Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్లాది రూపాయలు గడిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి
- పట్టించుకోని మైనింగ్ అధికారులు
- చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
నవతెలంగాణ-బడంగ్పేట
మట్టిని తవ్వి ఎక్కడికైనా తరలించాలంటే.. మైనింగ్ ఆఫీసర్లు, పర్యావరణ శాఖ అనుమతి ఉండాలి. కానీ కొందరు వ్యాపారాలు అలాంటిదేమీ పట్టించుకోకుండా అక్రమంగా మట్టిని తవ్వేస్తూ కోట్లు సొమ్ముచేసుకుంటున్నారు. పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాలాపూర్ మండలం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్ గ్రామ పరిధిలో ఇలాంటి అక్రమ మట్టివ్యాపారమే కొనసాగుతోంది. ఇక్కడి సర్వే నెంబర్ 609, 119లలో విజయవాడకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ మట్టిని తవ్వుతూ సొమ్ముచేసుకుంటున్నాడు. మైనింగ్, పర్యావరణశాఖ, స్థానిక మున్సిపల్ నుంచి ఎలాంటి పర్మిషన్లేకుండానే మట్టిని తవ్వి తరలిస్తున్నాడు. నిత్యం జేసీబీలతో తవ్వకాలు చేపడుతూ.. మట్టిని తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఒకసారి స్థానికుల ఫిర్యాదుతో ప్రభుత్వ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు ఇక్కడి నేలను తమ ఆదీనంలోకి తీసుకుని, అక్కడ తవ్వకాలు జరుపరాదని, ఎవరూ ప్రవేశించరాదని బోర్డు పెట్టారు. ఆ తర్వాత షరామామూలే అయింది. ప్రస్తుతం మట్టివ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మట్టి తరలించేందుకు అనుమతి లేదు- శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్
మట్టి తరలించడానికి ఎలాంటి అనుమతి లేదు. ఒకవేళ మట్టి అవసరమైతే మైనింగ్ అధికారుల పర్మిషన్ తప్పక తీసుకోవాలి. అక్రమంగా మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం- నిమ్మల సునీతా శ్రీకాంత్గౌడ్, బడంగ్పేట్, 9వ డివిజన్ కార్పొరేటర్
ప్రభుత్వం, మైనింగ్ అధికారు అనుమతి లేకుండా ప్రతిరోజూ వందలాది లారీలతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్టున్న విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం.