Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కాప్రా పరిధిలోని సర్వే నెంబర్ 151, 152లో గల కస్టోడియన్ భూములను కాపాడడానికి కాప్రా తహసీల్దార్ కె.గౌతమ్ కుమార్, రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ఆరు జేసీబీల సాయంతో కబ్జాకి గురైన కస్టోడియన్ భూమిని కబ్జాదారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ని తొలగించి, ప్రభుత్వ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారి కోర్టుని తప్పుదోవ పట్టించిన, సదరు కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని పరిరక్షించడం కోసం, భారీ పోలీసు, స్పెషల్ ఫోర్స్ బలగాలతో ఉదయం నుంచే కాప్రా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కె.గౌతమ్ కుమార్ మాట్లాడుతూ కాప్రాలోని కబ్జాలకు గురవుతున్న దాదాపు 13 ఎకరాల్లో వందల కోట్ల విలువ చేసే కస్టోడియన్ ప్రభుత్వ భూమిని, కబ్జాదారుల చెర నుంచి పరిరక్షించి ప్రభుత్వ సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇకపై ప్రభుత్వ భూములపై కన్నేసి కబ్జాలకి పాల్పడుతున్నది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాల్లో కబ్జాదారుల మోసపూరితమైన మాటలను నమ్మి, అమాయకమైన ప్రజలు ప్లాట్లు కొని మోసపోవద్దని కోరారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కూల్చివేతలో ఇన్చార్జి ఆర్డీఓ మల్లయ్య, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, డీఐ మధు కుమార్, జవహర్ నగర్ సీఐ పి.భిక్షపతి రావు, ఎస్సైలు మోహన్, సాయిలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శాలిని, రమేష్, వీఆర్వో సత్యనారాయణ, విజరు కుమార్, గంగాధర్, సర్వేయర్ ఇతర రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.