Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాదక ద్రవ్యాలు శారీరక, మానసిక రుగ్మతలను కలిగించడమే గాక నైతిక విలువలను దిగజారుస్తాయి. హెరాయిన్, స్పీడ్, ఎక్స్రానీ, కొకెయిన్, కెటమైన్, గామాహయద బుటిరటె, తదితర మాదకద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమైనవి. ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా జరూపుకుంటారు. ప్రపంచంలో 15 నుంచి 70 సంవత్సరాల వయసు వారిలో 30 కోట్ల మంది గత పన్నెండు నెలల్లో ఒక్క సారి అయినా ఏదో ఒక మాదక ద్రవ్యాన్ని ఉపయోగించిన వారేనన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. ప్రపంచ జనాభాలో 10శాతం మంది మాదక ద్రవ్యాలకు బానిసలై ఉన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 70 నుంచి 100 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొన్నది. మాదక ద్రవ్యాల వ్యాపారం వల్ల సంపాదిస్తున్న డబ్బు ఆసియా, ఆఫ్రికా దేశాలలో తిరుగుబాట్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించబడుతున్నదని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో పాపి (నల్లమందు) బాగా పండించబడుతుంది. దీనివల్ల వచ్చే డబ్బుతో తాలిబన్ మొదలైన ఉగ్రవాదులు బల పడుతున్నారు. పాక్ గూఢచార సంస్థ, పాకిస్థానీ సైన్యం, మాఫియా ఏకమై మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నాయి. దీని ద్వారా వచ్చే డబ్బును జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజాన్ని పోషించడానికి ఉపయోగిస్తున్నారని పరిశీలకుల అభిప్రాయం. మన దేశంలో సుమారు 20కోట్ల మంది మాదక ద్రవ్యాలకు బానిస అయినట్టు పరిశోధనలో వ్యక్తమైంది. కొకైన్ వ్యాపారం భారత్లో బాగా సాగుతోంది. ఒక్క గ్రాము ధర సుమారు 20వేల రూపాయలు ఉంటుంది. మనదేశంలో సంవత్సరానికి మూడు వందల కిలోలు వినియోగించబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మెదక్ జిల్లా, నాగర్ కర్నూల్, పాడేరు, కడప, కర్నూలు, మొదలగు ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుందని ఎక్సైజ్ శాఖ రికార్డుల్లో తేటతెల్లమవుతున్నది
వివిధ పంటలలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారు. గంజాయికి బానిసైన యువత ఆ మత్తులో తూలుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. మధ్య దళారుల ద్వారా కళాశాల విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. గంజాయిని సిగరెట్లు, చుట్టలు బీడీలలో పెట్టి విక్రయిస్తున్నారు. యువత ధూమపానం మజాలో తేలిపోతూ తమను తాము మరిచిపోయి మత్యువుకు చేరువ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మాదకద్రవ్యాలను గురించి సంపూర్ణ అవగాహన కలిగించడమే ఈ దినోత్సవం ముఖ్యలక్ష్యం, ఉద్దేశం. 1987సంవత్సరంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో చేసిన ఒక తీర్మానాన్ని అనుసరించి ప్రతి ఏటా జూన్ 26న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1985లో భారత ప్రభుత్వం అaతీషశ్ీఱష సతీబస్త్రర aఅస జూరyషష్ట్రశ్ీతీశీజూఱష రబbర్aఅషవర చట్టాలు చేసింది. ఈ చట్టం ప్రకారం ఉత్పత్తిదారులకు వినియోగదారులకు కనీసం పదేండ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో న్యూఢిల్లీలో 17.3.1986లో ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలి. ప్రతి కళాశాల ముందు నిఘా ఏర్పాటు చేసి విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు కాకుండా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే అనర్ధాలపై గ్రామాలలో యువతకు విస్తత ప్రచారం చేపట్టాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు వివిధ వేదికలు, భాగస్వాములు కావాలి. మాదకద్రవ్యాల అంతమే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి.
కె. సతీష్రెడ్డి
సెల్: 984844513