Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రతిమలను నీటిలో వేసినప్పుడు కలుషితం కాకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. వినాయక విగ్రహాలను క్రేన్ ద్వారా నిర్దేశించిన చెరువుల్లో వేసిన వెంటనే తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గంలో భక్తులకు అవసరమైన తాగునీరు, టాయిలెట్స్ను ఏర్పాటు చేయడంతోపాటు ఆ మార్గంలో చెత్తా చెదారం, రాళ్లు, ఇతర వ్యర్థాలను తొలగించడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించామని తెలిపారు. నిమజ్జన ప్రక్రియ కోసం 162 గణేష్ యాక్షన్ టీమ్ ఏర్పాటు చేశామనీ, ఇందులో మొత్తం 8116 మంది సిబ్బంది నియమించినట్టు తెలిపారు. నిమజ్జనానికి వివిధ కెపాసిటీ గల 330 క్రేన్లను ఏర్పాటు చేయగా మూడు షిప్టుల్లో సిబ్బంది పని చేస్తారని తెలిపారు. మొత్తం 33 చెరువులు, 25 ప్రత్యేక కొలనుల్లో జరిగే నిమజ్జన ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేలా అన్ని విభాగాల సిబ్బందితోపాటు ఉన్నతాధికారు లను అప్రమత్తం చేశామని తెలిపారు. నిమజ్జనం రోజు మొత్తం 33 చెరువుల్లో 106 క్రేన్లను ఏర్పాటు చేశామనీ, ఇందులో ట్యాంక్ బండ్లో 33, హుస్సేన్సాగర్ ఎన్టీఆర్ మార్గ్లో 11 క్రేన్లు, నిమజ్జన వ్యర్థాలను తొలగించేందుకు ఎక్స్ లేటర్లు 20, జేసీబీలు 21, మినీ టిప్పర్లు 39, 10 టన్నుల సామర్థ్యం గల 44 వాహనాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో 101 ప్రాంతాల్లో స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి భక్తుల కోసం 30 లక్షల నీటి ప్యాకెట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్అండ్బీ డిపార్ట్మెంట్ ద్వారా బారికేడ్లు, వాచ్టవర్స్, వ్యూ కట్టర్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విపత్తులను ఎదుర్కొవడానికి నిమజ్జన మార్గాల్లో అగ్నిమాపకశాఖ ద్వారా 38 ఫైర్ వెహిక్సిల్స్తో సరూర్నగర్, ప్రగతినగర్, కాప్రా చెరువుల్లో ఒకొక్కటి చొప్పున మూడు బోట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టూరిజం శాఖ ద్వారా ట్యాంక్బండ్లో మూడు, నక్లెస్రోడ్లో రెండు బోట్స్తో పాటు మరో నాలుగు స్పీడ్ బోట్స్, పది మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్శాఖ ద్వారా విద్యుత్కు అంతరాయం కలుగకుండా నిరంత రంగా సరఫరా చేసేందుకు వివిధ ప్రాంతాల్లో 101 ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశామనీ, హుస్సేసాగర్ ప్రాంతాల్లో 48 ట్రాన్స్ఫార్మర్లు, సరూర్నగర్లో 5 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 41,284 వీధి దీపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు మేయర్ తెలిపారు.
నిమజ్జన ప్రాంతాల పరిశీలన..
వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, బల్దియా కమిషనర్ లోకేష్కుమార్, అధికారులతో కలిసి ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మేయర్ పాల్గొన్నారు. అనంతరం నక్లెస్ రోడ్డు నిమజ్జన ఏర్పాట్లపై పరిశీలించారు. అక్కడ నుంచి మేయర్ సరూర్నగర్ చెరువు, మన్సూరాబాద్ నిమజ్జన కొలను వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా ప్రతిమలను నీటిలో వేసిన వెంటనే తొలగించే ప్రక్రియను వేగవంతంగా చేయాలని ఆదేశించారు. భక్తులకు తాగునీరు, మాస్కులు పంపిణీ చేయాలనీ, మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సరూర్నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను అధికారులు మేయర్కు వివరించారు. 5 భారీ క్రెన్లను, 5 మొబైల్ బయో మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్టు, విద్యుత్తు దీపాలు, చెత్తను వెంటనే తొలగిం చేందుకు శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు మేయర్కు వివరించారు.