గర 97.2శాతం సంపద ఉండగా కింది 50శాతం జనాభా దగ్గర కేవలం 2.8శాతం మాత్రమే ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఒక్క అమెరికా తప్ప అభివృద్ధి చెందిన యూరప్ దేశాలతో సహా ఎక్కడా ఇంత విచ్చలవిడిగా సంపద కేంద్రీకరణ జరగటం లేదు. అంతకు ముందు కూడా ధనిక పేద తారతమ్యాలు ఉన్నాయి, కానీ ఒకవైపు గుట్టల కొద్దీ డబ్బున్నవాళ్ళు మరోవైపు ఆ గుట్టల కింద పరిగె ఏరుకునే వాళ్ళు ఉండటం ఈ మధ్య కాలపు పరిణామమే. భారతదేశం మొట్ట మొదటి స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి నివేదిక - 2019 ప్రకారం భారత దేశంలో పదిశాతం సంపన్న జనాభా 1980లో జాతీయ ఆదాయంలో (జాతీయ సంపద కాదు) 32శాతం కైవసం చేసుకుంటుండగా 2016 నాటికి అది 55శాతానికి చేరింది. స్వతంత్రంగా డేటా తీసుకుంటూ విశ్లేషించే ''ఆక్స్ ఫామ్ నివేదిక 2019'' ప్రకారం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. దేశంలోని కేవలం ఒక శాతం జనాభా 2017లో ఉత్పత్తి అయిన మొత్తం జాతీయ ఆదాయంలో 73శాతాన్ని తన ఖాతాలోకి మళ్ళించుకుంది. ఇలా దేశంలోని కొద్దిమంది కార్పొరేట్ల సంపదలో కొన్నిరెట్ల ఎదుగుదల నమోద వుతుండగా 80శాతం భారతీయతులు తమ సంపదలో కేవలం నామమాత్రపు ఎదుగుదలను మాత్రమే చూస్తున్నారు. దేశంలో ఈరోజు దారిద్ర రేఖకు దిగువన (కటిక పేదరికంలో) ఉన్నవారు 10శాతమైనా ఉంటారు. అంటే 13కోట్లకు పైబడిన ప్రజలన్న మాట. ఆపైన అంతా సంపన్నులనుకుంటే పొరపాటే. సాపేక్ష పేదరికాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ సంఖ్య నూటికి 70శాతం ఉంటుంది. ఇలా పిడికెడు మంది సంపద అనంతంగా పెరుగుతూ, మెజారిటీ ప్రజలు నిత్యగండం తో బతకటం వాంఛనీయం కాదు. న్యాయం అసలే కాదు. కోట్లలో శ్రామికులు, వందల్లో మాత్రమే, ప్రభుత్వ విధానాల్ని ప్రభావితం చేయగల పెట్టుబడిదారులు ఉంటూ విపరీతంగా మానవ శ్రమను, సహజ వనరులను కొల్లగొడుతూ పోతే ఆర్థిక అసమానతలు ఇలాగే పెరుగుతాయి.
సామాజి కోత్పత్తి రంగంలో దేశంలో ఈ రోజు 53కోట్ల మంది పనిచేసే వయోజనులుంటారు. అందులో భారత ఆర్థిక సర్వే 2019 ప్రకారం 93శాతం శ్రామికులు అసంఘటిత పద్దతిలో పని చేస్తున్నారు. వీరి సంఖ్య 50కోట్లు. అందులో వ్యవసాయం, ఇతర ఉత్పత్తి, సేవా రంగాలన్నీ వస్తాయి. అసంఘటిత రంగం అంటేనే ఏ హక్కులు లేని మానవ శ్రమ దోపిడీ క్షేత్రం. యజమానుల సంపద పెంచే పనిలో కార్మికుల రక్తమాంసాలు కరిగి పోతుంటాయి. కార్పొరేట్ యజమానులు కేవలం అందుబాటులో ఉన్న శ్రామికులను మాత్రమే ఉపయోగించుకోరు. వారి లాభాల కోసం మనుషుల్ని స్వతంత్ర, సంఘటిత రంగం నుంచి పరాధీన, అసంగటిత రంగానికి మార్చగలరు. ఎవరికీ నిఖర ఉద్యోగం, స్వయం ఉపాధి, ఆదాయం లేకుండా చేసి జీవితాల్ని దిన దిన గండంగా మార్చి తామిచ్చే కనిష్ట వేతనానికి పనిచేయటం తప్ప గత్యంతరంలేని పరిస్థితుల్ని సష్టించగలరు. గ్రామాల్లో వ్యవసాయం క్షీణించటం, అడవులల్లోకి ఆదివాసులను రానీయక పోవటం, ఈ రెండు ప్రాంతాలనుంచి నగరాలకు వలసలు పెరగటం యాదృచ్ఛికం కావు. ఇలా వారికి కావలసిన చవక శ్రామికులను ఉత్పత్తి చేసుకోవడమే కాదు, ఆపని కూడా దొరకని నిరుద్యోగులను పెంచి నిలవగా ఉంచు కుంటారు. 'ఉద్యోగం కోసమే చదువు'కుని ఇంగ్లీష్ మాట్లాడే వేతనజీవులకూ ఇది వర్తిస్తుంది. ఇటువంటి శారీరక, మేథో శ్రామిక మనుషులనే పెట్టుబడి దృక్పథం ''మానవ వనరులు'' అంటుంది. సంపన్నుల వ్యాపారానికి ఇతర వనరులతో పాటు ''మానవులు'' కూడా కావాలని వారి ఉద్దేశ్యం. ఇక అన్ని పార్టీల ప్రభుత్వాలు కొంతకాలంగా ఏకగ్రీవంగా చేస్తున్న పని ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల్లేకుండా చేయటం, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగు లకు హక్కుల్లేకుండా చేయటం. దేశంలోకి, రాష్ట్రాల్లోకి పెట్టుబడితో వచ్చే బాబులంటే ప్రభుత్వాలకు చెప్పలేనంత ప్రేమ. తమ దగ్గరకంటే తమ దగ్గరకు రమ్మని పోటీపడి వారిని ఆకర్శిస్తూ ఉంటారు. వచ్చేవారు విదేశీ బాబులైతే ఇక ఆ ఉత్సాహం చెప్పలేం. వారి 'పెట్టుబడి'కి కావల్సిన భూమిని, నీళ్లను, ముడి సరుకుని, కారు చవకైన హక్కుల్లేని కార్మికుల్ని, ఇంకా అప్పులు తీసుకుని ఎగబెట్టటానికి బ్యాంకుల్ని సమకూరుస్తారు. ఇంత చేసినా వారికి లాభం రాకపోతే తానే ఎదురిస్తానని పూచీ పడుతారు. ఈ మాత్రం దానికి ప్రతి రాజకీయ నాయకుడూ తనను తాను డైనమిక్ లీడర్నని అనుకుంటాడు.
'డబ్బు' అనేది వస్తుమార్పిడి పద్ధతిని సులభతరం చేయటానికి వచ్చిందనే ప్రాథమిక జ్ఞానం ఉన్న ఎవరికైనా వస్తువు లకు బదులు టోకెన్ లాంటి డబ్బుతో మార్పిడి చేసుకుంటున్నామని తెలియాలి. ఉత్పత్తయ్యే వస్తువులు లేదా సేవలు ఏవైనా శ్రమతో సమానార్థకాలు. కాబట్టి డబ్బు అంటే శ్రమనే. ఒకడి దగ్గర గుట్టలుగా పోయ గలిగినంత డబ్బు ఉంది అంటే అర్థం వాడి దగ్గర గుట్టలు గుట్టలుగా శ్రమ రాశులు పోగై ఉన్నాయని. అంత పెద్ద శ్రమ రాశికి అతను స్వయంగా చేర్చిన శ్రమ పాలు ఒకటి రెండు శాతం ఉండవచ్చు. కానీ మిగతా భాగం డబ్బు రూపంలో ఉన్న శ్రమరాశి అంతా అతనిది కానేకాదు. అది పూర్తిగా ఇతరులది. ఇతరుల రక్తమాంసాలు, సుఖా లెరుగని జీవితాలు కరిగిపోయి, దోపిడీ చేయబడి ఇలా అతని దగ్గర పోగుపడి ఉన్నాయి. ఆ ఇతరులే అతని దగ్గర ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పని చేసిన వేలాది, లక్షలాది కార్మికులు. ఉత్పత్తి విలువలో నుంచి శ్రామికులకు న్యాయంగా అందాల్సిన వాటాను ఇవ్వకుండా ఆపి, దాన్ని డబ్బు రూపంగా మరోచోట పెట్టుబడి పెట్టి, ఇలా మళ్లీమళ్లీ చేస్తూ గుట్టలుగా రాసులు పోసుకుంటూ వెల్లటమే ఆర్థిక అసమానత లు పెరగటానికి ప్రధాన కారణం. సహజ వనరుల్ని కొంతమందే కైవసం చేసుకోవటం, సంపన్నులకే ప్రభుత్వాల 'ఉద్దీపనలు' అదనపు కారణాలు.
దారుణమైన ఆర్థిక అసమానతలు పోవాలంటే ప్రభుత్వాలు ''ఒక శాతం'' సంపన్నుల కోసం కాకుండా 99శాతం గల పౌరుల కోసం పని చేయాలి. శ్రామికుల, బలహీనుల జీవన స్థాయిలో గౌరవనీయ మైన వద్దే పరిపాలనా సమర్ధతకు, నాణ్యత కు ప్రమాణంగా ఉండాలి. పనిచేయగల పౌరులందరినీ ఉత్పత్తిలో భాగం చేయాలి. శారీరక, మేథో శ్రామికు లందరికీ ఉత్పత్తుల మార్కెట్ విలువలో ఎవరి శ్రమ వాటా వారికి పూర్తిగా అందాలి. సాధారణ ప్రజల సంపాదన, ప్రభుత్వ విధులైన విద్య, వైద్యం వంటి వాటిపై ఖర్చు కాకూడదు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్తో పాటు ప్రపంచ ఆర్థిక వేత్తలు సూచించినట్టు 'ఒక శాతం సంపన్న జనాభా'పై సంపద పన్ను (ఆదాయపన్నుకు అదనంగా) వేయాలి. ఈ ఏప్రిల్లో, కోవిడ్ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలంటే సంపన్నులపై పన్నులు పెంచాలని ప్రతి పాదించిన 50 మంది తన స్వంత ఐఆర్ఎస్ అధికారులను బెదిరించి, ముగ్గుర్ని పదవీచు తుల్ని చేశారు కేంద్ర పాలకమన్యులు. ఇక, ప్రభుత్వం సంపన్నులపై పన్నులు వేయగల దనే ఆశల్లేవు. 20లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ లోనూ 50కోట్ల శ్రామికుల వేతనాన్ని ఒక్క రూపాయి అయినా పెంచు తామని చెప్ప లేదు. ఇక ఈ విషయంలో ప్రజలే పూనుకుని పాలకులు చేయాల్సిన పనులేవో చెప్తూ, వారిని దారిలో పెట్టే నేర్పేదో సంపాదించు కోవాలి.
డాక్టర్ ఎస్. తిరుపతయ్య
సెల్: 9849228212