Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరికొందరు కార్మికశాఖ అధికారుల పైనా గురి
నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి :
ఈఎస్ఐ-ఐఎంఎస్ కోట్లాది రూపాయల మందుల కొనుగోళ్ల కుంభకోణంలో రాష్ట్ర మాజీ మంత్రి నాయిని అల్లుడు శ్రీనివాస్రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరింత ఉచ్చును బిగిస్తున్నారు. దీనితో పాటు నాయిని కార్యదర్శిగా పనిచేసిన ముకుంద రెడ్డి, మందుల కంపెనీ డిస్ట్రిబ్యూటర్ శ్రీహరిబాబు, ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిల ఆస్థులపైన మరింత నిశితంగా దృష్టిని సారించారు. ఐఎంఎస్ మందుల స్కాం వెలుగుచూసినప్పటి నుంచి దీని వెనుక రాజకీయ హస్తం ఉందా? లేదా ? అనే సందేహాలు మొదట్లో ప్రారంభమై తర్వాత బలపడుతూ వచ్చాయి. అయితే, ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ఏసీబీ అధికారులు దీని వెనుక మూలవిరాట్గా ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు వారి శాఖకే చెందిన పలువురు అధికారులు, సిబ్బందిని నిందితులుగా తేల్చారు. అలాగే, మరికొందరు దళారులు, డిస్ట్రిబ్యూటర్లు, మందుల కంపెనీల యజమానులను కూడా నిందితుల జాబితాలో చేర్చడంతో వారి సంఖ్య 63 వరకు చేరుకున్నది.
అయితే, పొరుగురాష్ట్రం ఏపీలో ఈ స్కాంను వెలుగులోకి తెచ్చిన ఏసీబీ అధికారులు అప్పటి టీడీపీ కార్మికశాఖ మంత్రి అచ్చెంనాయుడును కూడా ప్రధాన దోషిగా పేర్కొంటూ అరెస్టు చేయడం ఆ సమయంలో కలకలం రేపింది. అయితే, మన రాష్ట్రంలో తేలిన స్కాంలో కూడా ఈఎస్ఐ-ఐఎంఎస్ విభాగాలను పర్యవేక్షించే కొందరు అధికారులతో పాటు రాజకీయ ప్రముఖుల అండలేనిదే డాక్టర్ దేవికారాణి వందల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము స్వాహాకు కుట్ర చేసే సాహసానికి ఒడిగట్టేవారా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షం నుంచి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ ఆధారాలుంటే ఆ దిశగా దర్యాప్తు జరుపుతామని చెప్పింది. అయితే, వెలుపలికి మాత్రం దానికి సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ ఈ కుంభకోణంలో తేలిన అధికారులు కొందరు విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టారనీ, దానిపై దర్యాప్తు జరపాలంటూ ఈడీకి లేఖ రాయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టయ్యింది. కాగా, దీంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు దేవికారాణి, ఇతర అధికారులకు సంబంధించిన విదేశీ వ్యవహారాల పెట్టుబడుల వ్యవహారాలతో పాటు దానికి అనుసంధానంగా లభించిన కొన్ని ఆధారాలతో శ్రీనివాస్రెడ్డి, ముకుంద్రెడ్డిలకు కూడా ఇందులో పాత్ర ఉందంటూ ఆధారాలు సేకరించడంతో రాజకీయ నాయకుల గుట్టు బయటపడినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్రెడ్డి, ముకుంద్రెడ్డిల ఆస్థుల పైజరిగిన దాడుల్లో కోట్లాది రూపాలయ నగదు, నగలు పట్టుబడటంతో వారిపై ఉచ్చు మరింతగా బిగుసుకుంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును నిశితంగా కొనసాగిస్తున్న ఈడీ అధికారులు శ్రీనివాస్రెడ్డి, ముకుంద్ రెడ్డిలను విచారించడానికి పదిరోజుల్లోగా తమ ముందు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులివ్వడం ద్వారా ఈ కేసు మరింత సీరియస్గా మారింది. వీరి తదుపరి విచారణలో ఇంకేమీ నిజాలు వెలుగుచూస్తాయో? ఇంకెందరు రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయోనన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈడీ దాడులు జరిగినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శ్రీనివాస్రెడ్డి ఈడీ అధికారుల ఎదుట హాజరవుతారా? లేక కోర్టును ఆశ్రయిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస్రెడ్డి, ముకుంద్రెడ్డి, తదితరులను ప్రశ్నించడానికి ఈడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది.