Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పేదలందరికీ డబుల్బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతోపాటు ఇతర హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం, కరోనా కట్టడిలోనూ, అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడంలోనూకనీస వేతనాల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ అన్నారు. ఆ పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ, సౌత్ సిటీ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి బారిన కోట్లాది మంది పడ్డారని, లక్షలాది మంది మృతి చెందారని గుర్తు చేశారు. కరోనా, లాక్డౌన్ సందర్భంగా ఆదాయపన్ను పరిధిలోలేని పేదలకు రూ.7,500 ఇవ్వాలంటే కేంద్రానికి మనసొప్పడంలేదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లపాలన పూర్తిచేసుకున్నా ప్రజలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇండ్ల కోసం 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, 70 వేల ఇండ్లు పూర్తయినా పేదలకు పంపిణీ చేయడంలేదని, వెంటనే అర్హులైన వారికి ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ సౌత్ సిటీ కార్యదర్శి ఎన్.సోమయ్య మాట్లాడుతూ... ఉద్దీపన పథకాలతో కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు కల్పించిన కేంద్రప్రభుత్వం పేదలకు మాత్రం నయాపైసా ఇవ్వలేదన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, ప్రజాతంత్ర హక్కులపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ కంపెనీల్లో కార్మికులకు వేతనాలు పెంచకుండా కంపెనీలకు ప్రభుత్వం ఊడిగం చేస్తోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరథ్ మాట్లాడుతూ... కేంద్రప్రభుత్వ మతోన్మాద విధానాలతో దేశంలో దళితులు, గిరిజనులు, మహిళలకు రక్షణలేకుండాపోయిందన్నారు. రాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూమి హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ఉద్యోగాల్లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు దాపురించాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ సభ్యులు మహేందర్, గ్రేటర్ హైదరాబాద్ సౌత్ సిటీ కమిటీ సభ్యులు మీనా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వెంకటేష్, గ్రేటర్ హైదరాబాద్ సౌత్ సిటీ కార్యదర్శి సభ్యులు ఎం.లక్ష్మమ్మ, నాయకులు అజరుబాబు, మారన్న, ఆర్.వెంకటేష్, నరేష్, కుమారస్వామి, కామేష్బాబు, పి.మల్లేష్, పి.నాగేశ్వర్, శ్రవణ్కుమార్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.