Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదే అని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి అన్నారు. కుషాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి శశిధర్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభలో చర్లపల్లి, ఏఎస్ రావు నగర్ డివిజన్ల కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాప్రా మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 29 మందికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికను అందించి శాలువాలు, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, రాజకీయ నాయకులుగా, మేధావులుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా, దేశ సరిహద్దుల వద్ద కంటికి రెప్పలా కాపాడే జవాన్లుగా తయారుచేసే గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. చిన్నారులకు మొదటి గురువు తల్లిదండ్రులైతే పాఠశాలలో విద్యార్ధులకు దేశ సార్వభౌమత్వాన్ని ప్రబోధించే గురువులు ఉపాధ్యాయులని తెలిపారు. అలాంటి గురువులు మన పిల్లలు పాఠశాలలో కానీ బయట సమాజంలో గాని తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసిన సమయంలో సరిదిద్దడానికి చేసే ప్రయత్నాలను తప్పు పడుతుండడం దురదృష్టకరమని పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ అనంతరం విధినిర్వహణలో తమ శిష్యులు సాధించిన ఫలితాలను గుర్తు చేసుకుంటూ ఆత్మ సంతృప్తి పొందుతూ శేష జీవితం ప్రశాంతంగా గడపాలన్న ఆశాభావాన్ని ఎమ్మెల్యే సుభాష్రెడ్డి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రంగారెడ్డి, డీపీఆర్టీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి శ్రీధర్, పీఆర్టీయూ మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షులు రమేష్రెడ్డి, పీఆర్టీయూ నాయకులు విజరు కుమార్, కాప్రా మండల అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణ, మల్లేశం, యూటీఎఫ్ లక్ష్మీనారాయణ, గణేష్, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, నాయకులు సప్పిడి శ్రీనివాస్రెడ్డి, మణిపాల్రెడ్డి, జనంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి, కర్రే సత్యనారాయణ, రజిత, నిర్మల, కాసుల సురేష్గౌడ్, రమేష్ పాల్గొన్నారు.