Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/అంబర్పేట
మురుగునీటి నిర్వహణలో పారిశుధ్య కార్మికులు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జలమండలి ఎండీ దానకిషోర్ అన్నారు. జలమండలి మురుగునీటి నిర్వహణ, కార్మికుల భద్రతపై నిర్వహిస్తున్న భద్రతా పక్షోత్సవాలలో భాగంగా బుధవారం అంబర్పేట ఎస్టీపీ ప్రాంగణంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోను ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయకూడదనే ఈ అవగాహన కార్యక్రమాలను రూపకల్పన చేసినట్టు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, కార్మికుల భద్రత అంతకంటే ముఖ్యమని వివరించారు. పారిశుధ్య పనులలో కార్మికులు తమ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం పారిశుధ్య పనులు చేసేముందు ప్రతీ కార్మికుడు భద్రతా ప్రమాణాలను పాటిస్తామని, రక్షణ పరికరాలను తప్పనిసరిగా ఉపయోగిస్తామని, పారిశుధ్య కార్మికుల కోసం రూపొందించిన ఈ ప్రతిజ్ఞను వారితో చేయించారు. అంతకుముందు ఎస్టీపీ ప్రాంగణంలో మొక్కను నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరాకృష్ణ, స్వామి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. శ్రీధర్బాబు, టెక్నికల్ డైరెక్టర్ పి.రవికుమార్, సీజీఎమ్లు, జీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.