Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయంజాల్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక కోడ్ల రద్దు, రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీఓ లను వెంటనే జారీచేయాలనే ప్రధాన డిమాండ్లపై 'కార్మిక గర్జన' పేరుతో ఈనెల 8న రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ప్రారంభించనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాడిగళ్ల భాస్కర్, ఎం చంద్రమోహన్ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని సీఐటీయూ కార్యాలయం వద్ద గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి, కార్మిక వర్గాన్ని యాజామాన్యాలకు కట్టుబానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కరోనా కాలంలో కార్మికులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు, దీనికితోడు కార్మిక వ్యతిరేక కోడ్లతో కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనాల జీవోలను తొక్కిపెడుతున్నదని ఆరోపించారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమలలో కనీస వేతనాల జీవోలను వెంటనే విడుదల చేసి ప్రతి కార్మికునికి నెలకు రూ.21వేలు కనీస వేతనంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక గర్జన పేరుతో కొత్తూర్లో ఈనెల 8న ప్రారంభమయ్యే ఈయాత్ర శంషాబాద్, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, ఆర్సీఐ, తుక్కుగూడ, ఆదిబట్లకు, సెప్టెంబర్ 11న తుర్కయంజాల్ చౌరస్తాకు చేరుకుని అబ్దుల్లాపూరెమెట్ మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాకి వెళ్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిలా ఉపాధ్యక్షులు డి.కిషన్, డి.జగదీష్, జిల్లా కోశాధికారి ఎన్. మల్లేష్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి.కవిత, సహాయ కార్యదర్శి బి.సాయిబాబు, బుగ్గరాములు, ప్రేమాజి తదితరులు పాల్గొన్నారు.