Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండానే అంతా తన ఇష్టారాజ్యంగా వ్యవహరించి మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కల్వర్టును ఓ కాంట్రాక్టర్ కూల్చివేసిన సంఘటన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం నాడు చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ... బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల రా చెరువు నుండి సుద్ధకుంట మీదుగా ఉప్పల్ నల్ల చెరువు లోకి వెళ్ళే నాలా మార్గంలో పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ద్వారకానగర్ నుండి అంజనేయనగర్ మీదుగా వెళ్ళే ప్రధాన మార్గంపై కల్వర్టును ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చెయ్యకుండానే కాంట్రాక్టర్ కూల్చివేశారు. ఈ కల్వర్టు కూల్చివేత కారణంగా ఉప్పల్ నుండి బోడుప్పల్ మార్గంలో వెళ్లే మార్గం పూర్తిగా మూతపడడంతో అటుగా వచ్చిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కనీసం వాహనాలు వెళ్ళేలా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా ఇలా ఏకపక్షంగా కూల్చివేతలు చేపడితే ఎలా అంటు అటుగా వచ్చే పోయే వాహనాలుదారులు విసుక్కున్నారు.
వర్క్ ఆర్డర్ ఉందా?
కూల్చివేసిన కల్వర్టు పనులకు సంబంధించి పునరుద్ధరణ చేసేందుకుగాను ఎలాంటి టెండర్ వర్క్, టెక్నికల్ సాంక్షన్, తీర్మానం, వర్క్ ఆర్డర్ లాంటి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే పనులు చేపడుతున్నారా అంటే అవుననే అనిపిస్తున్నాయి పరిస్థితులు. అంత పెద్ద కల్వర్టును కూల్చివేసే ముందు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సూపర్వైజర్లు అక్కడ లేరు. కేవలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 8వ డివిజన్ కార్పొరేటర్ సీసా వెంకటేష్గౌడ్ ప్రోద్భలంతోనే కాంట్రాక్టర్ ఈ పని చేశాడని తెలుస్తుంది. అసలు ఇప్పుడు అ కల్వర్టు కూల్చివేయాల్సిన అవసరమే లేదని, ప్రస్తుతం నాలా పూడికతీత పనులతో పాటుగా రాఘవేంద్రనగర్ నుండి వచ్చే బ్రిడ్జ్ పనులు, లక్మ్షీ నగర్ నుండి వచ్చిపోయే మార్గంలో ఉన్న బ్రిడ్జ్ పనులు పూర్తి చేస్తే సరిపోతుందని అధికారులు స్థానిక కాలనీవాసులు వాపోతున్నారు. అసలు పని వదిలి వర్క్ ఆర్డర్ లేకుండా కల్వర్టు పనులను ఎలా ప్రారంభించారో కాంట్రాక్టర్ను అడిగితే నాకు కార్పొరేటర్ సీసా వెంకటేష్గౌడ్ చెయ్యమని చెప్పాడు అంటు సమాధానం ఇస్తున్నారు.
మాకు ఎలాంటి సంబంధం లేదు
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ద్వారకనగర్, అంజనేయనగర్ బార్డర్ వద్ద జరిగిన కల్వర్టు కూల్చివేత పనుల విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్ బోనగిరి శ్రీనివాస్లు తెలిపారు. కల్వర్టు కూల్చివేత పనులపై వివరణ అడిగితే వారు పై విధంగా స్పందించారు. అసలు కల్వర్టు కూల్చివేత అనే అంశం మా అజెండాలో లేదని పేర్కొన్నారు. అంటే కమిషనర్, మేయర్, డీఈ లాంటి అధికారుల దష్టికి రాకుండానే ఇలా వర్కులు జరుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.