Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
చంచల్గూడ సమీపంలోని పిల్లి గుడిసెలలో నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇండ్లను శనివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, హోంమంత్రి మహమూద్అలీ, రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ఓవైసీ, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మోతె శ్రీలత, స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ బిన్ అబ్దుల్ బలాల, ఎమ్మెల్సీలు అమీన్ఉల్జాఫ్రీ, మిర్జా ఉల్ అఫెంది, సురభి వాణిదేవి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
హైదరాబాద్ నగరాన్ని స్లమ్ లెస్ సిటీగా రూపొందించే భాగంగా గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెలు బస్తీలో రూ.24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇండ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ స్థలంలో గతంలో ఇరుకుగా ఉన్న పూరి గుడిసెలు, రేకుల గదులను తొలగించి ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. ఒకటిన్నర ఎకరాలు ఉన్న ఈ స్థలంలో నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒకొక్క డబుల్ బెడ్ రూంలో 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మౌలిక సదుపాయాల కల్పనతో కలిపి ఒకొక్క డబుల్ బెడ్ రూం ఇంటిని రూ.8.65 లక్షల వ్యయంతో నిర్మించారు. సీసీ రోడ్లు, సీవరేజ్ లైన్లు, తాగునీటి కోసం సంపు నిర్మాణం, ఐదు లిఫ్ట్ల ఏర్పాటు, విద్యుదీకరణలను చేపట్టారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల నిర్వహణకుగాను 19 దుకాణాలు నిర్మించారు. చంచల్గూడ ప్రధాన జంక్షన్లో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మార్కెట్ రేటు ప్రకారం ఒకొక్కటి కనీసం రూ.40లక్షలకుపైగానే ఉంటుంది. ఈ స్థలంలో గతంలో నివాసం ఉన్న నిరుపేదలకు పూర్తిగా ఉచితంగానే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం అందిస్తుంది.