Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-హయత్నగర్
మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని కామినేని ఫ్లై ఓవర్ కింద ఉన్న స్థలంలో దాదాపు 390 మీటర్ల ప్రాంతంలో నూతనంగా ఆక్సిజన్ పార్క్ నిర్మిస్తున్నట్టు ఎల్బీనగర్ శాసన సభ్యుడు దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. గురువారం అట్టి ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రోజురోజుకు ఓజోన్ పొర పల్చబడుతుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణకు కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలి అని కోరారు. సూర్యుని నుండి అల్ట్రా కిరణాలు మన మానవాళి మీద పడితే మానవాళి జీవితం ప్రశ్నార్థ్ధకం అవుతుంది. కావున మనం సాధ్యమైనంత వరకు పర్యావరణాన్ని రక్షించుకోవాలి. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అత్యున్నత ఆక్సిజన్ పార్క్ను తయారుచేయడం జరుగుతుందని తెలిపారు.ఆ పార్క్ ముఖ్య ఉద్దేశ్యం పూర్తిగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే పార్క్. మన ఇంట్లో కన్నా ఎక్కువ ఆక్సీజన్ ఇక్కడ లభిస్తుంది. మన ప్రపంచ దేశాలు మొత్తం ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే కొన్ని మొక్కలను నాసా వారు కనిపెట్టడం జరిగింది. నాసా, ఢిల్లీ ఐ.ఐ.టీ వారు గుర్తించిన ఆక్సిజన్ ఉత్పత్తి చేసే 26 రకాల మొక్కలను మొత్తం దాదాపు 36,000 మొక్కలు కామినేని హాస్పిటల్ ఫ్లై ఓవర్ కింద నాటడం జరుగుతుంది అని తెలిపారు. అటు సైడు ఇటు సైడు పెద్ద జాలీలు ఏర్పాటు చేసి అట్టి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు అట్టి జాలీల మీద పాకే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనివల్ల అట్టి పార్క్ పచ్చదనంతో ఒక కొత్తదనాన్ని సంతరించు కుంటుంది. లోపల మొత్తం నాసా గుర్తించిన ఆక్సిజన్ మొక్కలు నాటడం వల్ల అట్టి మొక్కలు బయట ఉన్న కార్బన్ను పీల్చుకొని ఆక్సిజన్ను ఇవ్వడం జరుగు తుందన్నారు. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఎల్.బి. నగర్ నందు మొదలు పెట్టడం జరుగుతుంది అని తెలిపారు.
దానిలో భాగంగా మొట్టమొదటిగా ఎల్.బి.నగర్ ఫ్లైఓవర్ కింద ప్రారంభించడం జరుగుతుంది అని తెలిపారు. ఆస్తమా, దగ్గు ఉన్న వారు ఇట్టి పార్కులో వాకింగ్ చేయడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది అని తెలిపారు. వచ్చే డిసెంబర్ వరకు ఇట్టి ఆక్సిజన్ పార్క్ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. గత కరోన నేపథ్యంలో పనులు కొంతమేర ఆలస్యం జరిగింది అని తెలిపారు. ప్రస్తుతానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో ఆనంతుల రాజిరెడ్డి సైట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.