Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
మాజీ సర్పంచ్ పేరుతో అనుమతులు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పెద్ద అంబర్ పేట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ విజరు శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పెద్ద అంబర్ పేటమున్సిపల్, కుంట్లుర్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీకి జాతీయ రహదారిపై ఇరువైపులా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న కమిషనర్ పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని, అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. కుంట్లూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి కౌన్సిల్ తీర్మానం లేకుండానే గత ఆరు నెలల క్రితం పనులు చేపట్టారని, ఇక్కడ అడ్డంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోలేదని వాపోయారు. కల్వర్టును కబ్జా చేసిన వారికి ఉపయోగపడే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులు భారీగా భవనాలను నిర్మించి, తప్పుడు అసెస్మెంట్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, సర్వే నెం. 24లో మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికీ కమిషనర్ అక్రమార్కులతో కుమ్మక్కై తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు తమపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి వారు తమ పద్దతిని మార్చుకోవాలని హితవు పలికారు. అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఓరుగంటి సుజాత కిషన్ గౌడ్, జోర్క గీత శ్రీరాములు, పబ్బతి లక్ష్మణ్,కో అప్షన్ సభ్యులు అజ్మీర్ బేగం,నాయకులు ఓరుగంటి కొండల్, చామ అను కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.