Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణకు సంబంధించి ప్రణాళికా యుతమైన విధానాలతో ముందుకు వెళ్తున్నామని, దీంతోపాటుగా నగరంలో దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబల కుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని జీహెచ్ఎంసీ హెల్త్ అండ్ శానిటేషన్, ఎంటమాలజీ అడిషనల్ కమిషనర్ సంతోష్ కుమార్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ ఆదేశాల మేరకు అన్ని సర్కిళ్లలో దోమల నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహిస్తున్నామని వివరించారు. మాన్సూన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా గురువారం చందానగర్ సర్కిల్లోని హఫీజ్పేట్ డివిజన్లో చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబుతో కలిసి ఓల్డ్ హఫీజ్పేట్ విలేజ్లో దాదాపుగా 50 ఇండ్లలోని నీటి నిల్వలు పరిశీలించి, ఇంటి సభ్యులకు అవగాహన కల్పించారు. దోమ లార్వా నివారణకు 100పైగా ఇండ్లలో టేమిఫస్, పైరోసీన్ ఆయిల్ రసాయనాలను నిల్వనీటిపై పిచికారి చేయించారు. 50 గృహాల లోపలి భాగంలో పైరిత్రం రసాయనాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా సంతోష్కుమార్ మాట్లాడుతూ.. వారంలో ఒకరోజు నిల్వ ఉన్న నీటి పాత్రలను శుభ్రంగా కడగాలని, లేకపోతే దోమలు వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. నీటిలో తోక పురుగులు కనిపిస్తే వెంటనే ఆ నీటిని పారబోయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెరువులలో పెరిగే గుర్రపుడెక్క దోమలకు వృద్ధికి ఆస్కారముందని, దీంతో త్వరితగతిన తొలగించాలని, ఖాళీ స్థలాలు, కన్స్ట్రక్షన్ సైట్స్లో నీటి నిల్వలు లేకుండా చేయాలని సర్కిల్ అధికారులను ఆదేశించడం జరిగింది. మంచి నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలలో గంబుసియ చేపలను, మురికినీటి నిల్వలు ఉన్న ప్రాంతాలలో ఆయిల్బాల్స్ వదలాలని సూచించారు. దోమల సాంద్రత ఎక్కువగా ఉన్న కాలనీలు, బస్తీలలో స్థానిక వార్డు మెంబర్లు, కాలనీ ప్రతినిధులు, కార్పొరేటర్లతో కలిసి దోమల నివారణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ సీనియర్ ఎంటమాలజిస్ట్ మల్లయ్య, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.