Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర మహిళా సభల మూడో స్నాతకోత్సవ వేడుకలు బుధవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి కళాశాల కార్యదర్శి ప్రొఫెసర్ టి. కష్ణ కుమార్ ప్రారంభోపన్యాసం చేయగా, చైర్పర్సన్ ప్రొఫెసర్ సులోచన అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొ. ఆర్ లింబాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దుర్గాబాయి దేశ్ముఖ్ సంస్థ స్త్రీ సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పట్టాలు తీసుకుంటున్న వారందరూ వారి వృత్తి పట్ల గౌరవ భావంతో పనిచేస్తూ స్టూడెంట్లకు మంచి నడవడికను నేర్పించాలని సూచించారు. ఓయూ కంట్రోలర్ ప్రొ. శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్ర మహిళా సభలో మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు గాను కళాశాల యాజమాన్యాన్ని, వారి సేవాలను కొనియాడారు. వేడుకల్లో భాగంగా బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఈడీ, పీజీ డిప్లొమా ఇన్ ఈసీఈ, మూడు నెలల సర్టిఫికెట్ కోర్సుల్లో టాపర్స్గా నిలిచిన వారికి గోల్డ్ మెడల్స్, విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ ఎడవల్లి భాస్కర్ రావు, మల్లికార్జున, అన్నపూర్ణ, భాస్కర్, ఆడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రామ్ ప్రసాద్, ప్రెసిడెంట్ డీడీ ఏఎంఎస్ ఉషా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఉషా కందా, జనరల్ సెక్రటరీ డాక్టర్ లలిత కామేశ్వరి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. ఇందిరా, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.