Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి రూరల్
పేదలకు దక్కవలసిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులకు భోజ్యంగా మారి, కొందరు వ్యాపారులు యదేచ్ఛగా అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారు. బయట ఫీడ్స్ పేరుతో బోర్డు, లోపట అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్నారు.
మండల పరిధిలోని రూప్ఖాన్పేట్ గ్రామ శివారులోని నాగార్జున ఫీట్స్ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన పౌరసరఫరాల బియ్యం నిన్న (బుధవారం) అర్థరాత్రి విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం గుట్టు రట్టు చేశారు. విజిలెన్స్ ఎస్పీ ముత్యం రెడ్డి ఆదేశాల మేరకు విశ్వాసనీయ సమాచారంతో విజిలెన్స్ హైదరాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ చంద్రమౌలి, డీసీఎస్ ఓ రాజేశ్వర్, కలెక్టరేట్ ఇన్ ఫోర్స్మెంట్ డీటీ షేక్ ఫయాజ్ అహ్మద్ సిబ్బంది గోడౌన్పై దాడులు నిర్వహించి నిల్వ చేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై గోదాములకు డీసీఎంలా ద్వారా తరలించారు. నిల్వ ఉంచిన బియ్యం రేషన్ షాపుల ద్వారా అందజేసే బియ్యం అని అధికారులు తేల్చారు. ఎక్కడి నుండి బియ్యం తీసుకువచ్చారు, ఏంతకాలంగా ఇది కొనసాగుతుంది, ఎవరెవరు దీంట్లో భాగస్వాములు ఉన్నారు అనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సందర్భంగా విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ నోముల మురళి, డీసీఎస్ ఓడి రాజేశ్వర్ మాట్లాడుతూ నాగార్జున ఫీట్స్ పేరుతో దాన తయారుచేసి కోళ్ల ఫారాలకు సప్లై ఇక్కడ నుండి జరుగుతుందని, నూకల పేరుతో రేషన్ బియ్యాన్ని పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేశారని అన్నారు. ఫీడ్ తయారుచేయడానికి బియ్యం అవసరం లేదని తెలియజేశారు. ఇప్పటివరకు వంద టన్నుల పైచిలుకు బియ్యాన్ని పౌరసరఫరాల గోదాములకు
తరలించామని అన్నారు. ప్రాథమిక ఆధారాల మేరకు పోలేపల్లి నారాయణ కోస్గి, పరిగికి చెందిన వేముల కిరణ్, గోడౌన్ యజమాని రాజేందర్ రెడ్డి పై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గోడౌన్ను కూడా సీజ్ చేస్తామని తెలిపారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
బియ్యం అక్రమ నిల్వలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ గోడౌన్ లో నిల్వచేసిన బియ్యం ఇంత భారీగా నిలువ చేశారంటే పీడీఎస్ బియ్యం మాఫియా కార్యకలాపాలు యదేచ్ఛగా కొనసాగుతుందని అర్థమవుతుంది. గతంలో కూడా ఇలాంటి తతంగమే జరిగిందని, గోడౌన్ను సీజ్ చేసిన రెండు మూడు రోజులకే తెరిచారని, ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుందో చూడాలి. అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
రూప్ఖాన్ పెట్ సర్పంచ్, నర్సింలు
దళారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి
గోదామును సందర్శించిన ఆయన అక్రమ నిల్వల పాల్పడిన దళారులపై పీడీ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలి. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. నేరం చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, దొరికిన బియ్యాన్ని నియోజకవర్గంలోని పేదలకు పంచాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
సీపీఐ(ఎం) వెంకటయ్య