Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
బీసీబంధు ప్రవేశ పెట్టే వరకు అందరూ ఐక్య పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దఊరే బ్రహ్మయ్య పిలుపునిచ్చారు. ఈమేరకు సోమవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో బీసీ ధర్మ పోరాట దీక్ష వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప వారి ఆర్థిక స్థితిగతులపై ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన దళిత బంధును బీసీలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కొన్ని వేల సంవత్సరాలుగా కులవృత్తుల ద్వారా సేవ చేస్తూ సహజ సంపదను సృష్టిస్తున్న బీసీలు యాంత్రీకరణ కార్పొరేటీకరణ ఆధునీకరణ ద్వారా వృత్తులు కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ కులాలు అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను అన్యాయంగా తొలగించారని, వీరిని కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చెరుకు ఉమేష్ గౌడ్, బొడ్డుపల్లి తిలక్, శివ వంజరి, ఐడీంపెళ్లి రమేష్, అంజి లింగరాజు తిరుపతి, గాంధీ నాయక్, పవన్ వినరు కుమార్, కృపాచారి తదితరులు పాల్గొన్నారు.