Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా అందరికీ ఆహార భద్రత కల్పించి, ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ తిరుమల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ కూడా ఆకలితో అలమటించకూడదనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని వివరించారు. ప్రభుత్వం అందించే వాటిని లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో ఆహార భద్రతా చట్టం అమలుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటుచేసిన విజిలెన్స్ కమిటీల పనితీరు, ప్రజలను చైతన్యపర్చేందుకు చేపడుతున్న కార్యక్రమాలు, సమస్యల పరిష్కారానికి చేపట్టిన మెకానిజం తీరుతెన్నులు తెలుసుకొనేందుకు క్షేత్రస్థాయిలో కమిషన్ పర్యటిస్తుందని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులకు అందుతోన్న సేవలు, వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే వివరాలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దీని ఫలితంగా ఇటీవల రాష్ట్రంలో మూడు లక్షల లబ్దిదారులకు కొత్తగా రేషన్ కార్డులు అందాయని తెలిపారు.
నాలుగు అంశాలపై ప్రత్యేక దృష్టి
కమిషన్ ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరించిందని, చౌక ధరల దుకాణాల ద్వారా నిరుపేద ప్రజలకు సకాలంలో నిత్యావసరాల సరుకులు, పాఠశాలలో పిల్లలకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, శిశువులకు పౌష్టికాహారం, బాలింతలకు కేసీఆర్ కిట్, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు అందచేస్తున్నారా లేదా అనే వివరాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. దీనికి సంబంధించి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని లబ్దిదారులకు చట్టం కల్పించిన హక్కులపై అవగాహన కలిగించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం విద్యార్థులతో పాటు గర్భిణులు, బాలింతలకు అందించాలన్నారు. ఈవిషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చూడాలని జిల్లా సంక్షేమాధికారికి సూచించారు. ఈసందర్భంగా జిల్లాలోని రేషన్ డీలర్లకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించగా దీనికి స్పందించిన వారు తమ సమస్యలను కమిషన్ ఛైర్మెన్కు విన్నవించారు. అనంతరం జడ్పీ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ ఆహార భద్రత కింద అమలవుతున్న పథకాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఏమైనా సమస్యలు ఉంటే తన దష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, సివిల్ సప్లయి, డీఎం అండ్ హెచ్ఓ మల్లికార్జున్ రావు, డీఆర్వో లింగ్యా నాయక్, డీఈవో ప్రసాద్, డీడబ్ల్యువో, ఆర్డీవోలు రవి, మల్లయ్య, రేషన్ డీలర్లు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.