Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా అయినా... కాకరకాయైనా అయిన వారికి తీపి.. కాని వారికి చేదు.. అన్న చందంగా దాన్ని సృష్టిస్తారు. మూడు నెలలుగా ప్రపంచం స్తంభించి పోతున్న తరుణంలో దాని తీవ్రతను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి పాలక వర్గాలు. సడలింపులు, వ్యాధి కారకంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నవ్వు తెప్పిస్తున్నది. ధనవంతుల పెండ్లిండ్లకు ఎంతమంది వచ్చినా ఏమి అనదు.. కాని పేదల పెండ్లికి 50మందికి మించి ఒక్కరు ఎక్కువొచ్చినా కరోనా రెచ్చిపోతది. కారులో ముగ్గురు ప్రయాణించవచ్చు.. నాల్గవ వ్యక్తి కారెక్కితే అతనికి మాత్రమే కరోనా సంక్రమిస్తుంది. బస్సులో 30మంది మాత్రమే ప్రయాణించాలి.. 31వ వ్యక్తి ఎక్కితే కరోనా వస్తుంది. టూవీలర్పై వెనక కూర్చున్న వ్యక్తి మాత్రమే కరోనాకు ఆకర్షితుడౌతారు తప్ప బైక్తోలే వ్యక్తికి కరోనా సోకదు. సాయంత్రం ఏడుగంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కరోనా అటు ఇటు బాగా తిరుగుతుంది.. కాబట్టి మీరు ఆ సమయంలో బయటకు రాకూడదు. వైన్షాప్ నుంచి మద్యం కొంటే కరోనా తప్పుగా భావించదు.. కానీ బార్లో కూర్చుండి తాగితే కరోనా పట్టుకుంటుంది. ఒకవేళ మీరు పాస్ తీసుకొని వివిధ జోన్లలో ప్రయాణించినా పరవాలేదు.. కానీ పాస్ లేకుండా ప్రయిణిస్తే కరోనా మిమ్మల్ని అమాంతం మింగేస్తుంది. మాస్క్ లేకున్నా రాజకీయ నాయకులను వారి అనుచరులను కరోనా తాకే ధైర్యం చేయదు.. కానీ సామాన్యులను మాస్క్ లేకుండా చూసి అమాంతం మింగేస్తుంది. హౌటల్లో భోజనం చేస్తే కరోనా పట్టుకుంటుంది.. కానీ హౌటల్ భోజనం ఇంటికి తీసుకెళ్ళి తింటే అది మిమ్మల్ని ఏమిచేయదు. జాగ్రత్తగా ఉండండి.. కరోనాతో జీవించటం నేర్చుకోండి.
-ఊరగొండ మల్లేశం