Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/ముషీరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్కుమార్ గుండెపోటుతో మంగళవారం హైదర్గూడలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజ్కుమార్ 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగుడ నుంచి కార్పొరేటర్గా గెలిచారు. 2012 నుంచి 2014 వరకు మూడేండ్లపాటు జీహెచ్ఎంసీ రెండో డిప్యూటీమేయర్గా పనిచేశారు. ఆయనకు సౌమ్యునిగా పేరుంది. రాజ్కుమార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్యాదవ్, ఎంపీ ఉత్తంకుమార్రెడ్డి, ప్రగాడసానుభూతి తెలిపారు. హైదరాబాద్లో ఒక మంచి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని, క్రమశిక్షణగా, పార్టీ కోసం పని చేసిన రాజ్కుమార్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండె పోటుతో ఆకస్మిక మృతి పట్ల టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దశాబ్దాలుగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన రాజ్కుమార్ మరణం పార్టీకి తీరని లోటని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నందున అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఒక మంచి సన్నిహితుణ్ణి కోల్పోయానని, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కూడా రాజ్కుమార్ క్రియాశీలకంగా పని చేశానని కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి తెలిపారు. రాజ్కుమార్ సేవలు మరువలేనివని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
గోల్కొండ రాజ్ కుమార్ మృతి పట్ల సీపీఐ(ఎం) సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రేటర్ హైదరాబాద్కి డిప్యూటీ మేయర్గా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోల్కొండ రాజ్ కుమార్ మృతి పట్ల సీపీఐ(ఎం) ముషీరాబాద్ జోన్ కమిటీ సంతాపాన్ని ప్రకటించింది. జోన్ కార్యదర్శి, నగర కార్యదర్శి వర్గసభ్యులు మద్దెల దశరథ్ మాట్లాడుతూ గుండెపోటుతో ఆయన మరణించడం బాధాకరమన్నారు. ఈసందర్భంగా రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.