Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మాదిగ ప్రొఫెసర్లకు ఉన్నత పదవులు కేటాయించడంలో వీసీ రవీందర్ వివక్ష చూపిస్తున్నారని, ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని టీఎస్ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఓయూ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాదిగలే ముందుండి ఉద్యమాన్ని నడిపించారని, అలాంటివారిపై వివక్ష చూపడం సరికాదన్నారు. ఉన్నత పదవుల్లో మాదిగ ప్రొఫెసర్లకు అవకాశం కల్పిచాలని, లేకుంటే వీసీ బిల్డింగ్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీల సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందిన నిరుపేదలను ఎలాంటి సమాచారం లేకుండా విధుల నుంచి తొలగిండచంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఇష్టారాజ్యంగా యూనివర్సిటీ బడ్జెట్ని వీసీ వృథా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే యూనివర్సిటీ హాస్టళ్లలో పూర్తిస్థాయిలో మెస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వరిగడ్డి చందు, గుమ్మడవెల్లి తిరుమలేష్, జన్నారపు జీవన్, ధర్మారపు శ్రీకాంత్, ఎల్.నాగరాజ్, మొగిలిపక కిరణ్ తదితరులు పాల్గొన్నారు.