Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్లో పనిచేస్తున్న కుకింగ్, స్టాఫ్ వర్కర్లకు 14 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల స్టాఫ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఫెడరేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జై వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం అబిడ్స్లోని బీమాభవన్ వద్ద ఐఎఫ్ఎస్ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్లో విద్యార్థులకు పోషకాహారాన్ని వండిపెడుతూ, బాధ్యతలు నిర్వహిస్తున్న స్టాఫ్వర్కర్స్కు 14 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల వల్ల నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ టైగర్ జిల్లాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుకింగ్ స్టాఫ్ సిబ్బందిగా గుర్తించాలని, 30 శాతం పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా కల్పించాలన్నారు. లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి భాస్కర్, పద్మశ్రీ, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.