Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికట్టడానికి అందరూ కృషి చేయాలి
- రాష్ట్రీరు గరీమా అభియాన్ నేషనల్ కోఆర్డీనేటర్ నవీన్కుమార్
నవతెలంగాణ-పరిగి
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి, మహిళలు మౌనం వీడి ధైర్యంగా ముందుకు రావాలని రాష్ట్రీరు గరీమా అభియాన్ నేషనల్ కో ఆర్డినేటర్ నవీన్ కుమార్ అన్నారు. లైంగికదాడి బాధితులు, రాష్ట్రీరు గరీమా అభియాన్ వారి సౌజన్యంతో పరిగి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం పరిగిలోని ఏబీఎస్ ప్లాజాలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. డిగ్నిటీ మార్చి పేరుతో 5వేల మంది డిసెంబర్ 22న ముంబైలో బయలుదేరారు. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను తాకుతూ 10వేల కిలోమీటర్లు దాటుకుంటూ ఫిబ్రవరి 22న ఢిల్లీకి చేరుకోబోతున్నది.
ఇందులో భాగంగా నేడు డిగ్నిటీ మార్చ్ పరిగి చేరుకుంది. ఈ బందం స్థానిక కళాశాలల విద్యార్థులు కొడంగల్ చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా ఏబీఎస్ ప్లాజా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రధాన కూడళ్లలో కళాకారులు పాటలు పాడుతూ లైంగిక దాడులు ఎలా అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ర్యాలీని పరిగి మండల విద్యావనరుల అధికారి హరిశ్చందర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏబీఎస్ ప్లాజాలో జరిగిన అవగాహనా సమావేశంలో విద్యావంతులు, మేధావులు, పోలీసులు, మహిళా సంఘాల నాయకురాళ్లు నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నేషనల్ కో ఆర్డినేటర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ... అత్యాచార బాధితులు సిగ్గుతో, అవమాన పడుతారని అన్నారు. జరిగిన అన్యాయాన్ని చెప్పకుండా బాధను భరిస్తూ తమలోనే దాచుకున్నారని అన్నారు. ఇలాంటి దాడులు ఇకపై జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో డిగ్నిటీ మార్చ్ కార్యక్రమం పేరుతో దేశవ్యాప్తంగా తిరిగి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. లైంగిక దాడికి గురైన బాధితులకు మీడియా, న్యాయవ్యవస్థ, సమాజం అందరూ బాసటగా నిలవాలన్నారు. లైంగికదాడులు జరగకుండా ఉండాలంటే మనం చూసే విధానంలో మార్పు రావాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మన పిల్లల పట్ల జాగ్రత్త వహించడమే కాకుండా అన్ని విషయాల్లోనూ అండగా నిలవాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు, విద్యావంతులు, మహిళలు మాట్లాడుతూ
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారతదేశ మహిళలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కానీ నేడు మహిళలు సమాజంలో తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సగటున మహిళలపై నిమిషానికి 22 దాడులు, రాష్ట్రంలో ఐదు నిమిషాలకు ఒక దాడి జరుగుతుందన్నారు. 90 శాతం సంఘటనలు తెలిసిన వారితోనే జరుగుతున్నాయన్నారు. ఇందులో 80% పిల్లలపై జరగగా 20 శాతం మహిళలపై జరుగుతున్నాయని అన్నారు. స్త్రీలపై వివక్షత సొంత ఇంటి నుండే ప్రారంభం అవుతుందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు స్త్రీ, పురుష భేదాలను చూపుతున్నారని అన్నారు. అమ్మాయిలను తక్కువ చేసి చూడడం, అబ్బాయిలను ఎక్కువ చేసి చూడడం వల్ల అమ్మాయిలను అణగదొక్కె ప్రయత్నం ఇంటి నుంచే ప్రారంభం అవుతుందన్నారు. అంతేకాకుండా ఉద్యోగాలకు, విద్యాలయాలకు వెళ్లేటప్పుడు ఆకతాయిలు మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మరికొందరు మాయమాటలు చెప్పి ఉద్యోగం పేరుతో నమ్మక ద్రోహం చేస్తున్నారని వివరించారు. మహిళల అక్రమ రవాణా భారీగా పెరిగి పోయిందన్నారు. దీనిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. మహిళలపై నిత్యం లైంగికదాడులు దాడులు జరుగుతున్నా, అందులో వందకు ఐదు శాతం మంది ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులు తగ్గాలన్నా మన ఆలోచన విధానంలో, సమాజంలో, ప్రజలలో మార్పు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్నిటీ మార్చ్ కన్వీనర్ ఆసీఫ్, ఎంవీఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ రాజు, ఎంఈఓ హరిశ్చందర్, ఎస్సై హఫీజ్, టీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్తయ్య, అడ్వకేట్ నరేందర్ యాదవ్, జేఏసీ నాయకులు నాగేశ్వర్, అంబేద్కర్ విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ చంద్రయ్య, ఎంవీఎఫ్ పరిగి మండల ఇన్చార్జి రాములు, స్వేరోస్ జిల్లా ఇన్చార్జ్జి అనంతయ్య, అనూష, వనజ, మేఘమాల, బషీర్, మంజూల, టి.వెంకటయ్య, జమున, బాలమణి, వాణి, భ్రమరాంబ, రుక్మిణి, కవిత, సుమిత్ర పాల్గొన్నారు.