Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీబీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్
నవతెలంగాణ-నారాయణగూడ
భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుల జాబితాలో ముందుండే గొప్పనేత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని తెలంగాణ దళిత బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(టీడీబీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు వలిగొండ శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బుధవారం లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశ ప్రజల ఉమ్మడి సంపద అని, ఆయన ఆలోచనలు, ఆశయాలను నేటి తరానికి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని సూచించారు. స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు గడుస్తున్న దళితుల జీవితలలో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపులేనట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో డీబీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్, హైదరాబాద్ అధ్యక్షుడు శివకరణ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎడవెళ్లి నరసింహ, ఎం.శివ కుమార్, ఎం.వేణు, నాగరాజు పాల్గొన్నారు.