Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలను పురస్కరిం చుకుని శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉత్సవాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 10న విగ్రహాల ప్రతిష్టతో ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 19న శోభాయాత్రతో నిమజ్జనం కార్యక్ర మం ముగుస్తుందన్నారు. విగ్రహాల ఎత్తు విషయం లో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆంక్షలు లేవని, నిర్వహకులు ఆయా ప్రాంతాలలో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులకు స్పష్టతనిచ్చారు. ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ శోభాయాత్ర నిర్వహించే దారిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు ధ్వంసమైందని, ఉత్సవ నిర్వాహకుల సమా వేశంలో మంత్రి శ్రీనివాస్యాదవ్ దృష్టికి తీసుకు రాగా సోమవారం సందర్శించి మరమ్మతు పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు మంత్రి సూచించారు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ నిమజ్జనానికి గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోలీసు అధికారులు సహకరించాలని, క్రేన్ను ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీి అధ్యక్షులు సుదర్శన్ విజ్ఞప్తి చేశారు. ఉప్పల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన విగ్రహాల నిమజ్జన సమయంలో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ సమస్య పరిష్కా రానికి నిర్వాహకులతోపాటు ఆయా శాఖల అధికారు లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. గణేష్ ప్రతిమల సంఖ్యను బట్టి వాటి నిమజ్జనానికి కావలసిన క్రేన్లను ఏర్పాటు చేస్తామ న్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. ఎక్కువగా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే హుస్సేన్సాగర్, సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్, సఫిల్గూడ, మీరాలంచెరువు తదితర చెరువులలో పూడికను తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ను మంత్రి ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన స్టాటిక్, మొబైల్ క్రేన్లను అవసరమైన మేరకు ఏర్పాటు చేస్తామని, 3 షిఫ్ట్లలో సిబ్బంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధాన మండపాలవద్ద ఎలాంటి డ్రయినేజీ లీకేలు లేకుండా చూడాలన్నారు.
శోభాయాత్ర సందర్భంగా రహదారులు, నిమజ్జనం ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు, అవసరమైన చోట అంబులెన్సులు అందుబాటులో ఉంచాలన్నారు. జీహెచ్ఎంసీలోని జోనల్ కమిషనర్లు, సర్కిల్ అధికారులను ఏర్పాట్ల విషయంలో అప్రమత్తం చేయాలని కమిషనర్ లోకేష్ కుమార్కు సూచిం చారు. ట్రాపిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్శాఖ అధికారుల సమన్వయంతో ఆర్అండ్బీ శాఖ ఆధికారులు అవసరమైన ప్రాంతాలలో బారికేడ్లను, జనరేటర్లు, లైటింగ్ వంటి ఏర్పాట్లు చేయనున్నట్టు మంత్రి శ్రీనివాస్యాదవ్ వివరించారు. నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచా లని ట్రాన్స్కోఅధికారులను మంత్రి ఆదేశించారు. హుస్సేన్ సాగర్, సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్ తదితర ప్రధాన ప్రాంతాలలో బోట్స్, స్విమ్మర్లను అందుబాటులో ఉంచాలని టూరిజం అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ చర్యలలో భాగం గా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 70వేలు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 50 వేలు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 40 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ ప్రభాకర్రావు, డీజీపీ మహేందర్రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాఘవరెడ్డి, బగవంతరావు, ఖైరతాబాద్, బాలాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన గణేష్ మండప నిర్వహకులు పాల్గొన్నారు.