Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణం కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు కేటాయించాలన్న డిమాండ్తో సీపీఐ(ఎం) మరోపోరాటానికి సిద్ధమైంది. అందుకోసం ఆగష్టు 30, 31 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. గంతంలోనూ పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలకోసం ఆ పార్టీ అనేక పోరాటాలు నిర్వహించింది. భూపోరాటాలు చేసింది. పోరాటాల్లో పాల్గొన్న ఆ పార్టీనేతలపై కేసులు పెట్టడంతో జైలుకెళ్లినక సందర్భాలూ ఉన్నాయి. డబుల్బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలకు సర్కార్ సిద్ధం కావడం వెనుక ఈ పోరాట ఫలితం కూడా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. 97 వేల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించిన జీహెచ్ఎంసీ 50 వేల ఇండ్లను పూర్తిచేసినట్లు గృహానిర్మాణ శాఖ అధికారులు వెల్లడించారు.
లక్ష ఇండ్ల నేపథ్యం..
గ్రేటర్ హైదరాబాద్లో రూ.9,714.59 కోట్లతో లక్ష ఇండ్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. 40 ప్రాంతాల్లో ఇన్సిటూ(పాత ఇండ్లను కూల్చేసి కొత్త నిర్మించడం)లో భాగంగా 8,898 ఇండ్లను 71ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో 91,102 ఇండ్లను నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో హైదరాబాద్ జిల్లాలో 9,453, రంగారెడ్డి జిల్లాలో 23,908, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 38,419, సంగారెడ్డి జిల్లాలో 28,220 ఇండ్లు ఉన్నాయి.
50 వేల ఇండ్లు
జీహెచ్ఎంసీ పరిధిలో లక్షా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో ఇప్పటి వరకు 51,346 ఇండ్లు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. మరో 14,975 ఇండ్లు పురోగతిలో ఉన్నాయి. మరో 33,209 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. 470 ఇండ్ల నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభమే కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లతోపాటు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన జేెఎన్ఎన్యూఆర్ఎం, రాజీవ్ గృహకల్ప, వాంబే ఇండ్లు కూడా వేల సంఖ్యలో ఖాళీగా ఉండి శిథిóలమై పోతున్నాయి. పేదలకు కేటాయించకపోవడంతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కావడమేగాక పేదలకు ఆర్థిక భారంగా మారుతోంది. సొంతంగా ఇండ్లు నిర్మించుకుంటే ఐదు లక్షల రూపాయిల సబ్సిడీ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం నేటికీ అమలు చేయడం లేదు.
లబ్ధిదారుల ఎంపికేది?
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి లబ్ధిదారులను ఎంపికకోసం ప్రభుత్వం నిబంధనలు జారీచేసి ఏడాది కావొస్తున్నా ఇంత వరకు అడుగు ముందుక పడలే. ఇండ్లకోసం జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఆధారంగా స్థానిక తహసీల్దార్ సమక్షంలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. కానీ ఇంత వరకు ఎక్కడా లబ్ధిదారులను ఎంపికచేయలేదు. దీంతోపాటు పాత ఇండ్లను కూల్చేసి కొత్త ఇండ్లను నిర్మించిన(ఇన్సిటూ) ప్రాంతాల్లో మాత్రమే ఇండ్లను పేదలకు అందజేస్తున్నారు. వాటిల్లోనూ అధిక ఇండ్లను నిర్మించారు. మిగిలిన ఇండ్లను దళారులు అమ్ముకుంటున్నారనే విమర్శలూ లేకపోలేదు.
30,31 తేదీల్లో రిలే నిరహారదీక్షలు
పూర్తయిన ఇండ్లను పేదలకు ఇవ్వాలని సీపీఐ(ఎం) ఈనెల 30, 31 తేదీల్లో రిలే నిరహార దీక్షలు నిర్వహించనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ తెలిపారు. 51346 ఇండ్ల నిర్మాణం కంప్లీట్ అయి చాలా కాలం గడుస్తున్నా వాటిని కేటాయించకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అద్దె ఇండ్లలో నివసిస్తున్న పేదలు ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకుని ఏడేండ్లుగా ఎదురు చూస్తున్నా సర్కారు స్పందించడం లేదన్నారు. బస్తీల్లో నిర్మించిన కొద్దిపాటి ఇండ్లను అప్పుడప్పుడూ ప్రారంభిస్తూ ఇండ్లు కేటాయిస్తున్నట్టు పేదలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు ఎందుకు టాయించడంలేదో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రిలే దీక్షలో పాల్గొనాలని ఇండ్ల దరఖాస్తుదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.