Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, అడ్డుకున్న పోలీసులు
నవతెలంగాణ-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి, ప్రజలపై మోయలేని భారం వేస్తే పతనం తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో బుధవారం హిమాయత్నగర్ వై జంక్షన్ వద్ద పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా మంటలు చెలరేగి ఇద్దరు ఆటో డ్రైవర్లు నరసింహా, జమీల్ లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈసందర్భంగా ఏఐటీయూసీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. కొందరు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం వీఎస్ బోస్, వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు బి.వెంకటేశం మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇంధనాల ధరలు రోజు రోజుకూ పెంచి ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఇంధన ధరలను తగ్గించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయని, అందుకే సంస్కరణల పేరుతో దేశ ప్రజలపై మరిన్ని భారాలు వేస్తున్నాయని మండిపడ్డారు. రోజు రోజుకూ పెంచుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే నియంత్రించి, పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని లేకుంటే పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఏ.భిక్షపతి యాదవ్, ప్రధాన కార్యదర్శి ఆర్.మల్లేష్, జిల్లా నేతలు జంగయ్య, లతీఫ్, ఒమర్ ఖాన్, ఫరూక్ పాల్గొన్నారు.