Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా తదనంతరం ఉద్యోగుల పరిస్థితులు ఎలా వుండబోతున్నాయో, ఇప్పటి నుంచే అంచనా వేసుకొని, భవిష్యత్తులో రాబోయే సవాళ్ళను ఎదుర్కోవడానికి, భారతదేశ కార్మికవర్గం, ఉద్యోగులు, పీడిత ప్రజలు ఐక్యమై భవిష్యత్తు పోరాటాలకు సిద్ధపడాలి. ఉద్యోగుల భద్రతకు ముప్పు కల్గించే విధానాలను తిప్పికొట్టాలి. ఉద్యోగులు చైతన్యంతో, ఐక్య పోరాటాలకు ముందడుగు వేయాలి. తద్వారా మాత్రమే పోరాడి సాధించుకున్న హక్కులను తిరిగి సాధించుకోగలం.
లాక్డౌన్ సమయంలో పోస్టల్ సర్వీసులను అత్యవసర సేవలుగా ప్రభుత్వం ప్రకటించింది. దాంతో, దేశవ్యాప్తంగా వున్న 1,55,000 పోస్టాఫీసులలో 5,65,000 మంది పోస్టల్ ఉద్యోగులు.. కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ కల్పించే పరికరాలు ఇవ్వకపోయినా.. అత్యంత సేవా దక్పథంతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా వుండగా, కరోనా విపత్తు వలన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిందని, ఈ విపత్తు నుంచి గట్టెక్కాలంటే దేశ ప్రజలందరూ సహకరించాలని ఒక పక్క చెబుతూ.. మరొక పక్క ఉద్యోగులను, కార్మికులను దొంగదెబ్బ తీసే విధానాలను పాలకులు అవలంభిస్తున్నారు. తపాలాశాఖను కార్పొరేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నారు.
మొదటగా, కామన్ సర్వీసు సెంటర్ల (సీఎస్సీ) పేరుతో 34రకాల పౌర సేవలతోబాటు ప్రస్తుతం పోస్టాఫీసు కౌంటర్లలో అందించే సేవలన్నింటిని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా పోస్టాఫీసు ప్రాంగణంలోనే అందిస్తారు. ఈ-సేవా కేంద్రాలలో అందించే సర్వీసులన్నింటిని 'కామన్ సర్వీసు సెంటర్ల' (సీఎస్సీ)లో అందిస్తారు. 2014లో టీఎస్ఆర్ సుబ్రమణ్యం కమిటీ చేసిన సిఫార్సులన్నింటిని నేడు మెల్లగా అమలు చేస్తున్నారు. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టుకు వ్యతిరేకంగా, ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేయడంతో, తాత్కాలికంగా నివేదిక అమలును వాయిదా వేశారు. ఇప్పుడు తిరిగి ఆ రిపోర్టును బయటికి తీసి, పేర్లు మార్చి అమలు చేస్తున్నారు. పోస్టల్ స్మాల్ సేవింగ్స్ బ్యాంకు స్కీమ్లను నిర్వీర్యం చేసే విధంగా ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) కౌంటర్లను, ప్రస్తుత పోస్టాఫీసు ప్రారగణంలోనే విడిగా కౌంటర్లు తెరచి పనిచేయిస్తున్నారు. డిపార్టుమెంటు కౌంటర్లతో పాటు, ఈ ఐపీపీబీ కౌంటర్లు కూడా సమాంతరంగా నడుస్తాయి. ఈ ఐపీపీబీ కంపెనీలో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్లు, ఆపై ఉద్యోగులంతా డిపార్టుమెంటుకు సంబంధంలేని ఉద్యోగులు. అంటే ఐపీపీబీ ఉద్యోగులు.. డిపార్టుమెంటు ఉద్యోగులపై పెత్తనం చేస్తారన్నమాట.
సమర్థవంతంగా పని చేస్తున్న పార్శిల్ డెలివరీ వ్యవస్థను నాశనం చేసే విధంగా, నోడల్ డెలివరీ సెంటర్ల (ఎన్డీసీ) పేరుతో డీసెంట్రలైజ్ డెలివరీ సిస్టమ్కు బదులుగా, సెంట్రలైజ్డ్ డెలివరీ సిస్టమ్ను.. ఎంపిక చేసిన ప్రధాన కార్యాలయాలలో ప్రారంభించారు. ప్రస్తుతం సెంట్రలైజ్డ్ పార్శిల్ డెలివరీ సిస్టమ్ తీసుకురావటం వల్ల సామర్థ్యం పడిపోయి, ప్రజలకు సరైన సమయంలో అందించలేని విధంగా తయారవుతుంది. గతంలో ఈ పద్ధతిని ఒకసారి ప్రారంభించి సమర్థవంతంగా నిర్వహించలేక మూసివేసిన అనుభవం మన కండ్ల ముందున్నప్పటికీ తిరిగి అదే పద్ధతిని అమలు చేసేందుకు అధికారులు పూనుకుంటున్నారు.
కోట్లాది పాలసీలతో లాభాలతో నడుస్తున్న 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్'ను కూడా కార్పొరేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నారు. సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీి) పేరుతో, పోస్టాఫీసు ప్రాంగణంలోనే పని చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మెయిల్ బ్యాగులను ఒకప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, పట్టణాలకు రైళ్ళ ద్వారా, సొంత కార్గోతో, గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా సమయానికి చేరవేస్తున్నాయి. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న విధానం. ప్రస్తుతం ఆ విధానానికి తిలోదకాలిచ్చి 'రోడ్డు ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్' (ఆర్టీఎన్) ద్వారా పోస్టల్ మెయిల్ బ్యాగులను చేరవేసే విధానాన్ని తీసుకొచ్చేందుకు కోవిడ్ నేపథ్యంలో ప్రయివేటు ట్రావెల్ ఏజెన్సీలకు టెండర్లు పిలిచారు. ఈ విధానంవల్ల రెట్టింపు ఖర్చు అవుతుందని అధికారులకు తెలిసినా ప్రయివేటు దిశగానే ముందుకెళుతున్నారు. అదేవిధంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య పెరిగి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతున్నది. మెయిల్ బ్యాగ్లు చేరవేయటంలో జాప్యం జరుగుతుంది. ఇది కూడా కార్పొరేటీకరణలో భాగమే.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ), ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు (ఐపీపీబీ), నోడల్ పార్శిల్ డెలివరీ సెంటర్లు (ఎన్డీసీ), కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ) ద్వారా తపాలా శాఖకు ఆదాయం వస్తుంది. అలాంటి లాభాలు వచ్చే విభాగాలను, కార్పొరేటీకరించాలని పాలకులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజలు వణికిపోతున్న సమయాన్ని అందుకు సరైన సమయంగా భావించిన కేంద్ర ప్రభుత్వం...ఆదరా బాదరాగా, కార్పొరేటీకరణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత డిపార్టుమెంటు డైరెక్టరేట్తో సంబంధం లేకుండా మరో 4 డైరెక్టరేట్లు న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తూ, ఎప్పటికప్పుడు ఈ విభాగాల పనిని పర్యవేక్షిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో, అనేక విధాలుగా ఇప్పటికే సేవలందిస్తున్న బ్రాంచి పోస్టాఫీసులన్నింటిని కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ)గా మార్చి వేసి, పౌర సర్వీసులన్నింటిని అనుమతించేందుకు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్లో ఇవన్నీ కూడా ఫ్రాంఛైజీలుగా, ఏజెన్సీల కింద పని చేయించేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 1,29,000 బ్రాంచి పోస్టాఫీసులలో పని చేసే 3లక్షల గ్రామీణ సేవక్ ఉద్యోగుల (జీడీఎస్) పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికీ వీరు గౌరవ వేతనం పేర అతితక్కువ వేతనాలతో, ఎలాంటి సౌకర్యాలకు నోచుకోకుండా జీవితాలు వెళ్ళదీస్తున్నారు. అయితే, ఆ కాస్త బతుకు దెరువును కూడా ఏజెన్సీలు, కమిషన్ల పేరుతో ఆగం చేయాలని ప్రయత్నిస్తున్నారు.
2024 కల్లా తపాలాశాఖను కార్పొరేటీకరించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో 'విజన్ డాక్యుమెంటు' ను విడుదల చేసింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డాక్యుమెంటు అమలును సమీక్షించుకొని, లోపాలు సరిదిద్దుకుంటూ, జాప్యం లేకుండా అమలు చేయాలని తిరిగి న్యూఢిల్లీలో జనవరిలో జరిగిన సమావేశంలో ఆదేశించారు. ప్రణాళికా బద్ధంగా కార్పొరేటీకరణ పూర్తి చేసేందుకుగాను.. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది విజన్ డాక్యుమెంటులో చాలా వివరంగా వుంది. దానికనుగుణంగానే పోస్టల్శాఖను అత్యంత వేగంగా కార్పొరేటీకరించే ప్రయత్నాల్లో వున్నారు.
ఉద్యోగ భద్రతకు ముప్పు
ప్రస్తుత పోస్టాఫీసు భవనం లోనే 'కామన్ సర్వీస్ సెంటర్లు' (సీఎస్సీ) కౌంటర్లను విడిగా ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ ప్రస్తుతం ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నడుపుతారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రస్తుత బ్రాంచి పోస్టుమాస్టర్లే కౌంటర్లను నడిపిస్తారు. ప్రస్తుత పోస్టాఫీసు కౌంటర్లలో పనిచేసే సర్వీసులను, తదుపరి సిఎస్సి కౌంటర్లకు బదిలీ చేస్తారు.
ఈ విధంగా ఇప్పటికే డిపార్టుమెంటులో ఒప్పందం జరిగింది. అంటే, పోస్టాఫీసు భవనంలోనే సీఎస్సీ కంపెనీ కౌంటర్లు సమాంతరంగా కొనసాగుతాయి. ఆదాయం వచ్చే పీఓఎస్బీ, పీఎల్ఐ/ఆర్పీఎల్ఐ, రిజిస్టర్డ్ పోస్టు, స్పీడ్ పోస్టు/పార్సిల్ బుకింగ్, మనియార్డర్ బుకింగ్ లాంటి ప్రధాన విభాగాలను వివిధ కంపెనీలకు బదలాయిం చడంతో పోస్టాఫీసులో పని చేసే, డిపార్టుమెంటు ఆఫ్ పోస్టుకు సంబంధించిన ఉద్యోగులకు పని లేకుండా పోతుంది. ఒకసారి సదరు కంపెనీలు తమ ఉద్యోగులను నియమించుకున్నాక డిపార్టుమెంటు ఉద్యోగుల భద్రతకు సహజంగానే ముప్పు వాటిల్లుతుంది. అంటే 'డిపార్టుమెంటు ఆఫ్ పోస్టు'లో పని చేసే 5,65,000 మంది ఉద్యోగుల భద్రత ప్రమాదంలో పడి, డేంజర్ బెల్ మోగిస్తుందనటంలో సందేహం లేదు.
అంతేకాక, పోస్టల్ అకౌంట్ల పని విభాగాన్ని ప్రధాన తపాలా కార్యాలయాలకు బదలాయించి పని చేయించే ప్రయత్నం జరుగుతున్నది. పోస్టల్ అకౌంట్ల విభాగాల్లో పని చేసే ఆరు వేల మంది ఉద్యోగులను సర్ప్లస్గా చూసే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాక, అన్ని క్యాడర్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ నిబంధనలను మార్చివేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులలో పని చేసే ఉద్యోగులను ఆపరేటివ్ ఆఫీసులకు (పోస్టాఫీసులకు ఇంటర్ బదిలీ) తీసుకొచ్చే విధానాలను రూపొందించారు. తద్వారా ఉద్యోగులను పెద్దఎత్తున తగ్గించే అవకాశం ఉంది. ఇవన్నీ ఉద్యోగ భద్రతకు ముప్పు కల్గించే చర్యలు. కనుక ప్రమాదకరమైన, ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ఈ విధానాలను ఉద్యోగ సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. పోస్టల్ సర్వీసులను ఔట్ సోర్సింగ్కు అప్పగించే, కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ విధానాలను పూర్తిగా తిప్పికొట్టాలని, పోరాట కార్యక్రమం ఇప్పటికే చేపట్టాం.
ఉద్యోగ సంఘాలపై నిర్బంధం
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న చట్టాలను మార్పు చేసి, ఉన్న హక్కులను రద్దు చేసి, నిర్బంధాన్ని మరింతగా పెంచే పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, పోస్టల్ ఉద్యోగులు పోరాటాల ద్వారానే తపాలా శాఖను కాపాడుకోవాలి. కాపాడుకుంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలి. కరోనా తదనంతరం ఉద్యోగుల పరిస్థితులు ఎలా వుండబోతున్నాయో, ఇప్పటి నుంచే అంచనా వేసుకొని, భవిష్యత్తులో రాబోయే సవాళ్ళను ఎదుర్కోవడానికి, భారతదేశ కార్మికవర్గం, ఉద్యోగులు, పీడిత ప్రజలు ఐక్యమై భవిష్యత్తు పోరాటాలకు సిద్ధపడాలి. ఉద్యోగుల భద్రతకు ముప్పు కల్గించే విధానాలను తిప్పికొట్టాలి. ఉద్యోగులు చైతన్యంతో, ఐక్యపోరాటాలకు ముందడుగు వేయాలి. తద్వారా మాత్రమే పోరాడి సాధించుకున్న హక్కులను తిరిగి సాధించుకోగలం.
ఎస్ఎస్ఆర్ఎ ప్రసాద్
సెల్ : 9490300867