Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట/కంటోన్మెంట్
నిరుపేద ముస్లింల కోసం బన్సీలాల్పేట వక్ఫ్ బోర్డ్ స్థలంలో త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు చేపడతామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బన్సీలాల్పేట జీవైఆర్ కాంపౌండ్లోని వక్ఫ్ బోర్డ్ స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్కు చెందిన స్థలంలో సుమారు 12 కుటుంబాలు ఎన్నో ఏండ్లుగా ఇక్కడే నివసిస్తున్నారని వివరించారు. సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న వారికి అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వక్ఫ్ బోర్డ్ నుంచి అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపడతామని తెలిపారు. ఈ నెల 30న జరిగే వక్ఫ్ బోర్డ్ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని వక్ఫ్ బోర్డ్ చైర్మెన్ సలీం మంత్రికి వివరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు నగర్, జీవైఆర్ కాంపౌండ్, బండ మైసమ్మ నగర్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ వసంత కుమారి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ శ్రీధర్, వాటర్ వర్క్ జీఎం రమణా రెడ్డి, హౌసింగ్ ఈఈ వెంకట దాసు రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మహేందర్, కార్పొరేటర్ హేమలత, తదితరులు పాల్గొన్నారు.
మోండా మార్కెట్ను అభివృద్ధి చేస్తాం
మోండా మార్కెట్ను మొజం జాహీ మార్కెట్ తరహాలో తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో కలిసి గురువారం మోండా మార్కెట్లో విస్తృతంగా పర్యటించారు. వ్యాపారులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించి ఈమార్కెట్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాత ఓల్డ్ జైల్ ఖానా వెనుక భాగంలో ఉన్న స్థలంలో మల్టీ లెవెల్ పార్కింగ్ను నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారుల ఇబ్బందులు, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పాలికా బజార్ చౌరస్తా నుంచి మోండా మార్కెట్లోని కూరగాయల బజార్ వరకు రోడ్డును విస్తరించాలని, పాత గాంధీ హాస్పిటల్ గోదాంను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ సీసీపీ దేవేందర్ను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ దీపిక, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.