Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మహోత్తర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 74 వార్షికోత్సవాల సందర్బంగా శుక్రవారం హిమాయత్నగర్ సత్యనారాయణరెడ్డి భవన్ ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి, నిరంకుశ నిజాం పాలనా అంతం కోసం తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని, ముస్లింలకు వ్యతరేకంగా కాదన్నారు. ప్రాణాలకు సైతం తెగించి వీరోచితంగా పోరాడి అమరులైన కమ్యూనిస్టుల వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రను ఎవరూ తుడిచేయలేరని, బీజేపీ నుంచి ఎవరన్నా తెలంగాణలో స్వతంత్ర సమరయోధులు ఉన్నారా అని ప్రశ్నించారు. కేవలం బీజేపీ రాష్ట్రంలో అధికారం కోసం నిస్సిగ్గు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూమ్ మొహియుద్దీన్ లాంటి పోరాట యోధులు నిర్మించిన అపూర్వ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో నేటి తరం ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేని ఆరెస్సెస్, బీజేపీ శ్రేణులు చరిత్రను వక్రీకరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం లొంగి రాష్ట్రంలో అధికారికంగా విలీన దినోత్సవాలను నిర్వహించడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్-17ను హైదరాబాద్ విలీన దినోత్సవంగా ప్రకటించి, ఈ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేస్తూ స్పూర్తిని కలిగించే వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు బి.స్టాలిన్, సీనియర్ సీపీఐ నాయకులు పి.ప్రేమ్ పావని, రాష్ట్ర సమితి సభ్యులు ఎస్.ఛాయాదేవి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు కమతం యాదగిరి, నెర్లకంటి శ్రీకాంత్, మహిళా సమాఖ్య నేత పడాల నళిని, నాయకులు ఆర్.మల్లేష్, సి.హెచ్.జంగయ్య, ఏఐఎస్ఎఫ్ నగర నేతలు గ్యార నరేష్, కంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.