Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహిదీపట్నం
గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న 12వేల ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ను ముట్టడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో ప్రభుత్వం గురుకుల పాఠశాలలో ఎస్జీటీ, పీజీటీ టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తు చేశారు. ఇతర కారణాలతో మిగిలిపోయిన ఆ పోస్టులను మెరిట్ లిస్టు ప్రకారం తర్వాతి స్థానాల్లో ఉండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులతో 1:2 పద్ధతిలో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే వారి వయోపరిమితి దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. అలాగే గురుకుల పాఠశాలలో మిగిలిపోయిన 12వేల అధ్యాపకుల స్థానాలను వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఈమేరకు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల అడిషనల్ సెక్రటరీ ఉమాదేవికి, బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల సెక్రటరీ మల్లయ్య బట్టుకు, మైనారిటీల గురుకుల పాఠశాల సెక్రటరీ షఫీయుల్లాకు వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు చంటి ముదిరాజ్, అంజి, అనంతయ్య, చరణ్, శ్రీలత, జిల్లాల నుంచి వచ్చిన వందలాది నిరుద్యోగ అభ్యర్థులు, 2017 నోటిఫికేషన్ మెరిట్ అభ్యర్థులు పాల్గొన్నారు.