Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల రీఓపెనింగ్పై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. అన్ని తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహించాలని, అంగన్వాడీ సహా అన్ని రకాల ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. కాగా ఈనెల 30వతేదీలోపు ఎట్టిపరిస్థితుల్లో అన్నిరకాల ప్రభుత్వ విద్యాసంస్థల శానిటైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో పరిశుభ్రత బాధ్యతను మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులకు అప్పగించాలని సీఎం ఆదేశించారు.
ఆన్లైన్ క్లాసులను పట్టించుకోని విద్యార్థులు..!
కరోనా కారణంగా 2020-21 విద్యాసంవత్సరం ప్రభుత్వం ఆన్లైన్ తరగతులనే నిర్వహించింది. ఈ ఏడాది జనవరిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆరు నుంచి పైతరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో అంతలోనే బడులు మూసేసింది. ఈ విద్యాసంవత్సరం కూడా ఇప్పటివరకు బడులు తెరుచుకులేదు. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా.. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు అర్థం చేసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు సైతం వారి పనుల్లో బిజీగా ఉండి పట్టించుకోలేకపోతున్నారు. ఫలితంగా విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలపై ప్రభావం పడుతోంది. భవిష్యత్తులో ఇది ప్రమాదకరంగా మారనుందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును పరిశీలించింది. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టీకా వివరాలు సేకరణ
కరోనా పోరులో వ్యాక్సినేషన్ కీలకం కావడంతో రాష్ట్ర విద్యాశాఖ బోధన, బోధనేతర సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టిసారించింది. ఆయా జిల్లాలోని టీచింగ్, నాన్టీచింగ్ ఫస్ట్, సెకండ్ డోసుతో పాటు తీసుకుని వారి వివరాలు ఇవ్వాలని జిల్లా డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఆమేరకు వివరాలు సేకరిస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ పనుల్లో నిమగమయ్యారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 6వేల మంది బోధన, బోధనేతర సిబ్బందికిగాను 4,617 మంది అంటే 70శాతం వరకు కరోనా టీకా మొదటి, రెండవ డోసు తీసుకున్నట్టు వివరాలు సేకరించారు. మరో 30శాతం వరకు వివరాలు రావాల్సి ఉందని, ఒకటి రెండ్రోజుల్లో నివేదికను రాష్ట్ర విద్యాశాఖకు పంపించనున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు.
పాఠశాలల్లో సురక్షిత నియమాలపై శిక్షణ
కోవిడ్-19, బడులు ప్రారంభం నేపథ్యంలో పాఠశాల్లో సురక్షిత నియమాలు, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలపై మండల ఉపవిద్యాధికారులు, ఉపపర్యవేక్షణ అధికారులు, క్లస్టర్ హెడ్మాస్టర్లు, ఎల్ఎఫ్ఎల్, టీచర్లకు, ఈఆర్పీలకు రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో ఇప్పటికే వర్చువల్ విధానంలో శిక్షణను ఇప్పించింది. ఈనెల 30వ తేదీన మండల స్థాయిలో, సెప్టెంబర్ 6న పాఠశాల స్థాయిలో వర్చువల్ మోడ్లో శిక్షణ ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యే క్రమంలో వారికి తరగతి గదులు, మూత్రశాలలు, మరగుదోడ్లు, ఇతర స్థలాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పలు సూచనలు చేస్తారు.