Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణాలు ఇప్పిస్తానంటూ ప్రజల నుంచి లక్షలాది రూపాయలు దండుకుని మోసగించిన ముద్ర సంస్థ చైర్మెన్ తిప్పినేని రామదాసు అప్పనాయుడు తన అక్రమాలు వెలికితీసి బాధితుల పక్షాన నిలిచి వార్తా కథనాలు ప్రచురించిన ఓ పత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నాడు. అందులోభాగంగా కొత్త డ్రామాకు తెరలేపాడు. తాను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిని అని నకిలీ హ్యూమన్ రైట్స్ లెటర్ హెడ్ సృష్టించి తప్పుడు కథనాలు రచించిన పత్రిక ఎడిటర్ జర్నలిస్టులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నల్లకుంట పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నల్లకుంట సీఐ రవిని హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేశాడు. ఈలెటర్ హెడ్ పై స్పందించిన పోలీసులు తెలంగాణ హ్యూమన్ రైట్స్కు సమాచారం అందించగా నకిలీ లెటర్ హెడ్ అని తెలిసిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలిపిందన్నారు.