Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కట్టెలు-శవాలు ప్రవాహానికి కొట్టుకు పోతాయి
ప్రాణం వున్న మనుషులం అవసరమైతే ఎదురీదాలి'
- ఇది తరతరాల నానుడి. ఒక అనుభవం.
కానీ దేశంలో కరోనా వ్యాధి నానాటికి ముమ్మరంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కొందరు పరిస్థితులు గాలికి వదిలేసి ప్రాప్తకాలజ్ఞతకు బందీలవుతున్నారు. సాధారణ ప్రజానీకమే కాకుండా పాలకులు కూడా ఇదే వైఖరి అవలంభించడం వైచిత్రి.
పెట్టుబడిదారితనం అనేది ఓ వ్యవస్థే కాదు. ఒక దృక్పథం కూడా. లాభాల యావే తప్ప ఏదీ పట్టని పాలకులకు ఇప్పుడు ప్రయివేటీకరణ తప్ప మరేదీ కన్పించడం లేదు.
ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మనిషి ఎప్పుడూ చేతులు ముడుచుకుని కూర్చోడు. ఇప్పుడు కరోనా వ్యాధిని నివారించడంలోను, ఎదుర్కోవడంలోను రకరకాల అనుభవాలను గుణపాఠాలను ఎప్పటికప్పుడు మీడియా ప్రజల ముందుంచుతున్నది. అంతర్జాతీయంగా క్యూబా, దేశీయంగా కేరళ అనుభవాలు నిలువెత్తున నిలుస్తున్నాయి.
అయినా స్వీకరించి అమలు పరచడానికి కొందరికి అహం అడ్డం వస్తున్నది. కొందరికి అజ్ఞానం వెర్రితలలు వేస్తున్నది. అసలు ''మనిషి పుట్టుక పుట్టి మానవీయ దృక్పథాన్ని విడనాడటమే పెట్టుబడిదారి లక్షణం'' అని మార్క్స్ ఎనాడో చెప్పాడు.
సర్వం సరుకుమయంలో మనిషి కూడా పెట్టుబడిదారులకు ఓ వస్తువైపోయాడు. అందుకే మనిషి పరాయికరణ తత్వాన్ని పెట్టుబడిదారి పాలకులు పెంచి పోషిస్తున్నారు. తొలుత ప్రకృతి నుంచి మనిషిని వేరు చేశారు. (పరాయికరణ)
ప్రకృతిలో మనం అంతర్భాగమనే మౌలిక సత్యాన్ని దూరం చేశారు. చివరకు ప్రకృతి విధ్వంసమైతే తప్ప అభివృద్ధి జరగదు అనే దుర్మార్గానికి పట్టంకట్టారు.
కరోనా వంటి వైరస్ల వ్యాప్తికి ప్రకృతి విధ్వంసమే కారణమని శాస్త్రజ్ఞులు మొత్తుకుంటున్న విషయం కూడా ఈ పాలకులకు పట్టడం లేదు.
తరువాత మానవ సమూహం నుంచి మనిషిని పరాయికరణ చేశారు. నేల, గాలి లేకుండా ఎలా జీవించలేమో, మానవ సమాజం లేకుండా నేను జీవించలేను అనే ప్రాథమిక సత్యం కూడా మనిషి మరిచేలా చేశారు. అందుకే ఎవరి లాభం వారిదే, ఎవరి స్వార్థం వారిదే అనే పాతాళంలోకి జారిపోయాడు మనిషి.
మూడవది మానవ శ్రమ నుంచి మనిషి ఎలా పరాయికరణకు గురయ్యాడో చెప్పేందుకు మార్క్స్ 'పెట్టుబడి' అని పెద్ద గ్రంథమే రాశాడు. సకల సంపదను సృష్టించే శ్రమజీవులు నేడు కనీస అవసరాలు తీరని అన్నార్తులుగా బాధితులుగా, వలస కార్మికులుగా దిక్కులేని పక్షులుగా తయారైన వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం.
ఇక చివరిగా మనిషి తన నుంచి తాను దూరమైపోయి, ఎందుకు బతకాలో, ఎలా బతకాలో తెలియక గందరగోళంలో చిక్కుకు పోయాడు. చివరకు ఇప్పుడు భయం గుప్పెట్లో చిక్కుకుపోయాడు. ప్రాప్త కాలజ్ఞతను పెంచి పోషించే కర్మసిద్ధాంతాలకు (రాతను ఎవ్వరం మార్చలేం. ఏది జరిగితే అదే జరుగుతుంది) ముందుగానే అలవాటు పడ్డాడు కదా!
ఇది మనిషిని శవంగా మార్చే ప్రక్రియ తప్ప మరేమీ కాదు. శ్రమకు, ప్రయత్నానికి ప్రతీకగా నిలిచే మానవ స్వభావానికీ విరుద్ధం ఇది.
కరోనా ఓ అంటువ్యాధే తప్ప ప్రాణాంతక వ్యాధి కాదని వైద్యులు, శాస్త్రజ్ఞులు చెపుతున్నారు.
ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధకశక్తిని) పెంచుకోవడం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం, బయటకు వచ్చినప్పుడు మాస్క్ (ముక్కు, నోరను మూసుకునేలా) ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్తో శుభ్రపరచుకోవడం పరిష్కారాలుగా చెపుతున్నారు.
అంటువ్యాధి గనుక, తమ నుంచి ఇతరులకు ఏదీ సోకకుండా, ఇతరుల నుంచి తమకు ఏదీ అంటకుండా ఇవి రక్షణ కవచాల్లా ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. పాటిస్తున్నారు.
అయినా ఇంకా కొందరు చదువుకున్న వారు, అధికారంలో ఉన్నవారు సైతం ఈ చర్యలు పాటించటం లేదంటే ఏమనుకోవాలి. లాభాల వేట నిర్లక్ష్యంతో పాటు ప్రాప్తకాలజ్ఞతకాక మరేమిటి?
ఇక అసలు విషయానికి వద్దాం...
మహారాష్ట్ర బొంబాయి నగరంలో ధారవి మురికివాడ. ఆసియాలో కెల్లా అతిపెద్దది. మురికివాడంటే తెలిసిందే కదా..! జనసమ్మర్దం ఎక్కువ. కనీస అవసరాలు తీరని పేదలు ఉంటారు. ఇరుకు గదులు, గాలి వెలుతురు ఉండదు. నీటి సౌకర్యం అంతంత మాత్రమే. పారిశుధ్యలోపం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. కరోనా నేపథ్యంలో ధారవి బీదలు పిట్టల్లా రాలిపోతారని చాలామంది తొలుత భయపడ్డారు. కానీ ఇప్పుడు కరోనాను ఎదుర్కోనడంలో ధారవి పాఠాలు నేర్పుతున్నది.
యుద్ధంలో... శత్రువుకు ఎదురు వెళ్ళడం కూడా ఓ వ్యూహమే.
కరోనాను ఎదుర్కోనే పద్ధతుల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 1. ట్రేసింగ్ (అన్వేషణ) కరోనా బాధితులు (రోగులు)ను వెతకాలి. పసిగట్టాలి. 2. టెస్టింగ్ (పరీక్షలు) - నిజంగా వీరికి కరోనా వ్యాధి ఉన్నదా లేదా అని పరీక్ష చేసి నిర్ధారించాలి. 3. ట్రీట్మెంట్ (చికిత్స) వారికి నయం అయ్యేవిధంగా చికిత్స నందించాలి. ఆస్పత్రిలోనా, హౌం క్వారంటైన్ లోనా అని నిర్ధారించి తగు చికిత్స చేయాలి.
కరోనా వ్యాధి ముదిరి వ్యాప్తిలోకి రాకముందే వారు ఈ ఆయుధాలతో సన్నద్ధమయ్యారు. అవసరమైతే దాన్ని వెంటపడి తరమాలనే కృతనిశ్చయానికి వచ్చారు. అందుకు చిన్నా, చితకా వైద్యులను, పారా మెడికల్ టీమ్లను సమాయత్తం చేశారు.
ఎక్కడికక్కడ ఫీవర్ క్యాంప్లు నెలకొల్పి, జ్వరంగా ఉండి అనుమానం ఉన్న ప్రతి ఒక్కర్ని తమంత తాముగా వచ్చి పరీక్ష చేయించుకునేలా ప్రోత్సహించారు. అలా షాధికానాలు, పాఠశాలలు, కళాశాలలు, కమ్యూనిటీ సెంటర్లు ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్న ప్రతిదానిని క్వారెంటైన్ సెంటర్గా మార్చారు.
ఎప్పటికప్పుడు విటమిన్లు, పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా తగు శిక్షకుల్ని పెట్టి వ్యాయామం, యోగా నేర్పారు. కొన్ని చోట్ల సంగీత సాధనకూడా జరిగింది. అయితే దండలో దారంలా వీటి అన్నింటిలో మానవీయ ఐచ్ఛిక సేవాశక్తి సహకారం తారట్లాడిందనే విషయం మనం గుర్తెరగాలి. ఇదే ప్రేరణ మనిషికి. మనోవోత్తేజం. ఆచరణ వల్ల ఇది సాధ్యమవుతుంది తప్ప కేవలం శుష్క ఉపన్యాసాల వల్ల కాదనేది అర్థమవుతుంది.
పది లక్షలకుపైగా జనాభా కలిగిన ధారవి వందరోజుల పోరాటం ఇది. అందువల్ల జూన్ నెలలో సగటున రోజుకు 16 కేసులు చొప్పున 489 మాత్రమే నమోదయ్యాయి. స్థానికంగా ఉండే వైద్యులను, సేవకుల్ని ప్రజల్ని అందరిని విశ్వాసంలోకి తీసుకోవడం, పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇచ్చి రోజుకు లెక్కలేనన్ని సార్లు పబ్లిక్ టాయిలెట్లను, క్వారంటైన్ పరిసరాలను శ్రుభం పరచడం, చేయడం వలన ఈ ఫలితాలను సాధించగలిగామని నిర్వాహకులు తెలిపారు.
కరోనా వ్యతిరేక పోరులో ధారవి ముందున్నదని ఇప్పుడు అందరి అభినందనలు అందుకుంటున్నది. మానవశక్తి అజేయమని మరోసారి తేటతెల్లం అయింది.
కె. శాంతారావు
సెల్: 9959745723