Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవిలోని జంతువుల్ని గమనించడి.. దేని స్వభావం దానిది. సహజ స్వభావ సిద్ధంగా ఆయా జంతువులు జీవిస్తున్నాయి. కానీ, ఒక్క మనిషి మాత్రమే మనిషిలా బతకడం లేదు. ఒకడు పెత్తందారులా, మరొకడు బానిసలా, ఒకడు పూజారిలా, మరొకడు భక్తుడిలా, ఒకడు ఉన్నతమైన వాడిగా, మరొకడు నీచమైనవాడిగా ఎందుకు బతుకుతున్నాడూ? ఎక్కడో ఏదో కుట్ర జరిగిందని తెలియడం లేదా?
ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన రిపోర్టు ప్రకారం ఈ భూమి మీద ఉన్న ప్రపంచ జనాభా సుమారు 750 కోట్లు. అందులో సుమారు 221 కోట్ల మంది క్రైస్తవులు అంటే అత్యధిక జనాభా వీరిదే. అంతే కాదు, మత విశ్వాసకుల్లో మొదటి స్థానం కూడా వీరిదే. వీరు వందకు పైగా వివిధ దేశాల్లో వ్యాపించి ఉన్నారు. అలాగే సుమారు 52 దేశాల్లో ముస్లింలు 155 కోట్ల మంది ఉన్నారు. మత విశ్వాసకుల్లో వీరి స్థానం రెండవది. ఇక ప్రపంచంలో మూడవ స్థానం నిరీశ్వర వాదులది. వీరి జనాభా 130కోట్లు. వీరు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నారు. గతంలో మత దురహంకార ఫలితంగా జరిగిన మతహింస తెలుసుకున్న అన్ని మతాల వారూ, తమ తమ మత విశ్వాసాలను వదిలిపెట్టి, స్వచ్ఛందంగా బయటికి వస్తున్నారు. హేతువాదులవుతున్నారు. ఏ ఒక్క దేశంలోనో, ఏ ఒక్క మత విశ్వాసకులలోనో ఈ పరివర్తన రావడం లేదు. మత దుర్మార్గాల నుంచి బయటపడాలనుకున్న వారు అన్ని దేశాల్లో అన్ని మతాల్లోనూ ఉన్నారు. ఇక నిరీశ్వరవాదుల - మానవవాదుల తర్వాత నాలుగోస్థానం హిందువులది.వీరి జనాభా 100 కోట్లు. తర్వాత ఐదోస్థానంలో బౌద్ధులున్నారు. వీరి జనాభా 56కోట్లు. మిగిలిన జనాభాలో వరుసగా ఇజ్రాయిల్లో ఉన్న జుడాయిజంకు చెందినవారు, తర్వాత జైనమతానికి చెందినవారు, ఆ తర్వాత జోరాష్ట్రియనులు, ఇతర ఆటవిక, ఆదివాసీ జాతులు - వీరందరూ కలసి 50కోట్లకు మించిన జనాభా ఉంది.
మానవ వాదులు, నిరీశ్వరవాదులు సంతోషించాల్సిందేమంటే వారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగి, మూడోస్థానానికి వచ్చింది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన రిపోర్టు ప్రకారం ప్రపంచంలో మనుషులు క్రమంగా దైవ విశ్వాసంలోంచి బయటపడుతూ మానవవాదంపై మమకారం పెంచుకుంటున్నారనీ, ఇంత కాలం ఊహా మాత్రంగా ఉన్న మానవాతీతశక్తుల్ని పక్కనపెట్టి మానవీయశక్తులపైనే విశ్వాసం పెంచుకుంటున్నారనీ - అర్థమవుతూ ఉంది. అందువల్ల మతం పేరుతో జరిగే మూకదాడులూ, హత్యలూ ఆగుతాయి. మతం పేరుతో, దేవుడి పేరుతో జరిగే దోపిడీలకు అడ్డుకట్ట పడుతుంది. తమను రక్షించే వారు గానీ, తమ పాపాల్ని హరించేవారు గానీ ఎవరూ లేరని నిర్ధారణ అయిపోతుంది. మనుషులంతా ఎవరికి వారు వ్యక్తిగత క్రమశిక్షణతో మసలుకుంటారు. భ్రమలు పగిలిపోతేనే కదా వాస్తవాల్ని అర్థం చేసుకుంటారు? వాస్తవాలు అర్థమయినప్పుడే కదా మనిషి జ్ఞానవంతుడవుతున్నాడూ? రాగల కాలాలలో ఇంకా మూఢత్వంలో కూరుకుపోయి ఉన్న క్రైస్తవ, ఇస్లాం, హిందూ మత విశ్వాసకుల సంఖ్య బాగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. అప్పుడు మతాలకు అతీతంగా మనిషి, మనిషిగా ప్రవర్తించే వీలుంటుంది. మత పిచ్చిలో పడి ఒక మతం వారు, మరో మతం వారిని ద్వేషించడం ఉండదు. తమ తమ మతాల్లోకి ఇతర మతాల వారిని ఆకర్షించడానికి దిగజారుడు విధానాలు అవలంభించడం ఉండదు. మనుషులెవరూ పాపులు కారని, తమ నెవరూ సృష్టించలేదని, వారసత్వ సంపదగా తమకు అందిన ఈ ప్రకృతిని, ఈ వాతావరణాన్ని భద్రంగా వచ్చే తరాలకు అందించాల్సిన బాధ్యత తమ మీద ఉందని గ్రహిస్తారు. మనుషులకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. అప్పుడు ఏ రకమైన వివక్ష లేకుండా అందరూ సమానంగా, సగర్వంగా ఆత్మ విశ్వాసంతో బతకగలుగుతారు.
నార్వే, డెన్మార్క్, స్వీడన్, స్విర్జల్లాండ్, ఫిన్లాండ్ వంటి స్కాండినే వియన్ దేశాలలో మార్పులు శీఘ్రగతిన, పెత్త ఎత్తున జరుగుతున్నాయి. మత విశ్వాసాలే తగ్గుముఖం పట్టినప్పుడు ఇక ప్రార్థనా స్థలాల అవసరమేముంటుంది? ఫాదర్లు, ప్రీస్ట్లు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోలేక ఇతర వృత్తుల్లో స్థిరపడాల్సిందే. అందుకే అక్కడి చర్చ్లన్నీ క్లబ్బులకు, పబ్బులకు, లేదా విద్యా సంస్థలకు లీజుకిస్తున్నారు. ఆయా దేశాల్లోని ప్రజలు మానవహక్కులతో, సమభావంతో ప్రశాంతంగా ఆనందంగా గడుపుతున్నారు. ఆ దేశాల్లో పర్యావరణ కాలుష్యం తక్కువ. లంచగొండి తనం తక్కువ. హత్యలు, దోపిడీలు, అనైతిక కార్యక్రమాలు అతి తక్కువ. నిరీశ్వర వాదాన్ని బలపరిచే అక్కడి జనులు మానవ హుందాతనాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయారు. వైజ్ఞానిక దృక్పథానికి, సమాజంలో మానవీయ విలువల స్థాపనకు సామాన్య ప్రజలంతా కార్యకర్తలై పనిచేస్తున్నారు.
ప్రజల్లో అహేతుక ధోరణి బాగా ఉందంటే, ఆ సమాజం తప్పకుండా మత విశ్వాసాల మీద ఆధారపడి ఉన్నట్టే... ఉదాహరణకు మనం ఆఫ్రికా దేశాల్ని పరిశీలించొచ్చు. అక్కడ విద్యా వ్యవస్థ సరిగాలేదు. మానవ హక్కులు సరిగా లేవు. పేదరికం తాండవమాడుతూ ఉంది. కారణం అక్కడి ప్రజలు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. పైగా అక్కడ బొకొ హరమ్ - వంటి తీవ్రవాద ముస్లిం గ్రూపుల పెత్తనం కొనసాగుతూ ఉంది. ఎక్కడైతే మతం - బానిసత్వంలోకి దారితీస్తుందో, దాని ప్రభావం ప్రధానంగా మహిళల మీద పడుతుంది. మతాన్ని వదిలేసిన మహిళలు ఏ సమాజంలోనైనా సమాన హక్కులతో,స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు. మత విశ్వాసాలకు లోబడి ఉండడమంటే, బానిసత్వంలో మగ్గడమేనని ప్రపంచ ప్రజానీకం క్రమంగా గ్రహిస్తున్నారు.
ఎవరు ఎప్పుడు ఏ ప్రాంతంలో, ఏ తల్లిదండ్రులకు పుడతారన్నది యాదృచ్ఛికం. ఏ పూర్వ జన్మ సుకృతమూ కాదు. పుట్టినప్పుడు ఏ శిశువుకూ మతాల గురించి గాని, కులాల గురించి గాని, వర్ణ, వర్గ వివక్షల గురించిగానీ తెలియదు. పుట్టి పెరిగిన వాతావరణంలో కుటుంబ సభ్యులు వాటిని నేర్పిస్తారు. ఎందుకంటే వారు ఆయా మత విశ్వాసాలతో జీవితం వెళ్ళబోశారు కాబట్టి! వాళ్ళు వాళ్ళ పిల్లల మెదళ్ళలో అవే విషబీజాలు నాటుతారు. అదే న్యాయం అనుకుంటారు. అదే ధర్మ పరిరక్షణ అనుకుంటారు. అలా చేయకపోతే ఏమవుతుంది? మంచే జరుగుతుంది. మానవులుగా, మతరహిత మానవులుగా మారే అవకాశాలు ఎక్కువవుతాయి. అలాంటి సమాజాల్ని, అలాంటి దేశాల్ని ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఎన్నో రకాల కాలుష్యాలకు గురై, నానాటికీ పాడైపోతున్న ఈ సమాజాలలో కొందరు మత కాలుష్యం కూడా పెంచుతున్నారు. మత కాలుష్యానికి పాల్పడిన వారిని దోషులుగా పరిగణించి, శిక్షించే రోజు రావాలి. అప్పుడే సమాజానికి, దేశానికి మేలు జరుగుతుంది.
'దైవాన్ని విశ్వసించండి. ధర్మాన్ని రక్షించండి. గుళ్ళు గోపురాలు పునరుద్దరించండి' అని కొందరు సామాజిక కార్యకర్తల్లా బయలుదేరుతారు. కొన్ని ఎన్జిఓ సంస్థలు కూడా పనిచేస్తాయి. ఎందుకంటే ఏదో కొందరి జీవనోపాధి తగ్గిపోతున్నందుకు వారు గాబరాపడుతున్నారన్న మాట! ఈ మానవులు పునరుద్దరణకు పూనుకుంటున్నారంటే, ఆ దేవుళ్ళ మహిమలు, మహత్యాలు పనిచేయడం లేదనే కదా.. మనం అర్థం చేసుకోవాల్సిందీ? పని చేయనివాటి కోసం హైరాన ఎందుకూ? నాస్తికత్వం అనేది ఈ దేశ సంస్కృతిలో అంతర్భాగం. వేల ఏండ్ల నాడే ఈ దేశం ప్రపంచానికి చాటి చెప్పింది. దాన్ని అశ్రద్ధ చేయడం వల్లనే ఎన్నో అనర్థాలు జరిగాయి. జరుగుతున్నాయి. ఆ చిన్న విషయం గ్రహిస్తే మానవజాతి ఒక పెద్ద ప్రయోజనాన్ని సాధించుకుంటుంది. మనుషులు మనుషుల్లా బతుకుతారు. అడవిలోని జంతువుల్ని గమనించడి.. దేని స్వభావం దానిది. సహజ స్వభావ సిద్ధంగా ఆయా జంతువులు జీవిస్తున్నాయి. కానీ, ఒక్క మనిషి మాత్రమే మనిషిలా బతకడం లేదు. ఒకడు పెత్తందారులా, మరొకడు బానిసలా, ఒకడు పూజారిలా, మరొకడు భక్తుడిలా, ఒకడు ఉన్నతమైన వాడిగా, మరొకడు నీచమైనవాడిగా ఎందుకు బతుకుతున్నాడూ? ఎక్కడో ఏదో కుట్ర జరిగిందని తెలియడం లేదా? వీటన్నిటికీ మతమే కారణమని తెలిసిన తర్వాత కూడా ఇంకా కొనసాగించడం దేనికీ? కనీసం 2050 నాటికి ప్రపంచంలోని సగం జనాభా మానవవాదులుగా మారే అవకాశం ఉంది. అందువల్ల ఇక రానున్నది మానవవాద ప్రపంచమే!
రచయిత, మానవతావాది సారత్ హసన్ మంటో కథ 'సాహే' ప్రారంభ వాక్యాలు ఇలా ఉంటాయి. ''ఒక లక్షమంది హిందువులూ, మరో లక్షమంది ముస్లింలు చనిపోయారని అనొద్దు. రెండు లక్షల మంది మానవులు చనిపోయారని గుర్తించు. చంపినవారు, చంపబడ్డవారూ సాధించిందేమీలేదు. వీళ్ళను వాళ్ళూ, వాళ్ళను వీళ్ళూ చంపుకున్నందువల్ల మతాలు తుడిచిపెట్టుకుపోవు. తుపాకులతో, కత్తులతో మతాలు హతమవుతాయనినమ్మేది తెలివితక్కువ దద్దమ్మలే. మహజబ్, ఈమాన్, ధర్మం, విశ్వాసం ఇవన్నీ అంతరంగాల్లో ఉంటాయి. శరీరాల్లో కాదు. వాటిని కసాయివాళ్ళు, హంతకులు, కత్తులు, తల్వార్లు, తుపాకి గుళ్ళతో నిర్మూలించగలరా?'' అందుకే మన తెలుగు మహాకవి డాక్టర్ దాశరథి అంటారు.. ''రేపు మాత్రం జనం చూచే చూపులో అజ్ఞానముండదు.. ధాస్యముండదు.. దైవముండదు.. లొంగిపోని రోగముండదు.. రేపు వేరే రేపు వేరే!
డాక్టర్ దేవరాజు మహారాజు
- వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త,
బయాలజీ ప్రొఫెసర్.