Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగింది. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడిలోకి చేరారు. భారీగా తరలివచ్చిన భక్తులతో హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. భారీగా తరలివచ్చిన అశేష జనవాహిని నడుమ ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతికి వీడ్కోలు పలికారు. రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూను రూ.18.90లక్షలకు దక్కించుకున్నారు. గణేష్ శోభాయాత్ర సందర్భంగా నిర్వహించిన నృత్యాలు, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. కోవిడ్ కారణంగా గతేడాది ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించిన ప్పటికీ ఈసారి ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నగర సీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, ఇతర విభాగాధిపతులు, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసుల ప్రత్యేక చొరవతో నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా కొనసాగింది.
ఖైరతాబాద్ మహా శోభాయాత్ర ఇలా..
ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర ఉదయం 8.19గంటలకు ప్రారంభమైంది. సుమారు 6 గంటలకుపైగా కొనసాగిన యాత్ర ఖైరతాబాద్, సెన్సెషన్ థియేటర్, రాజ్దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, తెలుగుతల్లి ప్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా క్రేన్ నెం.4 వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు ట్యాంక్బండ్ మీదకు చేరుకున్నప్పటికీ క్రేన్ వద్ద గంటపాటు నిలిపివేశారు. ఇదే సమయంలో భక్తుల తాకిడి పెరిగింది. గంట తర్వాత మహాగణపతికి తుది పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమంలో మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక రాజకీయ నాయకులు, ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షులు సుదర్శన్, ఆయన తనయుడు రాజ్కుమార్ తదితరులు పాల్గ్గొన్నారు. అనంతరం 3.19గంటలకు ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేశారు. అయితే గతేడాది ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం మధ్యాహ్నం 1.40గంటలకు పూర్తవ్వగా ఈసారి దారి మధ్యలో అక్కడక్కడ చెట్ల కొమ్మలు అడ్డురావడం, ఒక్కసారిగా వర్షం కురవడంతో దాదాపు గంటన్నరకుపైనే ఆలస్యంగా నిమజ్జనం జరిగింది.
వచ్చే ఏడాది మట్టి వినాయకుడు
వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయకున్ని ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిర్వాహకులు హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి వినాయకున్ని ప్రతిష్టించి అక్కడే నిమజ్జనం చేయనున్నట్టు కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఏడాది పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని ఉత్సవ కమిటీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.
మంత్రుల ఏరియల్ వ్యూ..
గ్రేటర్లోని పలు ప్రాంతాలలో జరుగుతున్న గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు హెలికాప్టర్లో బయలుదేరి జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలలో ఏరియల్ వ్యూ నిర్వహించారు. మంత్రుల వెంట డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ అంజనీకుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజలు పాల్గొనే హైదరాబాద్లో నిర్వహించే గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ..
బాలాపూర్ గణేశుడి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్యాదవ్తో కలసి నాదర్గుల్వాసి మర్రి శశాంక్రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగలకృష్ణారెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు 2019లో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి వేలంపాటకు వచ్చారు. 2019లో రూ.17.60 లక్షలకు రాంరెడ్డి లడ్డూను దక్కించుకున్న విషయం తెలిసిందే. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొవిడ్ కారణంగా గతేడాది వేలంపాట జరగని విషయం తెలిసిందే. మరోవైపు భజన బృందం, డప్పు చప్పుళ్ల సందడి నడుమ బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు వైభవంగా సాగింది. బాలాపూర్ ప్రధాన వీధుల్లో కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు.