Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
బాగ్లింగంపల్లిలోని రాజీవ్ గాంధీ కాలనీలో ఓ వ్యక్తి హౌజింగ్ స్థలంలో కొందరు కాలనీ వాసులు అక్రమంగా కాలనీ బోర్డును ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ పావని నేతృత్వంలో అధికారులు, సిబ్బంది కలిసి కాలనీలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన బోర్డును నేలమట్టం చేశారు. దీంతో అధికారులు, కాలనీవాసుల మధ్య కొంత వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి స్థలం నవాబుకాలం నాటిదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరికి పొజిషన్ ఇళ్ల పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు కాలనీకి చెందిన సాబీర్, షాహెద్, సంధ్య, హర్షద్, మాణిక్యమ్మ, కల్యాణి, ఫాతిమా తదితరులు టౌన్ప్లానింగ్ అధికారులతో వాదనకు దిగారు. ఇవి తప్పుడు ధవపత్రాలని, అసలైన పత్రాలు ఉంటే తమ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని అధికారులు బోర్డును తొలగించివెళ్లారు. దీంతో అధికారులు వెళ్లిన కొద్ది సేపటికే మళ్లీ బోర్డును ఏర్పాటు చేయడం కొసమెరుపు. ఈసందర్భంగా హౌజింగ్ డీఈ రాంకుమార్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కాలనీలోని స్థలం తమ శాఖదేనన్నారు. అందులో కబ్జా చేసే యత్నాలను సాగనివ్వబోమని ఆయన హెచ్చరించారు. ఏసీపీ పావని మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో కొందరు స్థలం కొట్టేసేందుకు కాలనీ వాసులను కొందరు మభ్యపెడుతున్నారని అలాంటి వారి ఆటలను సాగనివ్వబోమన్నారు.