Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించడంతోపాటు భరోసా కల్పించేందుకు సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ జి జగన్ తెలిపారు. బస్సుతో భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆర్టీసీ చెంగిచెర్ల డిపో పరిధిలోని చెంగిచెర్ల బస్టాండ్ వద్ద ప్రయాణికులతో మాట్లాడి ఆర్టీసీ అందిస్తున్న సేవలను వివరించారు. సురక్షితమైన, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం ఆర్టీసీ సంస్థ మాత్రమే అందిస్తుందని తెలిపారు. మహిళలు, బాలికలు, వృద్ధుల కోసం రాత్రి ఏడున్నర గంటల తర్వాత ఎక్కడ చేయెత్తిన అక్కడ బస్ను ఆపి ఎక్కించుకోవడం, కోరిన చోట సురక్షితంగా దింపటం జరుగుతుందని తెలిపారు. ప్రతి రూట్లో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది సూపర్ వైజర్లు వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు హామీ ఇస్తూ కరపత్రాలతో పాటు గులాబీ పూలను అందించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎన్ ఈసు, సూపర్ వైజర్లు, సిబ్బంది, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.