Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్లోని గవర్నమెంట్ స్కూళ్లకు మహర్దశ తీసుకొచ్చేందుకు అసెంబ్లీ నియోజవర్గ అభివృద్ధి నిధులు దోహదపడతాయని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం మాసాబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ్యులతో సీడీపీ నిధుల వినియోగంపై సమావేశం న్విహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్, శాసనమండలి విప్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్, సీపీవో డాక్టర్ ఎన్.సురేందర్, డీఈవో ఆర్. రోహిణి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ రవీందర్ పాల్గొన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన శర్మన్ను ఎమ్మెల్యేలకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ పరిచయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విద్యారంగ పురోభివృద్ధికి తీసుకుంటున్న చర్యలలో భాగంగా ప్రతి ఎమ్మెల్యేకి తన నియోజకవర్గ్గ అభివృద్ధి నిధులలో రూ.2 కోట్లను ఆయా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణలో మాత్రమే ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రూ. 2 కోట్లు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. సీడీపీ నిధులతో సర్కారు బడుల్లో అభివృద్ధి చేపట్టనున్న నేపథ్యంలో ప్రస్తుత పాఠశాలల పరిస్థితులపై ఫొటోలతో కూడిన పూర్తిస్థాయి సమాచారం సేకరించి వాటి అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై, ఆయా నియోజకవర్గ శాసనసభ్యుల సహకారంతో సమగ్ర నివేదిక రూపొందించి పది రోజులలో అందజేయాలని డీఈవోను మంత్రి ఆదేశించారు. పాఠశాలలల్లో విద్యార్థులకు ఫర్నీచర్, తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించడంతో పాటు స్కూళ్లలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. సీడీపీ నిధులతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ అభివృద్ధి పనులూ చేపట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులలో రోడ్ కటింగ్ కోసం వసూలు చేసే రుసుము నుండి మినహాయింపు ఇవ్వాలని మంత్రికి విన్నవించారు. ఈ నిధులతో చేపట్టే జలమండలి, జీహెచ్ఎంసీ తదితర శాఖలకు చెందిన పనులకు అయ్యే ఖర్చులో ఆయా శాఖలు సగభాగం నిధులు చెల్లించేలా ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలకు చెప్పారు.