Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
బడులు షురూ అవుతున్నారు.. పిల్లలను బడులకు ఎలా పంపాలా అనేదే తల్లిదండ్రులకు ముందు ఉన్న పెద్ద సవాల్. స్కూలు బస్సులు 18 నెలలుగా మూలనపడి ఉన్నాయి. కొన్నయితే తుక్కు కిందకే వెళ్లిపోయాయి. స్టీరింగ్, బ్రేకులు, గేర్లు, ఇతర స్పేర్ సామాన్లు సరిగ్గా ఉన్నాయో? లేదా? ఎవరు చెక్ చేసిన వారే లేరు. ఆర్టీఏ అధికారులు చెల్లుబాటు(వ్యాలిడ్) అయ్యే కాగితాలు ఉంటే చాలంటున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులెవరు? అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ గందగోళరలో ఇన్ని రోజులు మూలకపడిన బస్సుల్లో ప్రయాణమంటే పిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. పాఠశాలల ప్రారంభానికి మరో రెండ్రోజులు మాత్రమే ఉండడంతో వాహన ఫిట్నెస్ పరీక్షలను రవాణాశాఖ అధికారులు ఎలా నిర్వహిస్తారోనని, ప్రయివేటు యాజమాన్యాలు వాహనాల కండిషన్, ఇతర నిబంధనల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బడి బస్సులకు ఏడాదికోసారి ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. అంతేగాక వాహన కండిషన్ బాగుంటేనే బడి పిల్లలను తీసుకువెళ్లేందుకు అనుమతి లభిస్తుంది. ప్రతి ఏడాది జూన్లో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి రవాణాశాఖ అధికారులు స్కూల్ బస్సులకు వాహన సామర్థ్య పరీక్షలను నిర్వహిస్తారు. అంతేగాక బస్సుల నిర్వహణ పట్ల పాఠశాల యాజమాన్యాలు, వాహనాలు నడిపే డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభవుతున్న నేపథ్యంలో పాఠశాల, కళాశాలల బస్సులపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. స్కూళ్లు ప్రారంభానికి రెండ్రోజులు మాత్రమే గడువు ఉండటంతో బడి పిల్లల భద్రత దృష్ట్యా అధికారులు ఆయా పాఠశాలల యాజమాన్యాలకు వాహన సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక్క గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో సుమారు 10వేలకుపైగా బడి, కాలేజీ బస్సులుండగా.. రాష్ట్రవ్యాప్తంగా మరో 10వేలకుపైనే ఉంటాయి. అయితే కరోనా కారణంగా ఈ వాహనాలకు రెండేండ్లుగా వాహన సామర్థ్య పరీక్షలు నిలిచిపోయాయి. ప్రస్తుతం బడులు ప్రారంభంతో ఈ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్నాకే రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే కేసులు నమోదు చేసి బస్సులను సీజ్ చేస్తామని రవాణాశాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
లాక్డౌన్ కాలానికి ట్యాక్స్లు ఎలా కట్టాలి..?
కరోనా లాక్డౌన్ కారణంగా బడులు మూతపడ్డాయి. దీంతో ప్రత్యక్ష తరగతులకు బదులు ఆన్లైన్లో పాఠాలు కొనసాగాయి. స్కూళ్లు బంద్ కావడం, కేంద్ర మోటార్ వాహన నిబంధనల ప్రకారం బడి బస్సులను విద్యార్థుల రవాణాకు తప్ప.. ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. దీంతో 18 నెలలపాటు స్కూలు బస్సులు మూలనపడ్డాయి. కరోనా లాక్డౌన్ దెబ్బకు కార్పొరేట్ స్కూళ్లు మినహాయిస్తే.. ప్రయివేటు బడ్జెట్ స్కూళ్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాదిన్నర కాలంలో చాలా స్కూళ్లు కనీసం ట్యూషన్ ఫీజుల వసూలు చేయలేక.. కిరాయిలు, టీచర్ల జీతాలు చెల్లించలేక, నెలవారి ఇతర ఖర్చులు భరించలేక సుమారు వెయ్యి వరకు ప్రయివేటు స్కూళ్లు ఇప్పటికే మూతపడినట్టు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ కాలంలో పాఠశాల బస్సులను నడపకున్నా.. ఇప్పుడు ఆ సమయానికి సంబంధించిన ట్యాక్స్లు, పర్మిట్ ఫీజులతో పాటు మరో 40-50శాతం వరకు అపరాధ రుసుముతో సహా కట్టాలంటూ రవాణాశాఖ అధికారులు డిమాండ్ చేస్తుండడంతో స్కూల్ ఓనర్లు లబోదిబోమంటున్నారు. బస్సులు నడవని కాలానికి పన్నులు వసూలు చేయడం అన్యాయమని ఆవేదన చెందుతున్నారు. అసలే కరోనా కష్టకాలంలో ఉన్న తమకు ఇది మరింత ఆర్థిక భారమేనని వాపోతున్నారు. బడి బస్సులను నడపాని కాలానికి మినహాయింపు ఇవ్వాలని, సెప్టెంబర్ 1 నుంచి వర్తించేలా ట్యాక్సులు, పర్మిట్ ఫీజులు వసూలు చేయాలని రవాణాశాఖ, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి.