Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
సీపీఐ మాజీ ఉప్పల్ మండల కార్యదర్శి మనోహర్ నాయక్ అనారోగ్యంతో యశోదా హాస్పిటల్లో 40 రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు. మనోహర్ నాయక్ మరణం సీపీఐ పార్టీకి తీరని లోటు అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్. బోస్ అన్నారు. ఈ సందర్భంగా మనోహర్ చిత్రపటానికి నీలం రాజశేఖర్రెడ్డి భవన్లో పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బోస్ మాట్లాడుతూ మనోహర్ ఉప్పల్ మండల కార్యవర్గ సభ్యులుగా, మండల కార్యదర్శిగా గతంలో పని చేశారని గుర్తు చేశారు. నిబద్ధతతో, పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ నిరంతరం తన సేవలను సీపీఐకి అందించారని తెలిపారు. మనోహర్ నిరంతరం ప్రజా పోరాటాలలో అగ్రభాగాన ఉండేవాడినీ, ఉద్యమాలు, ధర్నాల సందర్భంలో విప్లవ గేయాలతో ఆలాపన చేసి ప్రజలను చైతన్యం చేసేవాడని వారు గుర్తు చేశారు. మనోహర్ నాయక్ మండల కార్యదర్శిగా ఉన్న సమయంలో మల్లాపూర్ నూతన కూడలి వరకు రోడ్డు నిమిత్తం నిరంతర పోరు సల్పించాడనీ, మల్లాపూర్లో స్మశాన వాటిక నిర్మాణం గురించి పలుమార్లు ధర్నాల ద్వారా అధికార యంత్రాంగాన్ని కదిలించాడనీ, అలాంటి ప్రజా పోరాటాల్లో ముందుండి నడిపించిన మనోహర్ నేడు లేకపోవడం బాధాకరమన్నారు. మనోహర్ కుటుంబ సభ్యులకు సీపీఐ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి.దామోదర్రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్. శంకర్రావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి, సీపీఐ కాప్రా కార్యదర్శి లక్ష్మీ నారాయణ, నర్సింహా, సత్యనారాయణ, ఏఐటీయూసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి మిరియాల సాయిలు, జిల్లా అధ్యక్షుడు సత్య ప్రసాద్, సహాయ కార్యదర్శి ధర్మేంద్ర సంతాపం వ్యక్తం చేశారు.
a